పణజి: మీ సెల్ఫోన్, సిమ్కార్డును వినియోగించకుండానే మీ నంబర్ నుంచి ఎవరైనా ఫోన్ చేసుకోవచ్చు… అదీ మీకు తెలియకుండా..?, ఇదేలా సాధ్యం అనుకంటున్నారా..?. ఇదంతా సాధ్యమేనని కొందరు సైబర్ నిపుణులు నిరూపించారు. ప్రస్తుత జీఎస్ఎం మొబైల్ నెట్వర్కుల్లోని డొల్లతనాన్ని ఇలా ఎత్తిచూపారు. సైబర్ భద్రతపై ఇక్కడ జరిగిన ఓ వార్షిక సదస్సులో మ్యాట్రిక్స్ షెల్ అనే ఎథికల్ హ్యాకర్ల బృందం వినియోగదారులను ఎలా మోసం చేయవచ్చునో చూపింది. అంతర్జాతీయ స్థాయిలో అనేక టెలికాం నెట్వర్కుల్లో సరైన ప్రమాణాలు లేవని సైబర్ నిపుణులు వెల్లడించారు.
టెలికాం ఆపరేటర్లు సిగ్నల్స్ను రహస్య సంకేతాలుగా(ఎన్క్రిప్ట్) మార్చడం లేదని తెలిపారు. దీనికితోడు వినియోగదారుల గుర్తింపులో కూడా లోపాలున్నాయని తేల్చారు. ‘వినియోగదారు కాల్/మెసేజ్ చేసిన ప్రతిసారీ వాటికి తాత్కాలిక గుర్తింపు(టీఎంఎస్ఐ) సంఖ్యను ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే చాలామంది ఆపరేటర్లు ఇలా ఎప్పుడూ ఒకే టీఎంఎస్ఐ సంఖ్యను వాడుతున్నారు. హ్యాకర్లకు ఈ సంఖ్య తెలిస్తే వినియోగదారుకు తెలియకుండానే వారి నంబర్ నుంచి కాల్ చేసుకోవచ్చు. వారికి వచ్చే కాల్స్నూ వినవచ్చు’ అని మ్యాట్రిక్స్ షెల్ నిపుణులు వివరించారు.













