వణికిస్తున్న వాట్సప్ పుకార్లు,హెచ్చరిస్తున్న కేంద్రం, మీ నంబర్కు ఈ వార్త వచ్చిందా ?
ఈ మధ్య వాట్సప్ లో ఓ పుకారు వార్త భారీగా షేర్ అయింది.
ఈ మధ్య వాట్సప్ లో ఓ పుకారు వార్త భారీగా షేర్ అయింది. పిల్లల్ని ఎత్తుకెళ్లే గ్యాంగ్ అక్కడ తిరుగుతోంది..జాగ్రత్త! దోపిడీ దొంగలు ఈ ప్రాంతంలోనే ఉన్నారు! ఈ ఏరియాలోనే దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి లాంటి ఫేక్ వార్తలు విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. వాట్సప్లో వస్తున్న ఇలాంటి సమాచారంలో నిజమెంత అనే విషయాన్ని జనం ఆలోచించకుండా వాటిని షేర్ చేయడం అమాయకంగా కనిపించినా వారిని చంపేయడమే లేక చిత్రహింసలకు గురిచేయడమో చేస్తున్నారు. దీనిపై కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

చిన్న పిల్లలను ఎత్తుకుపోయే ముఠా..
ఆ మధ్య వచ్చిన చిన్న పిల్లలను ఎత్తుకుపోయే ముఠా తిరుగుతోందన్ననకిలీ వార్త తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 11 రాష్ట్రాల్లో ఏడాది కాలంలో సుమారు 27 మంది ప్రాణాలను బలి తీసుకుంది.

గత రెండు నెలల్లో ఎనిమిది రాష్ట్రాల్లో..
మహారాష్ట్రలోని ధూలే జిల్లా రెయిన్పడ గ్రామంలో అయిదుగురు వ్యక్తుల్ని చిన్నపిల్లల కిడ్నాపర్లనే అనుమానంతో గ్రామస్తులు కొట్టి చంపారు. గత రెండు నెలల్లో ఎనిమిది రాష్ట్రాల్లో జరిగిన మొత్తం 13 ఘటనల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈ పుకార్లు, నకిలీ వార్తల్ని..
ఈ పుకార్లు, నకిలీ వార్తల్ని నమ్మొద్దంటూ పోలీసులు చేస్తున్న ప్రచారం కూడా పెద్దగా ఫలితం ఇవ్వకపోవడంతో ఈ రకమైన విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.

నకిలీ వార్తల వ్యాప్తిని అరికట్టడం కష్టమే..
వాట్సప్లో ఇలాంటి నకిలీ వార్తల వ్యాప్తిని అరికట్టడం కష్టమేనని ఇంటెలిజెన్స్ అధికారులు అంటున్నారు.వాట్సప్ సర్వర్ కూడా ఇండియాలో లేకపోవడంతో నకిలీ వార్తలు ఎక్కడ్నుంచి వ్యాప్తి చెందుతున్నాయో తెలుసుకోవడం అసాధ్యంగా మారిందని ఇంటెలిజెన్స్ అధికారులు చెబుతున్నారు.

ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్
వాట్సప్లో వినియోగదారుల సమాచారం భద్రత కోసం ఏర్పాటు చేసిన ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అన్న ఆప్షన్ ఇప్పుడు నకిలీ వార్తలు ఎక్కడ నుంచి మొదలయ్యాయో కనుగొనడానికి అడ్డంకి అయింది.

అడ్మిన్లు నియంత్రించే ఫీచర్
అయితే గతవారం వాట్సప్ గ్రూపుల్లో సభ్యులు ఇష్టారాజ్యంగా మెసేజ్లు పంపకుండా అడ్మిన్లు నియంత్రించే ఫీచర్ ప్రవేశపెట్టడంతో మెసేజ్లకు కొంతయినా అడ్డుకట్ట పడే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.

కేంద్రం హెచ్చరికలు
విద్వేషపూరిత, రెచ్చగొట్టే సందేశాల వ్యాప్తికి సంబంధించి కేంద్రం మెసేజింగ్ యాప్ వాట్సప్ను హెచ్చరించింది. అలాంటి వాటిని నిరోధించడానికి అత్యవసరంగా చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

వాట్సప్కు లేఖ
ఈ మేరకు ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ వాట్సప్కు లేఖ రాసింది. జవాబుదారీతనం, బాధ్యతల నుంచి ఆ సంస్థ తప్పించుకోజాలదని అందులో పేర్కొంది. వాట్సప్ లాంటి వేదికలు దుర్వినియోగ కాకుండా, ఎట్టి పరిస్థితుల్లోనూ హింసను ప్రేరేపించే సందేశాలను విస్తరింపజేయకుండా చూడాలని కోరింది.

తక్షణమే చర్యలు..
గత కొన్ని నెలలుగా చోటు చేసుకుంటున్న దారుణ హత్యల నేపథ్యంలో వాట్సప్ సీనియర్ ప్రతినిధులకు తమ తీవ్ర అసంతృప్తి తెలియజేశామని, తక్షణమే చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించామని ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో చెప్పింది.

20 కోట్ల మందికి పైగా..
దేశవ్యాప్తంగా 20 కోట్ల మందికి పైగా వాట్సప్ను వినియోగిస్తూ, ప్రతీ నెలా 200 కోట్ల జీబీలకు పైగా సమాచారాన్ని షేర్ చేస్తుంటారని అంచనా. అంత సమాచారంలో నకిలీ వార్తల్ని పసిగట్టడం పోలీసులకు శక్తికి మించిన పనిగా మారినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








