దేశంలో మొబైల్ సిమ్ పొందడానికి టెలికం ఆపరేటర్లు ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానంలో భారీ మార్పులు జరగబోతున్నాయి. టెలికం ఆపరేటర్ల నుంచి కొత్త సిమ్ పొందడానికి ఆధార్ నంబరు ఆధారంగా ఈ-కేవైసీ విధానం అమలులో ఉంది. ఇకపై ఇది వినియోగదారులకు ఎంతో ఉపయోగకరంగా, సులభతరంగా ఉంది. అయితే ఆధార్ సమాచారం గోప్యత విషయంలో వెలువడిన ఫిర్యాదుల నేపథ్యంలో సెప్టెంబరు 26న సుప్రీంకోర్టు ఒక తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ప్రకారం ప్రైవేటు సంస్థలు వినియోగదారుల ఆధార్ వివరాలను కలిగి ఉండటాన్ని నిషేధించారు. ఈ కోవలోకే టెలికం సంస్థలు కూడా వచ్చాయి. దీనితో కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ ప్రస్తుతం ఉన్న విధానాన్ని నిలిపివేయాలని టెలికం ఆపరేటర్లను కోరింది.
Department of Telecommunications (DoT) నవంబర్ 5వ తేదీ నుంచి ఆధార్ తో కాకుండా కొత్త ఈకెవైసీ ద్వారా సిమ్ అనుసంధానం చేసుకోవాలంటూ పిలుపునిచ్చింది. నవంబరు 5వ తేదీ నుంచి కొత్త విధానంలో వినియోగదారుల వివరాలు సేకరించి సిమ్లు జారీచేయాలని ఆదేశాలు జారీ చేసింది.
టెలికం పరిశ్రమ ఇందుకు సంబంధించి సంయుక్తంగా టెలికమ్యూనికేషన్స్ శాఖకు కొత్త కేవైసీ (నో యువర్ కస్టమర్) విధానం గురించి ఒక నివేదికను అందజేసింది. దీని ప్రకారం దేశీయ టెలికాం దిగ్గజాలైన రిలయన్స్ జియో, ఎయిర్టెల్ వంటి కంపెనీలు కొత్త కేవైసీ ద్వారా సిమ్ కార్డులను అందించే పనికి శ్రీకారం చుట్టాయి.
దీని ప్రకారం టెలికం ఆపరేటర్లు కొత్త సిమ్ల కోసం వచ్చే వినియోగదారుల ఫొటోలను అక్కడికక్కడే తీసి వ్యక్తి గుర్తింపు, చిరునామా గుర్తింపు వివరాలను స్కాన్చేసి డిజిటలైజ్ చేస్తారు. అనంతరం కొత్త సిమ్లను ఈ వివరాల ఆధారంగా జారీచేస్తారు. ఆధార్తో ఈ-కేవైసీ విధానాన్ని మాత్రం నిలిపివేస్తారు.
సుప్రీం తీర్పుతో టెలికాం దిగ్గజాలు ఐడియా వొడాఫోన్, రిలయన్స్ జియో, ఎయిర్టెల్, భారతి ఎయిర్ టెల్ వంటి సంస్థలు దేశ వ్యాప్తంగా ఈ కొత్త కొత్త కేవైసీ విధానాన్ని ప్రారంభించాయి. ఇకపై యూజర్లు ఈ ప్రాసెస్ ద్వారానే సిమ్ కార్డులు తీసుకువాలని చెప్పాయి. అలాగే తమ ఏజెంట్లకు కూడా ఇదే విషయాన్ని తెలియజేశాయి.
ఇప్పటికే తీసుకున్న బ్యాంకు ఖాతాలు, బీమా పాలసీల్లో ఈ నిబంధనలు పాటించనివారు ఎందరో ఉన్నారు. చిరునామాలు సరిగ్గా లేకపోవడం, ఫోన్ నెంబర్లు, ఈ మెయిల్ మారినా వాటి గురించి సంబంధిత సంస్థలకు చెప్పకపోవడంతో బ్యాంకులు, బీమా సంస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ కొత్త విధానం ద్వారా ఈ సమస్య నుంచి గట్టెక్కే అవకాశం ఉంది.