ఓలాకు షాకిచ్చిన కర్ణాటక ప్రభుత్వం, ఆరునెలల బ్యాన్
వాహన సేవల రంగంలో అగ్రగామిగా ఉన్న ఓలా సంస్థకు కర్ణాటక ప్రభుత్వం షాకిచ్చింది. కుమారస్వామి ప్రభుత్వం ఓలా క్యాబ్ పై కీలక నిర్ణయం తీసుకుంది. క్యాబ్ల నిర్వహణలో నిబంధనలు అతిక్రమించినందుకు ఆ సంస్థ లైసెన్స్ను రద్దు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఓలా క్యాబ్ సర్వీసులపై నిషేధం విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర రవాణాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. కర్నాటకలో ఆరు నెలలపాటు ఓలా క్యాబ్లను నడపరాదంటూ ఆ రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆదేశాలు జారీ చేసింది.

ప్రభుత్వ అనుమతులు
ఓలా సంస్థ ఇటీవల క్యాబ్ సర్వీసులకు తోడుగా బైక్ సర్వీసులను కూడా కర్ణాటకలో ప్రారంభించింది. అయితే దీనికోసం ప్రభుత్వ అనుమతులు తీసుకోలేదు. దీనిపై ఫిర్యాదులు అందడంతో రవాణా శాఖ దర్యాప్తు చేపట్టింది.

ఓలా లైసెన్స్ను రద్దు
నిజమని తేలడంతో వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఓలా సంస్థను ఆదేశించింది. అయితే సంస్థ యాజమాన్యం ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందిన ప్రభుత్వం ఓలా లైసెన్స్ను రద్దు చేసింది. లైసెన్స్ ఒరిజినల్ పత్రాలను మూడు రోజల్లోగా రవాణా శాఖకు అప్పగించాలని ఆదేశించింది.

2010లో ముంబయిలో..
ఓలా క్యాబ్ సేవలు 2010లో ముంబయిలో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత తన ప్రధాన కార్యాలయాన్ని బెంగళూరుకు మార్చింది సంస్థ యాజమాన్యం. ఒక్క కర్ణాటకలోని బెంగళూరు మైసూరు, మంగళూరు, హుబ్లీ నగరాల్లో ఓలా సుమారు 10వేల క్యాబ్లతో సర్వీసులు నడుపుతోంది.
ఓలా బైక్ సర్వీసులను ప్రారంభించినట్టు మాకు సమాచారం వచ్చిన వెంటనే దీనిపై ప్రాధమిక విచారణ నిర్వహించామని, అయితే దీనిపై ఓలా చట్టవిరుద్ధంగా వ్యవహరించిందని అందుకే ఓలా క్యాబ్స్కు నోటీసులు ఇచ్చామని పేరు చెప్పేందుకు ఇష్టపడని రవాణా అధికారి తెలిపారు. దీనిపై వారంలో సమాధానం చెప్పాలని ఆదేశించామని అన్నారు. అయితే ఓలా నిర్ణయం సంతృప్తికరంగా లేకపోవడంతో దాన్ని రద్దు చేశామని తెలిపారు.


Click it and Unblock the Notifications








