‘బీఅలర్ట్: నేడు ఇంటర్ నెట్ సేవలకు అంతరాయం వాటిల్లొచ్చు..?’

ఇంటర్నెట్లోని పలు సర్వీసులకు శనివారం అంతరాయం కలిగే అవకాశాలున్నాయని ఇంటర్పోల్ సెక్రటరీ జనరల్ రోనాల్డ్ కె. నోబుల్ చెప్పారు. శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన ఓ స్మారకోపన్యాస కర్యాక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ వాల్స్ట్రీట్ పతనం, ప్రపంచ నాయకుల బాధ్యతారాహిత్య ప్రవర్తన, ఇంకా ఇతర అంశాలకు నిరసనగా ‘అనానిమస్’ హ్యాకింగ్ గ్రూప్ పలు సర్వర్ల పై దాడి చేసే అవకాశముందని హెచ్చరించారు. ఇటీవల కాలంలో ఈ గ్రూపు నిర్వహించిన దాడుల కారణంగా కొలంబియా, చిలీ, స్పెయిన్ల్లో ప్రైవేట్, పబ్లిక్ వెబ్సైట్లు హ్యాకింగ్కు గురి అయ్యాయని, ఈ విషయమై దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 230 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లున్నారని, వీరిలో ఏటా 10 లక్షల మంది సైబర్ నేరాల బారినపడుతున్నారని పేర్కొన్నారు. ఈ సైబర్ నేరాలవల్ల ప్రపంచవ్యాప్తంగా 38,800 కోట్ల డాలర్ల నష్టం జరుగుతోందని చెప్పారు. ఇంటర్నెట్కు చెందిన 13 రూట్ డీఎన్ఎస్ సర్వర్లపై దాడి చేస్తామని ఈ గ్రూప్ హెచ్చరించినట్లు నోబుల్ తెలిపారు. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు, సంస్థలు నిర్వహించే అన్ని సర్వర్లు ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా పలు సర్వర్లకు 13 రూట్ సర్వర్లే మూలాలుగా ఉన్నాయి. డీఎన్ఎస్ సర్వర్లు సరిగ్గా పనిచేయకపోతే పేరుతో కూడిన వెబ్సైట్లను మనం యాక్సెస్ చేయలేం.


Click it and Unblock the Notifications








