X (ట్విట్టర్)లో కీలక ఫీచర్.. వెరిఫైడ్ అకౌంట్ల నుంచి మాత్రమే రిప్లయ్ ఇవ్వగలరు..!
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ X (ట్విట్టర్)లో గత కొన్ని నెలలుగా కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. X ప్లాట్ఫాంను ఎవ్రీథింగ్ యాప్గా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు సీఈవో లిండా ఇప్పటికే వెల్లడించారు. ఆ దిశగానే తమ కార్యాచరణ ఉందని ఇప్పటికే ప్రకటించారు.
అయితే X లో తాజాగా కీలక ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఏదైనా వెరిఫైడ్ అకౌంట్ పోస్టుపై ఎవరు రిప్లయ్ ఇవ్వాలో ఈ ఫీచర్ ద్వారా నియంత్రణ చేయవచ్చు. తాజాగా వచ్చిన వెరిఫైడ్ అకౌంట్లు మాత్రమే అనే ఆప్షన్ను ఎంచుకుంటే వారు మాత్రమే రిప్లయ్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఆప్షన్ కారణంగా వేధింపులు, ట్రోలింగ్ తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ ఫీచర్కు సంబంధించిన స్క్రీన్షాట్ను X షేర్ చేసింది. అయితే ఇటువంటి ఫీచర్ X (ట్విట్టర్)లో ఇప్పటికే అందుబాటులో ఉండగా.. దానికి 'వెరిఫైడ్ అకౌంట్లు' మాత్రమే అనే ఆప్షన్ను తాజాగా జతచేసింది. ఓ యూజర్ ఏదైనా ఫోస్టు చేసినప్పుడు అతనికి 'ఎవ్రీవన్', 'అకౌంట్స్ యూ ఫాలో', 'ఓన్లీ అకౌంట్స్ యూ మెన్షన్' అనే ఆప్షన్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. తాజాగా వాటికి వెరిఫైడ్ అకౌంట్లు అనే ఆప్షన్ను జతచేసింది.
ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ X తీసుకొచ్చిన మార్పులపై.. ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు. ఈ ఫీచర్ నకిలీ ఖాతాల నియంత్రణకు ఎంతగానే ఉపయోగపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు X (ట్విట్టర్) అధికారిక పోస్టుపై స్పందించారు.
ఈ నిర్ణయం మరికొంత మంది యూజర్లను వెరిఫైడ్ ఖాతాలవైపు మళ్లించే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లు వెరిఫైడ్ ఖాతా పొందాలంటే నెలకు రూ.900 చెల్లించాల్సి ఉంటుంది. అయితే వీరికి ఇతర యూజర్లతో పోలిస్తే అనేక సౌకర్యాలు ఉంటాయి. వెరిఫైడ్ యూజర్లు తమ పోస్టులను ఎడిట్ చేసుకోవచ్చు. మరియు పోస్టులకు ఎటువంటి లిమిట్ ఉండదు.. అంటే పదాల పరిమితి ఉండదు. మరియు పెద్ద వీడియోలను సైతం పోస్టు చేయవచ్చు.
X ప్లాట్ఫాంను త్వరలో పూర్తిస్థాయి ప్రీమియం యాప్గా మార్చనున్నట్లు తెలుస్తోంది. అంటే ప్రతి X యూజర్ కనీస మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. గత నెలలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో జరిగిన సంభాషణ సందర్భంగా ఎలాన్ మస్క్ ఈ విధానం గుర్తించి చర్చించారు. అయితే ఈ విధానాన్ని అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సీఈవో లిండా స్పష్టం చేశారు.
ఇందుకోసం మూడు రకాల ప్రీమియం సబ్స్క్రిప్షన్ మోడల్లను పరీశీలిస్తున్నట్లు X సీఈవో వెల్లడించారు. ప్లాట్ఫాంలో వచ్చే యాడ్ల ఆధారంగా చెల్లింపులు చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫ్లాట్ఫాంను వినియోగిస్తున్న ప్రతి ఒక్కరూ కనీస చెల్లింపులు చేయాల్సి ఉంటుందని సమాచారం. X ప్లాట్ఫాంను అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై బ్యాంకర్లకు ఇచ్చిన సమాచారంలో ఈ వివరాలు ఉన్నట్లు తెలుస్తోంది.
X ( ప్రీమియం) ప్లాన్లు బేసిక్, స్టాండర్డ్, ప్లస్లు విభజించారు. బేసిక్ యూజర్లు పుల్ యాడ్స్ను చూడాల్సి ఉంటుంది. అదే స్టాండర్డ్ యాజర్లకు సగం యాడ్స్ మాత్రమే కనిపిస్తాయి. అదే ప్లస్ యూజర్లకు ఎటువంటి యాడ్స్ కనిపించవని తెలుస్తోంది. అయితే ఈ విధానం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందన్న సమాచారం వెల్లడి కాలేదు.


Click it and Unblock the Notifications