వాట్సాప్లో సర్కార్ సేవలు.. దేశంలోనే తొలిసారి ఆంధ్రప్రదేశ్ సంచలనం!
WhatsApp Governance: ఆంధ్రప్రదేశ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా వాట్సాప్ ద్వారా పాలన సేవలు అందుబాటులోకి తెచ్చిన రాష్ట్రంగా ఘనత సాధించింది. ఇకపై ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ విప్లవాత్మక మార్పును ప్రకటించారు. నేడు అంటే జనవరి 30వ తేదీ నుంచి ఈ సరికొత్త శకం ప్రారంభం కానుంది. ఏకంగా 161 ప్రభుత్వ సేవలు మీ అరచేతిలో, వాట్సాప్లోనే.
* అసలు ఈ వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఏంటి
ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండానే, మీ వాట్సాప్ నుంచే ప్రభుత్వ సేవలందించే ఒక గొప్ప వ్యవస్థ ఇది. ఈ అద్భుతమైన ఫ్లాట్ఫామ్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మెటా సంస్థతో చేతులు కలిపింది. 2024, అక్టోబర్ 22న ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ప్రజా సేవలను మరింత వేగంగా, సులభంగా, సమర్థవంతంగా అందించడమే దీని ముఖ్య ఉద్దేశం.

* వాట్సాప్ గవర్నెన్స్ను ప్రారంభించేది అతనే
ఆంధ్రా ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ అధికారికంగా లాంచ్ చేయబోతున్నారు. ఇంతకుముందే, ముఖ్య కార్యదర్శి కె. విజయానంద్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఒక రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఆ మీటింగ్లో వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవల్ని ఎలా ఉపయోగించాలో డెమో కూడా చూపించారు.
* మొదటి దశలో ఈ సేవలు
మొదటి దశలో ఒకటి కాదు, రెండు కాదు... ఏకంగా 161 రకాల సేవలు వాట్సాప్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. రెవెన్యూ శాఖ (భూ రికార్డులు, ఆస్తుల వివరాలు), ఎండోమెంట్స్ శాఖ (దేవాలయాల సేవలు), ఎనర్జీ శాఖ (కరెంట్ సేవలు), APSRTC (బస్సు టికెట్లు, రవాణా సేవలు), అన్న క్యాంటీన్లు (తక్కువ ధరకే భోజనం) అందుబాటులోకి వస్తాయి.
అంతేకాదు, సీఎం రిలీఫ్ ఫండ్ (ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు), మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ (నీరు, పారిశుద్ధ్యం, ఇతర మునిసిపల్ సేవలు) వంటి ముఖ్యమైన శాఖల సేవలు అన్నీ మీ వాట్సాప్లోనే లభిస్తాయి. ఇంకా చాలా సేవలు రెండో దశలో రాబోతున్నాయి. అవి త్వరలోనే ప్రకటించనున్నారు.
* ప్రయోజనాలు
సామాన్యులకు దీని వల్ల కలిగే లాభాలు చెప్పలేనన్ని ఉన్నాయి. ఇకపై మీరు సర్టిఫికెట్ల కోసం, పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాల ముందు క్యూలలో గంటల తరబడి నిలబడాల్సిన అవసరం లేదు. అన్నీ మీ వేలిముద్రల చివర్లోనే, క్షణాల్లో జరిగిపోతాయి. సమయం ఆదా అవుతుంది, కాగితపు పని తగ్గుతుంది. పాలన మరింత అందుబాటులోకి వస్తుంది, మరింత సమర్థవంతంగా మారుతుంది.
* మరి సెక్యూరిటీ పరిస్థితి ఏంటి
అయితే అన్ని పనులు ఆన్లైన్లోనే జరిగితే సైబర్ నేరగాళ్ల నుంచి ముప్పు ఉంటుంది. అందుకే ప్రజల వ్యక్తిగత డేటాకు భద్రత కల్పించడం చాలా ముఖ్యం అని ముఖ్యమంత్రి నొక్కి చెప్పారు. డేటా చోరీలు జరగకుండా, మోసాలు జరగకుండా కఠినమైన భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఫోరెన్సిక్, సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్లు పటిష్టంగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డిజిటల్ పాలనలో దేశానికే ఆదర్శంగా నిలవాలని చూస్తోంది. ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఆ దిశగా ఒక పెద్ద ముందడుగు. టెక్నాలజీతో ప్రజలకు సేవలు అందించడంలో ఆంధ్రప్రదేశ్ ఒక బెంచ్మార్క్ను సెట్ చేస్తోంది. ఈ మోడల్ విజయవంతమైతే, ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి డిజిటల్ గవర్నెన్స్ సొల్యూషన్స్ను అనుసరించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








