లోకేష్ చేతుల మీదుగా 'మన మిత్ర' ప్రారంభం.. ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్కు శ్రీకారం..
Mana Mitra: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో మరే రాష్ట్రానికీ సాధ్యం కాని రీతిలో, వాట్సాప్ వేదికగా పాలనను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. 'మన మిత్ర' (Mana Mitra) పేరుతో వినూత్న వాట్సాప్ గవర్నెన్స్కు (WhatsApp Governance) శ్రీకారం చుట్టింది. ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేశ్ (Lokesh) లాంఛనంగా ఈ సేవల్ని ప్రారంభించారు. ఇకనుంచి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన పనిలేదు. సామాన్యుడికి సైతం సుపరిపాలన చేరువయ్యేలా, సాంకేతికతను అందిపుచ్చుకుని విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
* 'మన మిత్ర'తో మీ చేతిలోనే ప్రభుత్వం..
'మన మిత్ర' పేరుతో ప్రారంభమైన ఈ సరికొత్త వాట్సాప్ గవర్నెన్స్ వ్యవస్థతో ప్రజలు ఇకపై 161 రకాల ప్రభుత్వ సేవల్ని అరచేతిలోనే పొందవచ్చు. ప్రభుత్వ కార్యాలయాల క్యూలు, కాగితపు పనుల గందరగోళానికి శాశ్వతంగా స్వస్తి పలకవచ్చు. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు, పాలనను మరింత సులభతరం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన ఈ ముందడుగు దేశానికే ఆదర్శం.

* ఎలా పనిచేస్తుంది ఈ 'మన మిత్ర'..
సింపుల్, మీ వాట్సాప్ ఓపెన్ చేయండి, 95523 00009 నంబర్ను సేవ్ చేసుకోండి. అంతే, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారిక వాట్సాప్ నంబర్. దీనికి వెరిఫైడ్ టిక్ మార్క్ కూడా ఉంది, కాబట్టి భయం లేదు. మీకు కావాల్సిన సేవ గురించి మెసేజ్ చేస్తే క్షణాల్లో మీ పని పూర్తవుతుంది.
* ఏయే సేవలు అందుబాటులో ఉన్నాయి..
మొదటి దశలో ఏకంగా 161 సేవలు. దేవాదాయ శాఖ సేవలు మొదలుకొని, విద్యుత్ బిల్లులు కట్టడం వరకు.. ఆర్టీసీ బస్సు టికెట్ల బుకింగ్ నుంచి రెవెన్యూ రికార్డుల వరకు అన్నీ మీ వాట్సాప్లోనే. దేవాలయ దర్శనాలు, విరాళాల విషయానికొస్తే, ఇకపై గుడికి వెళ్లాలంటే క్యూలో నిలబడాల్సిన పనిలేదు. దర్శనం స్లాట్లు బుక్ చేసుకోవచ్చు, విరాళాలు పంపొచ్చు.
* సర్టిఫికెట్లు క్షణాల్లో, భూ రికార్డులు, ఆస్తి పన్ను
OBC, EWS, ఆదాయ ధృవీకరణ పత్రం.. ఇలాంటి సర్టిఫికెట్ల కోసం మీ సేవ సెంటర్లకు వెళ్లాల్సిన పనిలేదు. వాట్సాప్లో అప్లై చేస్తే చాలు. భూమి వివరాలు కావాలన్నా, ఆస్తి పన్ను కట్టాలన్నా.. అన్నీ వాట్సాప్లోనే పూర్తి చేసుకోవచ్చు ఇది నిజంగా ఏపీ ప్రజలకు ఒక వరం అని చెప్పవచ్చు.
* APSRTC సేవలు, ముఖ్యమంత్రి సహాయ నిధి
బస్సు టికెట్లు బుక్ చేసుకోవడం, క్యాన్సిల్ చేయడం, బస్సు ఎక్కడ ఉందో ట్రాక్ చేయడం.. ఇలా ఆర్టీసీ సేవలు అన్నీ మీ చేతిలోనే. సీఎం రిలీఫ్ ఫండ్ అప్లికేషన్ స్టేటస్ కూడా వాట్సాప్లోనే తెలుసుకోవచ్చు. ఇంకా చాలా సేవలు రాబోతున్నాయి. రెండో దశలో మరిన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి.
* ప్రజలకు ప్రయోజనాలు
గంటల తరబడి క్యూలలో నిలబడాల్సిన పనిలేదు. ప్రతి ఒక్కరూ వాడే వాట్సాప్లోనే సేవలు లభిస్తాయి. మీ అప్లికేషన్ స్టేటస్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. వరదలు, వర్షాలు, ప్రభుత్వ పథకాల సమాచారం.. అన్నీ వాట్సాప్లో అలర్ట్ల రూపంలో వస్తాయి. కాబట్టి అన్ని విధాలా ఇది ప్రజలకు ప్రయోజనాలు అందిస్తుంది.
* భద్రతకు పెద్దపీట
ఆన్లైన్ సేవలు అంటే భద్రత గురించి భయం ఉంటుంది. కానీ ఏపీ ప్రజలు అస్సలు భయపడాల్సిన పనిలేదు. ప్రజల డేటా భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. కఠినమైన సైబర్ సెక్యూరిటీ చర్యలు తీసుకుంటున్నారు. మీ డేటా లీక్ కాదు, మోసాలు జరగవు. దీన్ని ఎవరైనా సరే పూర్తిస్థాయిలో ఉపయోగించవచ్చు.
* డిజిటల్ పాలనలో ఏపీ మార్క్
ఆంధ్రప్రదేశ్ డిజిటల్ పాలనలో సరికొత్త బెంచ్మార్క్ను సెట్ చేస్తోంది. సాంకేతికతను ఉపయోగించి ప్రజలకు సేవలు అందించడంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. 'మన మిత్ర' సేవలు విజయవంతమైతే, దేశమంతా ఇదే మోడల్ను అనుసరించే అవకాశం ఉంది. మొత్తానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ విప్లవాత్మక నిర్ణయం పౌర సేవల్లో సరికొత్త శకానికి నాంది పలికింది.


Click it and Unblock the Notifications








