భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో చరిత్ర సృష్టించింది. పీఎస్ఎల్వీ సీ-48 ప్రయోగం విజయవంతమైంది. అది నిప్పును చీల్చుకుంటూ నింగిలోకి వెళ్లింది. ఏపీలోని నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం మధ్యాహ్నం 3.25గంటలకు మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన ఈ రాకెట్ ప్రయోగం విజయవంతం అయినట్లు ఇస్రో చైర్మన్ శివన్ ప్రకటించారు. 5సంవత్సరాల పాటు పీఎస్ఎల్పీ సీ48 సేవలందించనున్నట్లు ఆయన తెలిపారు. శాస్త్రవేత్తల బృందానికి శివన్ అభినందనలు తెలిపారు.
310 విదేశీ ఉపగ్రహాల్ని నింగిలోకి చేర్చిన ఇస్రో ఈ ప్రయోగం విజయవంతంతో ఆ సంఖ్య 319కి చేరింది. కాగా శ్రీహరికోట నుంచి ఇది 75వ ప్రయోగం. ఇస్రో ప్రయోగాల్లో పీఎస్ ఎల్పీ రాకెట్ కు ప్రత్యేక స్థానం ఉంది. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన రాకెట్లలో ఇది ఒకటిగా చెప్పవచ్చు.
ఇప్పటివరకూ శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి 49పీఎస్ఎల్వీ మెషీన్లు లాంచ్ అయిన విషయం తెలిసిందే. 49 ప్రయోగాల్లో రెండు మాత్రమే విఫలమయ్యాయి. పీఎస్ఎల్పీ 50వ మిషన్ నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. ఈ వాహకనౌక ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 11 ఉపగ్రహాలను నింగిలోకి పంపింది.
భారత్కు చెందిన ఆర్ఐఎస్ఎటి-2బి ఆర్ఐ1 ఉపగ్రహంతోపాటు మరో తొమ్మిది విదేశీ నానో ఉపగ్రహాలను ఈ రాకెట్ ద్వారా ప్రయోగించారు. నానో ఉపగ్రహాల్లో ఇజ్రాయిల్, ఇటలీ, జపాన్కు సంబంధించి ఒక్కటి చొప్పున, ఎఎస్ఎకు చెందిన ఆరు ఉన్నాయి. భూ వాతావరణం,విపత్తులతో పాటుగా రక్షణరంగానికి కూడా రీశాట్-2 బీఆర్1 ఉపగ్రహం ఉపయోగపడనుంది. 35 సెంటీమీటర్ల దూరంలోని వస్తువులను కూడా రీశాట్-2 బీఆర్1 సృష్టంగా చూపించగలదు.
ఇస్రో ఘనతలో పీఎస్ఎల్వీ రాకెట్ పాత్ర విశేషమైనది. రికార్డుల మీద రికార్డుల తిరగరాస్తున్న ఇస్రోలో పీఎస్ఎల్వీ అత్యంత కీలకంగా మారింది. ఎన్నో అనితరసాధ్య ప్రయోగాలకు ఈ రాకెట్ సాక్ష్యంగా నిలిచింది. శ్రీహరికోట నుంచి ఇవాళ రీశాట్2ను కూడా పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారానే ప్రయోగించారు. పీఎస్ఎల్వీ రాకెట్ను ఇస్రో ప్రయోగించడం ఇది 50వ సారి. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ శివన్ ప్రత్యేక పుస్తకాన్ని ఆవిష్కరించారు. పీఎస్ఎల్వీ ఆధునీకరణలో కృష్టి చేసిన గత ఇస్రో శాస్త్రవేత్తల గురించి ఈ పుస్తకంలో సవివరంగా ప్రచురించారు. నేవిగేషన్ వ్యవస్థలో వస్తున్న మార్పులను ఇస్రో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉన్నది.
ఈ సందర్భంగా శివన్ మాట్లాడుతూ అంతరిక్షంలోకి పీఎస్ఎల్వీ వెళ్లని చోటు లేదని ఆయన తెలిపారు. పీఎస్ఎల్వీ రాకెట్.. మూన్, మార్స్కు వెళ్లింది. ఇప్పుడు సూర్యుడి దగ్గరకు కూడా వెళ్లనున్నట్లు ఆయన చెప్పారు. ఎస్ఎస్ఎల్వీ మిషన్ కూడా ప్రయోగించాల్సి ఉన్నదన్నారు. సీ-48 ఈ ఏడాది చివరి ప్రయోగం అని శివన్ తెలిపారు.మునుముందు మరిన్ని మిషన్లు చేపట్టాల్సి ఉన్నదని ఇస్రో చైర్మన్ తెలిపారు. ప్రతి మిషన్ను అత్యంత విజయవంతంగా చేపట్టాలన్నారు.