న్యూఢిల్లీ : అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్ కామ్) తాను ఆపరేట్ చేస్తున్న వివిధ సర్కిళ్లలో తమ జిఎస్ఎం, సీడీఎమ్ఏ మొబైల్ సేవల కాల్ రేట్లను 20శాతం పెంచింది. గడిచిన రెండు నెలలుగా వివిధ సర్కిళ్లలో దశల వారీగా మొబైల్ కాల్ చార్జీలను సెకన్కు ఒక పైసా నుంచి పైసాన్నర వరకు హెచ్చించామని ఆర్కామ్ మొబైల్ విభాగాధిపతి సయ్యద్ సఫాయి ఆదివారం పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు.
దేశంలో ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు దృష్ట్యా టారిఫ్ రేట్లు పెంచినట్లు ఆర్కామ్ పేర్కొంది. జిఎస్ఎం సేవల విభాగంలో ఈ పెంపుదల రిలయన్స్ నెట్ వర్క్ పరిధిలో, ఇతర నెట్వర్క్లకు చేసే కాల్స్కు వర్తిస్తుంది. అలాగే సీడీఎంఏ సేవల విభాగంలో ఇతర టెలికాం సంస్థల నెట్వర్క్ పరిధిలోకి జరిపే కాల్స్కు మాత్రమే కొత్త టారిఫ్ రేట్లు వర్తిస్తాయని సఫాయి పేర్కొన్నారు. అయితే టారిఫ్ రేట్లు పంపుదల వర్తించే సర్కిళ్ల వివరాలు మాత్రం వెల్లడించలేదు. కాగా, ఇటీవల ఇతర టెలికాం సంస్థల్లో భారతి ఎయిర్టెల్, ఐడియా తమ టారిఫ్ రేట్లు 20 శాతం వరకు పెంచినట్లు తెలుస్తోంది.