వామ్మో, ఉబర్ అధిక ధరల వెనుక ఇంత మోసం జరుగుతోందా.. సంచలన నిజాలు బయటపెట్టిన ఢిల్లీ వ్యక్తి..!
ఈరోజుల్లో చాలామంది, ముఖ్యంగా ఉద్యోగస్తులు రోజూ రాపిడో, ఉబర్, ఓలా వంటి యాప్ క్యాబ్ సర్వీసులపై పూర్తిగా ఆధారపడుతున్నారు. వీటితో రోజువారీ ప్రయాణాలు చాలా సౌకర్యంగా మారిపోయాయి అయితే, రద్దీ సమయాల్లో వీటి ధరలు అమాంతం పెరిగిపోతుండటంతో ప్రయాణికులకు అధిక ఛార్జీలు చెల్లించుకోక తప్పడం లేదు.
ఈ ధరల పెరుగుదల వెనుక గల కారణాలపై ఎప్పటినుంచో చర్చ జరుగుతోంది, ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి తాజాగా ఉబర్ ధరల విధానంపై కొన్ని సంచలన విషయాలను వెల్లడించారు.

* ధరలపై ప్రయోగం
ఇంజనీర్హబ్ సహ వ్యవస్థాపకుడు రిషబ్ సింగ్ అనే వ్యక్తి తన ఎక్స్ అకౌంట్లో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. స్మార్ట్ఫోన్ రకాలు, బ్యాటరీ లెవెల్స్ బట్టి ఉబర్ ఛార్జీలు ఎలా మారుతున్నాయో తెలుసుకోవడానికి ఆయన ఒక ప్రయోగం చేశారు.
ఒకే ఉబర్ ఖాతాలో లాగిన్ అయి ఉన్న నాలుగు వేర్వేరు ఫోన్లలో (రెండు ఆండ్రాయిడ్, రెండు ఐఫోన్లు) కనిపించిన ఛార్జీల ఫొటోలను రిషబ్ పోస్ట్ చేశారు.
రిషబ్ సింగ్ వెల్లడించిన ఫలితాలు నిజంగా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఒకే సమయానికి, ఒకే గమ్యస్థానానికి బుక్ చేసిన క్యాబ్కు వేర్వేరు పరికరాల్లో వేర్వేరు ఛార్జీలు కనిపించాయి. అంతేకాదు, ఫోన్ బ్యాటరీ తక్కువగా ఉన్నవారికి ఛార్జీలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అతడు గుర్తించారు.
"తక్కువ బ్యాటరీ ఉన్నవారు తొందరలో ఉన్నారని, ఎక్కువ ఛార్జీలు చెల్లించడానికి సిద్ధంగా ఉంటారని ఉబర్ భావిస్తున్నట్లు ఇది సూచిస్తుంది" అని సింగ్ వివరించారు.
* డిస్కౌంట్లలో సైతం తేడా
ఒకే అకౌంట్కు లాగిన్ అయినా, వేర్వేరు డివైజ్ల్లో ఉబర్ అందించే డిస్కౌంట్లు కూడా భిన్నంగా ఉన్నాయి. సాధారణంగా ఆండ్రాయిడ్ ఫోన్లతో పోలిస్తే iOS డివైజ్ల్లో ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి ధరల విధానాల పారదర్శకతపై రిషబ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు.
"కస్టమర్లకు అన్నీ ముందే తెలియజేయాలి. ఫోన్ ఏది, బ్యాటరీ ఎంత ఉంది అనే వాటిని బట్టి ఛార్జీలు మారుతున్నాయా లేదా అనేది కంపెనీలు దాచకుండా చెప్పేయాలి. అంతేకాకుండా, వారి అల్గారిథమ్స్ కూడా నైతికంగా పనిచేసేలా ఉండాలి." అని సింగ్ అన్నారు.
* నెట్టింట వైరల్..
ఈ ప్రయోగం క్షణాల్లో వైరల్ అయింది. చాలామంది కస్టమర్లు ఇలాంటి అనుభవాలను పంచుకున్నారు. ఒక నెటిజన్ స్పందిస్తూ, ఓలా వంటి ఇతర వేదికలు కూడా ఇలాంటి వ్యూహాలనే అనుసరిస్తున్నాయని, "ఐఫోన్ కలిగి ఉండటం నేరంలా అనిపిస్తుంది, ఎందుకంటే ఛార్జీలు ఎక్కువగా ఉంటాయి" అని వ్యాఖ్యానించారు.
మరో నెటిజన్ భిన్నమైన కోణాన్ని జోడించారు. ఎత్తును బట్టి కూడా ధరలు మారవచ్చని సూచించారు. "మీరు 10వ అంతస్తు నుంచి క్యాబ్ బుక్ చేయడానికి ప్రయత్నించండి. రోడ్డుపై నిలబడితే ఒకలా, 10వ అంతస్తు నుంచి బుక్ చేస్తే తక్కువ ధరలో త్వరగా క్యాబ్ వస్తుంది" అని ఆయన అన్నారు.
అయితే, మరికొందరు మాత్రం ధరల వ్యత్యాసాలకు కారణం పర్సనలలైజ్డ్ డిస్కౌంట్లు కావచ్చని, డివైజ్ టైప్ లేదా బ్యాటరీ పర్సంటేజ్ కాదని వాదించారు.
ఇప్పటివరకు ఉబర్ ఇండియా ఈ ఆరోపణలపై స్పందించలేదు. రిషబ్ సింగ్ చేసిన ఈ ఎక్స్పెరిమెంట్ యాప్ ఆధారిత సేవల ధరల అల్గారిథమ్ల నిజాయితీపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది. కస్టమర్లు మరింత స్పష్టత, జవాబుదారీతనం కోసం డిమాండ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications








