న్యూఢిల్లీ: లోపాలను సవరించి కొత్త ఫీచర్లతో అప్గ్రేడ్ చేసిన ఆకాష్ టాబ్లెట్ ధరలో ఎలాంటి మార్పు ఉండదని టెలికాం, మానవ వనరుల శాఖ మంత్రి కపిల్ సిబాల్ తెలిపారు. ఇంతకు ముందున్న ఆకాష్ ధరనే ( రూ. 2,450కన్నా తక్కువుగా ) కొనసాగించనున్నట్టు ఆయన చెప్పారు. ఆకాష్ టాబ్లెట్ను డేటా విండ్ అనే కంపెనీ ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. కేవలం ఒక్క కంపెనీకే పరిమితం కాకుండా డి-డాక్, ఐటిఐలను కూడా ఆకాష్ అభివృద్ధిలో భాగస్వాములను చేసినట్టు సిబాల్ తెలిపారు. డేటా విండ్లో లోపాలున్నాయని ఆయన అంగీకరించారు. అందుకే సి -డాక్, ఐటిఐలను రంగంలోకి దింపినట్టు చెప్పారు. ఆకాష్ను పూర్తి స్థాయిలో దేశీ పరిజ్ఞానంతో భారత ఉత్పత్తిగా తీసుకువస్తున్నట్టు తెలిపారు.
కొత్త టాబ్లెట్ను ఇంతకు ముందు ధరల శ్రేణిలోనే అందిస్తామన్నారు. ఈ ఏడాదిలోనే ఆకాష్ 2ను మార్కెట్లోకి విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులను క్రమంగా అధిరోహిస్తున్నామన్నారు. ఆకాష్కు పోటీగా వచ్చే ఉత్పత్తులను ఆహ్వానిస్తామన్నారు. విద్యార్థులకు నాణ్యమైన ఉత్పత్తిని అందించే లక్ష్యంతోనే తాము ముందుకు వెళ్తున్న విషయాన్ని గుర్తు చేశారు. తాను ఒక బెంచ్మార్క్ను నిర్దేశించామని, అది మొత్తం ప్రపంచ మైండ్ సెట్నే మార్చి వేసిందని సిబాల్ వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరు కూడా నాణ్యమైన టాబ్లెట్ను అందుబాటు ధరలోనే అభివృద్ధి చేయాలని యోచిస్తున్నారన్నారు.