వాట్సప్ అడ్మిన్లకు పోలీసుల దిమ్మతిరిగే హెచ్చరిక, ఇకపై కటకటాల్లోకే !
సోషల్ మీడియా మెసేజింగ్ రంగంలో ఇప్పుడు వాట్సప్ అమితవేగంతో దూసుకుపోతోంది. అయితే ఏది నిజమో ఏది అబద్దమో తెలియకుండానే అనేక రకాలైన వార్తలు గ్రూపుల్లో సర్కులేట్ అవుతున్నాయి.
సోషల్ మీడియా మెసేజింగ్ రంగంలో ఇప్పుడు వాట్సప్ అమితవేగంతో దూసుకుపోతోంది. అయితే ఏది నిజమో ఏది అబద్దమో తెలియకుండానే అనేక రకాలైన వార్తలు గ్రూపుల్లో సర్కులేట్ అవుతున్నాయి. దీనివల్ల ప్రజల్లోకి నెగిటివ్ విషయాలు ఎక్కువపోతున్నాయి. ఇప్పుడు ఈ విషయం మీద తెలంగాణా పోలీసు విభాగం నిఘాను పెంచింది. గ్రూప్లో సర్క్యులేట్ అయ్యే అభ్యంతరకర సందేశాలు, వీడియోలకు అడ్మిన్ భాధ్యడవుతాడని వారినే అరెస్ట్ చేయాల్సి ఉంటుందని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రాజ్యమేలుతున్న వదంతుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

నిఘా ముమ్మరం
పక్షం రోజులుగా దీని కేంద్రంగా సాగుతున్న కిడ్నాపింగ్ గ్యాంగ్స్, దోపిడీ ముఠాల పుకార్లతో ప్రజలకు కంటి మీద కునుకులేకుండా పోవడంతో పోలీసు విభాగం నిఘాను ముమ్మరం చేసింది.పరిస్థితులు ఉద్రిక్తంగా మారడం, చేతులు దాటుతుండటంతో దీనిని అరికట్టేందుకు నడుం బిగించింది.

ఫేక్ వీడియోలు భారీ స్టాయిలో..
వాట్సప్ ఇప్పుడు యూజర్ ఫ్రెండ్లీ కావడంతో ఇందులో సంక్షిప్త సందేశాలు మాత్రమే కాకుండా నిర్ణీత ప్రమాణంలో ఉన్న వీడియోలు, ఆడియోలు సైతం పోస్ట్/షేర్ చేసుకునే అవకాశం ఉంది. అయితే దీంతో పాటు ఇతర ఫేక్ వీడియోలు భారీ స్టాయిలో షేర్ అవుతున్నాయి.

గ్రూపుల సంఖ్య కూడా నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో..
వాట్సప్ వినియోగదారులతో పాటు గ్రూపుల సంఖ్య కూడా నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో ఎవరికి వారు గ్రూపులు క్రియేట్ చేసుకుంటున్నారు. అలాగే మరోపక్క పరిపాలనా సౌలభ్యం, త్వరితగతిన సమాచార మార్పిడి కోసం ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలూ వాట్సప్ గ్రూపుల్ని క్రియేట్ చేస్తున్నాయి. అయితే వీటితోనే చిక్కులు వచ్చి పడుతున్నాయి.

గ్రూప్ అడ్మిన్ బాధ్యుడిగా..
ఇలా క్రియేట్ చేసిన గ్రూపుల్లో కుండా అందులో ఉండే సభ్యులందరికీ షేరింగ్ చేసే సౌలభ్యం ఉండటంతో చాటింగ్స్, పోస్టింగ్స్, షేరింగ్స్ అనేవి అడ్మిన్ అనుమతి, ప్రమేయం లేకుండానే సాగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే వచ్చే ఫేక్ న్యూస్ పై సదరు గ్రూప్ అడ్మిన్ బాధ్యుడిగా మారేలా చర్యలు తీసుకోనున్నారు.

ఓ గ్రూప్లో పోస్ట్ అయిన వీడియో..
వాట్సప్ గ్రూప్లో గరిష్టంగా 250 మంది సభ్యులు ఉన్నట్లే... ప్రతి సభ్యుడూ ఆ గ్రూప్తో పాటు మరికొన్నింటిలోనూ సభ్యుడిగా కొనసాగుతుంటాడు. ఫలితంగా ఓ గ్రూప్లో పోస్ట్ అయిన వీడియో క్షణాల్లో అనేక గ్రూపుల్లోకి వెళ్లిపోతుంది. పుకార్ల విషయంలో ఇలాంటి సదుపాయమే కొంపముంచుతోంది.

అభ్యంతరకర పోస్టింగ్స్, షేరింగ్స్ చేస్తుంటే..
ఆ గ్రూప్లో జరుగుతున్న కార్యకలాపాలతో పాటు షేరింగ్ అవుతున్న అంశాలనూ అతడే పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఎవరైనా అభ్యంతరకర పోస్టింగ్స్, షేరింగ్స్ చేస్తుంటే వారిని రిమూవ్ చేయాల్సిన బాధ్యత కూడా అడ్మిన్కు ఉంటుంది.

అలా కాని పక్షంలో
అలా కాని పక్షంలో గ్రూప్ వల్ల ఏదైనా జరిగితే అడ్మిన్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. వాటిని పోస్ట్, షేర్, ఫార్వర్డ్ చేసిన సభ్యుడు సైతం చర్యలకు బాధ్యుడు అవుతాడు. ‘ఫార్వార్డెడ్ ఏజ్ రిసీవ్డ్', ‘ప్లీజ్ క్రాస్ చెక్' అంటూ నోట్ పెట్టినంత మాత్రాన ఎలాంటి మినహాయింపులూ ఉండవు.

హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ హెచ్చరిక
ఆ గ్రూపు సభ్యుడు లేదా ఇతరులెవరైనా ఆధారాలతో ఫిర్యాదు చేస్తే బాధ్యుడితో పాటు అడ్మిన్ పైనా కేసు తప్పదని, బాధ్యుల్ని 24 గంటల్లోగా గుర్తించి, సరైన ఆధారాలు చిక్కితే గ్రూప్ అడ్మిన్స్నూ అరెస్టు చేస్తామని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ హెచ్చరించారు.


Click it and Unblock the Notifications








