సామ్సంగ్, షియోమీల మధ్య ముదురుతోన్న రచ్చ
పోటాపోటీగా వ్యూహ ప్రతివ్యూహాలు..
ఇండియన్ రిటైల్ మార్కెట్లో సామ్సంగ్, షియోమీల మధ్య నెలకున్న వివాదం రోజుకో మలుపుతీుసుకుంటోంది. రిటైల్ ట్రేడ్ విభాగంలో తమదంటే తమదే పైచేయిగా ఉండాలని భావిస్తోన్న ఈ రెండు కంపెనీలు పోటాపోటీగా వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు దూసుకువెళుతున్నాయి.

200 రిటైలర్ల పై కన్నెర్ర..
తమతో కుదర్చుకున్న అగ్రిమెంట్ను ఉల్లఘించి షియోమితో చేతులు కలిపిన 200 రిటైలర్ల పై సామ్సంగ్ నిషేధం విధించింది. వీరికి ఎటువంటి స్మార్ట్ఫోన్లను సరఫరా చేయబోమని సామ్సంగ్ తేల్చి చెప్పింది.

అవసరమైతే మరింత స్టాక్..
సామ్సంగ్ తీసుకున్న నిర్ణయం పట్ల షియోమి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను జైయిన్ వాట్సాప్ వేదికగా స్పందించారు. తమ రిటైల్ వ్యాపారంతో లింక్ అయి ఉన్న వాట్సాప్ గ్రూప్ను ఉద్దేశించి మను కుమార్ జెయిన్ ఓ మెసేజ్ పంపారు. ఇటువంటి కీలక సమయంలో తమవైపు ధైర్యంగా నిలబడిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, అవసరమైతే మీకు మరింత స్టాక్ను సప్లై చేస్తామని తెలిపారు. రిటైలర్లకు దోహదపడే విధంగా సరికొత్త ఫైనాన్సింగ్ స్కీమ్ను కంపెనీ ప్లాన్ చేస్తుందని, దీనిని త్వరలోనే అనౌన్స్ చేస్తామని మను కుమార్ తెలిపారు.

చైనా బ్రాండ్లతో బాహిబాహి..
వేరే బ్రాండ్కు ప్రాముఖ్యత ఇస్తున్నారన్న నెపంతో రిటైలర్లకు సప్లై నిలిపివేయటం ఇదే మొదటిసారి అని ఢిల్లీకి చెందిన ఓ సెల్ఫోన్ స్టోర్ ఓనర్ తలిపారు. తమతో అగ్రిమెంట్ కుదుర్చుకున్న రిటైల్ స్టోర్లలో షియోమి, వివో, ఒప్పో వంటి చైనా బ్రాండ్లకు అంగుళం కూడా చోటు ఇవ్వబోమని సామ్సంగ్ ఎగ్జిక్యూటివ్స్ తేల్చి చెబుతున్నారట.

ఇండియాలో Xiaomi దూకుడు..
ఇండియన్ స్మార్ట్ఫోన్ మార్కెట్ను Xiaomi ఫోన్ లు శాసిస్తోన్న విషయం తెలిసిందే. ఈ బ్రాండ్ నుంచి లాంచ్ అవుతోన్న Redmi సిరీస్ ఫోన్లు పోటాపోటీగా రికార్డులు బద్దలుకొడుతున్నాయి. సంవత్సరం క్రితం వరకు ఆన్లైన్ మార్కెట్కు మాత్రమే పరిమితైన షియోమి ఫోన్లు ఇప్పుడు ఆఫ్లైన్ మార్కెట్లోనూ దొరుకుతున్నాయి.

రెడ్మీ ఫోన్లకు ఫిదా..
రెడ్మీ ఫోన్లకు ఆఫ్లైన్ మార్కెట్లోనూ అదే ఊపు కొనసాగుతుండటంతో ఈ మార్కెట్ను మరింతగా విస్తరించుకోవాలిని షియోమి భావిస్తోంది. ప్రస్తుతం షియోమీ అమ్మకాలు ఆన్లైన్ మార్కెట్లో 90శాతం గానూ, ఆఫ్లైన్ మార్కెట్లో 10శాతంగానూ ఉన్నాయి. ఈ ఏడాది చివరినాటికి ఆఫ్లైన్ మార్కెట్ సేల్ను 25 శాతానికి పెంచాలన్నది తమ లక్ష్యమని షియోమి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను కుమార్ జైన్ మీడియాకు తెలిపారు.

వారానికి మూడు లక్షల ఫోన్లు సేల్..
తమ ఫోన్లు తయారయ్యేందుకు శ్రీ సిటీ స్పెషల్ ఎకనమిక్ జోన్లో రెండు తయారీ యూనిట్లు ఉన్నాయిని, వీటిలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 90 శాతం వరకు మహిళలేనని మను కుమార్ జైన్ తెలిపారు. ఈ యూనిట్లలో సెకనకు ఒక ఫోన్ తయారువుతోందని, వారానికి 3 లక్షల ఫోన్లు విక్రయించ గలుగుతున్నామని ఆయన వివరించారు.

బెంగుళూరులో మొట్టమొదటి ఆఫ్లైన్ స్టోర్
షియోమి తన మొట్టమొదటి ఆఫ్లైన్ స్టోర్ను Mi Home పేరుతో బెంగుళూరులో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. మే 20న అఫీషియల్గా ప్రారంభమైన ఈ స్టోర్ మొదటి 12 గంటల్లోనే 5 కోట్ల అమ్మకాలను నమోదు చేసింది. షియోమి ఎంఐ స్టోర్లలో ఆ బ్రాండ్కు సంబంధించిన అన్ని స్మార్ట్ఫోన్స్తో పాటు అన్ని రకాల ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. వీటిని ఎక్స్పీరియన్స్ చేయటంతో పాటు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది.

రానున్న రెండు సంవత్సరాల్లో 100 Mi Home Storeలు
రానున్న రెండు సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా మరో 100 Mi Home Storeలను లాంచ్ చేయనున్నట్లు షియోమీ తెలిపింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ ఇంకా చెన్నై వంటి మెట్రో నగరాల్లో వీటిని ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 10,000 వరకు ఆఫ్లైన్ స్టోర్లలో షియోమీ ఫోన్లు లభ్యమవుతున్నాయి.


Click it and Unblock the Notifications








