‘ట్యాబ్లెట్’లో చదువు.. ఆశ్లీల వెబ్సైట్లు బ్లాక్!

హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన ఆన్లైన్ పబ్లిషింగ్ ప్రొవైడర్, ప్రెస్మార్ట్ మీడియా లిమిటెడ్ పాఠశాలల కోసం ప్రత్యేకంగా మొబైల్ లెర్నింగ్ క్లాస్రూం అప్లికేషన్ను (మోకా) రూపొందించింది. పుస్తకాల అవసరం లేకుండా ట్యాబ్లెట్ పీసీతో విద్యా బోధన అందించేందుకు పాఠశాలలకు ఈ అప్లికేషన్ వీలు కల్పిస్తుంది. ప్రస్తుతం ఫిలిప్పైన్స్లోని మనీలాలో ఉన్న లా సల్లే గ్రీన్ హిల్స్ అనే విద్యాసంస్థ మోకాను విజయవంతంగా అమలు చేస్తోందని ప్రెస్మార్ట్ తెలిపింది. ప్రపంచంలో తొలిసారిగా పూర్తి స్థాయిలో డిజిటల్ క్లాస్రూమ్స్ను కలిగిన పాఠశాల ‘లా సల్లే’ అని కంపెనీ చైర్మన్ విక్రమ్ తోర్పునూరి సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు.
పీసీలోని ప్రత్యేకతలు..
పాఠ్యాంశాలన్నీ ట్యాబ్లెట్లో లోడ్ అయి ఉంటాయని, విద్యార్థులు సులువుగా అర్థం చేసుకునేలా అప్లికేషన్ అభివృద్ధి చేశామని విక్రమ్ తెలిపారు. ట్యాబ్లెట్ తస్కరణకు గురైనా వెతికి పట్టుకోవచ్చని, అందులోని సమాచారాన్ని బ్లాక్ చేయొచ్చని చెప్పారు. అశ్లీల వెబ్సైట్లు ఇందులో ఓపెన్ కావని వివరించారు. థాయ్లాండ్ ప్రభుత్వం అక్కడి ప్రాథమిక పాఠశాలలకు 8 లక్షల ట్యాబ్లెట్ పీసీలను అందించనుందని, దీనిని అవకాశంగా మలుచుకుంటామని పేర్కొన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో హైదరాబాద్లోని రెండు పాఠశాలల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. ఆపిల్ ఐఓఎస్ ఆధారిత అప్లికేషన్తోపాటు మరో రెండు ఉత్పత్తులను త్వరలో ఆవిష్కరిస్తామని పేర్కొన్నారు. మోకా అప్లికేషన్ ఖరీదు తరగతినిబట్టి ఏడాదికి రూ.4-7 వేలుంది.


Click it and Unblock the Notifications








