షియోమికి శాంసంగ్ సవాల్, తక్కువ ధరకే స్మార్ట్ఫోన్లు !
ఇండియాలో ఎప్పటి నుంచో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్కు చైనా దిగ్గజం షియోమి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇండియాలో ఎప్పటి నుంచో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్కు చైనా దిగ్గజం షియోమి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. శాంసంగ్ స్థానాన్ని వెనక్కి నెట్టేస్తూ ఇండియాలో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. పవర్ పుల్ ఫీచర్లతో చాలా తక్కువ ధరకే స్మార్ట్ఫోన్లను అందిస్తున్న షియోమి వినియోగదారులను ఇట్టే కట్టిపడేస్తోంది. షియోమి వ్యూహాన్ని పసిగట్టిన శాంసంగ్ తిరిగి నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు షియోమి బాటలోనే నడవాలని చూస్తోంది.

షియోమీ ఏ కొత్త మోడల్ను విడుదల చేసినా..
చైనాకు చెందిన మొబైల్స్ తయారీ దిగ్గజం షియోమీ ఏ కొత్త మోడల్ను విడుదల చేసినా ముందుగా ఆన్లైన్లో ఫ్లాష్ సేల్ ద్వారా వాటిని విక్రయిస్తుంది. తరువాత నెమ్మదిగా వాటిని ఆఫ్లైన్ స్టోర్స్లో అమ్మడం ప్రారంభిస్తుంది.

వీలైనన్ని ఎక్కువ ఫోన్లు..
దీంతో వీలైనన్ని ఎక్కువ ఫోన్లు అమ్మడమే కాదు, ఆన్లైన్లో అమ్మడం ద్వారా విక్రయదారు కమిషన్ చెల్లించాల్సిన పని ఉండదు. దీంతో ఫోన్ను మరింత తక్కువ ధరకే అందించవచ్చు. మొదట్నుంచీ షియోమీ ఇదే పంథాతో ముందుకు సాగుతుండగా, ఇప్పుడు అదే బాటలో శాంసంగ్ నడవనుంది.

శాంసంగ్ షియోమీకి పోటీగా
త్వరలో శాంసంగ్ షియోమీకి పోటీగా కొత్త మోడల్ స్మార్ట్ఫోన్లను తన ఆన్ సిరీస్లో విడుదల చేయనుంది. వీటి ధరలు చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే శాంసంగ్ వీటిని మొదటగా ఆఫ్లైన్ స్టోర్స్లో కాకుండా కేవలం ఆన్లైన్లోనే అది కూడా ఫ్లాష్ సేల్ ద్వారా విక్రయించనున్నట్లు తెలిసింది.

రూ.5 వేల నుంచి రూ15 వేల రేంజ్ లో ..
ఆన్లైన్లో కూడా కేవలం ఇద్దరు లేదా ముగ్గురు ప్రియారిటీ సెల్లర్స్ ద్వారానే శాంసంగ్ తన ఫోన్లను విక్రయించాలని చూస్తున్నది. ఈ విషయాలను ఎకనామిక్స్ టైం రిపోర్ట్ చేసింది. కాగా ఈ ఫోన్లు రూ.5 వేల నుంచి రూ15 వేల రేంజ్ లో ఉండనున్నట్లు సమాచారం.

Galaxy A8 plus
కాగా ఈ మధ్య శాంసంగ్ లాంచ్ చేసిన Galaxy A8+ అమెజాన్ లో ఎక్సక్లూజివ్ గా విక్రయానికి వచ్చింది. దీని ధర రూ. 32,990. ఈ ఫోన్ షియోమి Mi Mix2కి గట్టి పోటీగా నిలవనుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








