త్వరలో 4జీ మొబైల్ సర్వీస్..!!

ఈ ఏడాది చివరినాటికి దేశంలో 4జీ మొబైల్ సర్వీసులను ప్రారంభించేందుకు వీలుగా స్పెక్ట్రమ్ వేలంను నిర్వహించే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు కేంద్ర టెలికం శాఖా మంత్రి కపిల్ సిబాల్ చెప్పారు. మరోవైపు 2జీ సర్వీసులకు సంబంధించిన రేడియో తరంగాలను (స్పెక్ట్రమ్) సైతం విక్రయించే తుది సన్నాహాల్లో ఉన్నట్లు తెలిపారు. బార్సిలోనాలో నిర్వహిస్తున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్లో భారత టెలికం శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిబల్ ఈ విషయాలను వెల్లడించారు. మొత్తం ఆపరేటర్లందరికీ కేటాయించేటంత స్పెక్ట్రమ్ తమ ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్నదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే ఒకే దశలో మొత్తం స్పెక్ట్రమ్ను వేలంవేయబోమని వెల్లడించారు.
టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) సూచనల తరువాత తుది నిర్ణయానికి వస్తామని చెప్పారు. స్పెక్ట్రమ్ వేలాన్ని పార దర్శకంగా చేపట్టనున్నట్లు తెలిపారు. స్పెక్ట్రమ్ వేలంపై చాలా కంపెనీలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయని, అందరికీ అవకాశముంటుందని చెప్పారు. ఏ ధరకు... ఎప్పటిలోగా వేలాన్ని నిర్వహించేదీ నెల రోజుల్లోగా వెల్లడికావచ్చునని వివరించారు. నాలుగు నెలల్లోగా ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశమున్నట్లు తెలియజేశారు.


Click it and Unblock the Notifications








