విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు, ప్రభుత్వం సంచలన నిర్ణయం
సిద్ధా రామయ్య నేతృత్వంలోని కర్ణాటక సర్కార్, ఆ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లను పంపిణీ చేస్తోంది. బుధవారం నుంచి ఈ పక్రియ ప్రారంభమైంది.

పీయూసీ ఆపై చదువులను అభ్యసిస్తోన్న 31000 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఈ ల్యాప్టాప్లను కర్ణాటక ప్రభుత్వం అందించబోతోంది. విద్యార్థులకు ఇవ్వనున్న ల్యాప్టాప్ల పై రెండు లోగోలు ఉంటాయి. అందులో మొదటి లోగా కర్ణాటక ప్రభుత్వానిది కాగా, రెండవ లోగా పై ముఖ్యమంత్రి సిద్దారామయ్య ఫోటో ఉంటుంది.

Acer కంపెనీతో ఒప్పందం..
ఈ ల్యాప్టాప్లను Acer కంపెనీ నుంచి టెండర్ ప్రాసెస్ క్రింద కర్ణాటక సర్కార్ కొనుగోలు చేసింది. మొత్తం డీల్ విలువ రూ.45 కోట్లు. ఒక్కో ల్యాప్టాప్ ఖరీదు రూ.14,490. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 412 ప్రభుత్వ అలానే ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాలలతో పాటు 85 పాలిటెక్నిక్ కళాశాలలకు చెందిన విద్యార్థులకు ఈ ఉచిత ల్యాప్టాప్ స్కీమ్ వర్తిస్తుంది.

విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతాయి..
ఈ ల్యాప్టాప్స్ విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతాయి. ఇంటెల్ క్వాడ్కోర్ ప్రాసెసర్, 1టీబీ హార్డ్ డ్రైవ్, 4జీబి ర్యామ్, 14 అంగుళాల స్ర్కీన్ వంటి ఈ ఫీచర్స్ ఈ డివైస్ లో ఉన్నాయి. ఫ్రీ ల్యాప్ టాప్ స్కీమ్ క్రింద ఎంపికైన విద్యార్థులకు వారివారి కళాశాలల్లో అందజేయటం జరుగుతుంది.

1.8 లక్షల ల్యాప్టాప్లను పంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం...
2017-18 విద్యా సంవత్సరానికి గాను 1.8 లక్షల ల్యాప్టాప్లను కొనుగోలు చేసేందుకుగాను కర్ణాటక సర్కార్ రూ.300 కోట్ల బడ్జెట్ను కేటాయించింది. వీటిలో 31,000 ల్యాప్టాప్లను ఇప్పటికే అందచేయగా, మిగలిన లక్షన్నర ల్యాప్టాప్లను త్వరలోనే అందజేయనున్నారు.

బడుగు బలహీన వర్గాల విద్యార్థుల సంక్షేమం కోసం..
ల్యాప్ టాప్ అనేది విద్యార్థులకు చాలా అవసరమైన వస్తువని, అలాంటి ఈ వస్తువు కేవలం ధనికుల పిల్లలకు మాత్రమే పరిమితం కాకూడదన్న ఉద్దేశ్యంతో బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఖజానాకు భారమని అనిపించినప్పటికి పేద విద్యార్థులకు వీటిని ఉచితంగా అందించే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి సిద్దా రామయ్య అన్నారు. ల్యాప్టాప్లు విద్యార్థుల చేతిలో ఉండటం వల్ల సమయాన్ని ఎంత మాత్రం వృధా చేయకుండా లైబ్రరిలోని సమచారం మొత్తాన్ని యాక్సిస్ చేసుకునే వీలుంటుందని ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications








