ఈ రైల్వే యాప్ ద్వారా ప్లాట్ఫారమ్ టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు.. పూర్తి వివరాలు తెలుసుకోండి..!
భారతీయ రైల్వే ఇటీవల కాలంలో ప్రయాణికుల సౌకర్యం కోసం అనేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా మౌలిక సదుపాయాలను కల్పించడంతోపాటు టికెటింగ్ వ్యవస్థలోనూ భారీ మార్పులు చేస్తోంది. గతంలో మాదిరిగా జనరల్ లేదా ప్లాట్ఫారమ్ టికెట్ల కోసం గంటల తరబడి క్యూలైన్లో వేచిచూడాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకొనే అవకాశం కల్పిస్తోంది. ఫలితంగా అత్యవసర సమయాలు సహా రద్దీ వేళల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా టికెట్లను బుకింగ్ చేసుకోవచ్చు.
కుటుంబ సభ్యులు, ఫ్రెండ్ లేదా ఇతరులు రైళ్లలో ఇతర ప్రాంతాలకు వెళ్లడం రావడం లేదా తిరిగి వచ్చిన సందర్భాల్లో వారి కోసం రైల్వే స్టేషన్కు వెళతాం. అటువంటి సందర్భాల్లో రైల్వే ప్లాట్ఫారమ్ టికెట్ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. రద్దీ సమయాల్లో ప్లాట్ఫారమ్ టికెట్లు తీసుకొనేందుకు ఎంతో శ్రమపడాల్సి ఉంటుంది. ఈ పద్దతిని సులభతరం చేసేందుకు రైల్వే ఇటీవల UTS (అన్రిజర్వడ్ టికెటింగ్ సిస్టమ్) ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

UTS యాప్ ద్వారా టికెట్లను ఎలా కొనుగోలు చేయాలి :
ప్లేస్టోర్ లేదా iOS ద్వారా UTS యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. అనంతరం మీ వివరాలను నమోదు చేయాలి. ఆ తర్వాత UPI, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా R వ్యాలెట్ను రీఛార్జీ చేసుకోవచ్చు. దీని ద్వారా R వ్యాలెట్లో 3 శాతం బోనస్ పొందనున్నారు. లేదా ఇతర పద్ధతుల ద్వారా పేమెంట్ చేయవచ్చు.
UTS యాప్లో హోం పేజీలో ప్లాట్ఫారమ్ బుకింగ్ ఆప్షన్ను ఎంచుకోవాలి. అనంతరం యాప్ ఆటోమేటిక్గా మీ లోకేషన్ను గుర్తిస్తుంది. పేపర్ లెస్ లేదా పేపర్ టికెట్ ఆప్షన్ను ఎంచుకోవాల్సి ఉంటుంది. మీకు కావాల్సిన ప్లాట్ఫారమ్ను ఎంచుకోవాలి. ఎన్ని టికెట్లు బుకింగ్ చేయాలనుకుంటున్నారో ఎంచుకోవాల్సి ఉంటుంది.
అనంతరం R వ్యాలెట్ ద్వారా లేదా డెబిట్, క్రెడిట్ కార్డు, UPI, నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. చివరిగా Book Ticket బటన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసిన తర్వాత UTS యాప్లోని Show Ticket ఆప్షన్ వద్ద టికెట్లను గుర్తించవచ్చు.
పేపర్ పై టికెట్ను పొందాలంటే.. మీ బుకింగ్ ఐడీ ద్వారా రైల్వే స్టేషన్లో ఉండే ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్ లేదా జనరల్ కౌంటర్ వద్ద ప్రింట్ తీసుకొనేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ టికెట్లను క్యాన్సిల్ చేసేందుకు అవకాశం లేదు. యాప్లోని Show Ticket ఆప్షన్ వద్ద టికెట్ను తనిఖీల సమయంలో చూపేందుకు అవకాశం ఉంది.
UTS యాప్ను 2018 లో రైల్వే ప్రవేశపెట్టింది. ఈ యాప్నకు గతంలో కొన్ని పరిమితులు ఉండేవి. వీటిని తొలగిస్తూ కొద్ది రోజుల క్రితం రైల్వే కొత్త అప్డేట్ను విడుదల చేసింది. ఈ యాప్ ద్వారా టికెట్ను బుకింగ్ చేసుకొనేందుకు స్మార్ట్ఫోన్ లోకేషన్ ఆన్లోనే ఉండాలి. ఈ UTS యాప్ ద్వారా 25 శాతం మంది ప్రయాణికులు టికెట్లు బుకింగ్ చేసుకుంటున్నారని రైల్వే తెలిపింది.


Click it and Unblock the Notifications








