ట్విట్టర్కు పోటీగా Instagram Threads యాప్.. రెండు రోజుల్లో లాంచ్..!
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్విట్టర్ను కొనుగోలు చేశాక.. భారీ మార్పులు చేస్తున్నారు. తాజాగా ట్వీట్లు చూసేందుకు కూడా పరిమితి విధించారు. అంటే బ్లూ టిక్ కలిగిన వినియోగదారులు రోజుకు 6000 ట్వీట్లు మాత్రమే చూడగలరు, అలాగే బ్లూటిక్ లేనివారు రోజుకు కేవలం 600 ట్వీట్లు మరియు కొత్తగా ట్విట్టర్ ఖాతాలు తెరిచి, బ్లూటిక్ లేనివాళ్లు కేవలం 300 ట్వీట్లు చూసేందుకు మాత్రమే వీలుందని చెప్పి షాక్ ఇచ్చారు.
ఈ నిర్ణయంపై పలువురు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీనిని తమకు అనుకూలంగా మార్చుకొనేందుకు మెటా సీఈవో మార్గ్ జుకర్ బర్గ్ ప్లాన్ చేస్తున్నారు. ట్వీట్టర్కు పోటీగా మరో మైక్రో బ్లాగింగ్ యాప్ను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. Instagram Threads పేరుతో యాప్ను తీసుకొస్తున్నారు. ఈ యాప్ ట్విట్టర్కు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. అయితే ఈ యాప్ జులై 6న విడుదల చేయనున్నట్లు సమాచారం.

థ్రెడ్స్ యాప్లో ట్విట్టర్ తరహా ఫీచర్లు ఉంటాయని తెలుస్తోంది. వినియోగదారులకు నచ్చిన పోస్టు పైన లైక్, కామెంట్ సహా షేర్ కూడా చేయవచ్చునని సమాచారం. ఇన్స్టాగ్రామ్ థ్రెడ్స్ యాప్లో ప్రజలు తమకు నచ్చిన ఖాతాలను ఫాలో కావచ్చు. థ్రెడ్స్ యాప్లో ప్రత్యేకంగా ఖాతా తెరవాల్సిన అవసరం లేదని, ఇన్స్టాగ్రామ్ ఖాతాతోనే థ్రెడ్స్ యాప్ను కూడా వినియోగించుకోవచ్చని తెలుస్తోంది. అయితే ఈ ఫీచర్లు, ఇతర వివరాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్ వచ్చాక కీలక మార్పులు చేశారు. సీఈవోను తప్పించారు. ఓసారి ఏకంగా ట్విట్టర్ లోగోను తొలగించారు. కొన్ని గంటల వ్యవధిలోనే మళ్లీ అదే లోగోను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. గతంలో ప్రముఖులు, ఇతర సెలబ్రిటీలు, నిపుణులకు మాత్రమే బ్లూటిక్ (వెరిఫైడ్ అకౌంట్) ఉండేది. ఇందులో మస్క్ మార్పులు చేశారు. సంస్థ చెప్పిన డబ్బులు చెల్లించి ఎవరైనా బ్లూటిక్ పొందేందుకు అర్హులని వెల్లడించారు. ఇందుకు ప్రత్యేక ప్లాన్లను తీసుకొచ్చారు.
తాజాగా ఏకంగా ట్విట్లపై పరిమితులను విధించారు. అయితే తొలుత తీసుకున్న నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం కావడంతో పరిమితిని కొంచెం పెంచారు. వెరిఫైడ్ ఖాతాదారులు (బ్లూటిక్) 10,000 వరకు ట్వీట్లను వీక్షించవచ్చు. అదే బ్లూటిక్ లేని వినియోగదారులు కేవలం 1000 ట్వీట్లను మాత్రమే వీక్షించగలరు. కొత్తగా ట్విట్టర్ అకౌంట్ తెరిచిన వారు 500 ట్వీట్లను మాత్రమే వీక్షించేందుకు వీలుంటుందని వెల్లడించారు.
ఈ నిర్ణయంపై చాలా వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. కొందరు నెటిజన్లు ఇతర సోషల్మీడియా ప్లాట్ఫాంలకు మారుతున్నారు. ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకోవాలని మెటా భావిస్తోంది. ఇప్పటికే మెటా నేతృత్వంలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఉన్నాయి. కొత్తగా ఇన్స్టాగ్రామ్ థ్రెడ్స్ను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది.
గిజ్బాట్ తెలుగు వెబ్సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








