షియోమీకి షాక్.. ఒకప్పుడు మార్కెట్ కింగ్.. ఇప్పుడు ఏడో స్థానానికి పతనం.. కారణం ఇదేనా?
Xiaomi India: భారత స్మార్ట్ఫోన్ మార్కెట్ను ఒకప్పుడు ఏలిన షియోమీ ఇప్పుడు మాత్రం వెనకబడిపోయింది. ఐదేళ్లపాటు తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన ఈ చైనా దిగ్గజం, ఒక్కసారిగా ఏడో స్థానానికి పడిపోవడం పెద్ద షాకింగ్ విషయం అని చెప్పుకోవచ్చు. వివో, శామ్సంగ్, ఒప్పో, యాపిల్ వంటి బడా బ్రాండ్లతో పోటీ పడలేక చతికిల పడింది. ఇంతకాలం నంబర్ వన్గా వెలిగిన షియోమీ ఇప్పుడు ఇలా వెనుకబడిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
* మార్కెట్లో పతనం కావడానికి కారణాలివే..
షియోమీ అమ్మకాలు భారీగా పడిపోయాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 2017 నుంచి 2022 వరకు టాప్ పొజిషన్లో ఉన్న షియోమీ, ఇప్పుడు మాత్రం ఏడో స్థానానికి పడిపోవడం గమనార్హం. దీనికి ప్రధాన కారణం ఆఫ్లైన్ మార్కెట్పై పట్టు కోల్పోవడమే. ఆఫ్లైన్ మార్కెట్లో అమ్మకాలు ఎక్కువగా జరిగితేనే లాభాలు ఉంటాయి.

వివో, ఒప్పో, శామ్సంగ్ వంటి కంపెనీలు ఆఫ్లైన్ స్టోర్లలో దూసుకుపోతుంటే, షియోమీ మాత్రం వెనుకబడిపోయింది. అంతేకాదు, పాత స్టాక్ పేరుకుపోవడం, చవక ఫోన్లపైనే ఎక్కువ ఫోకస్ పెట్టడం కూడా షియోమీకి దెబ్బతీసింది. ఆన్లైన్లో కూడా మోటారోలా వంటి బ్రాండ్ల నుంచి గట్టి పోటీ ఎదురుకావడంతో షియోమీ పరిస్థితి మరింత దిగజారింది.
షియోమీ కంపెనీ ఎక్కువగా 10 వేల నుంచి 12 వేల ఫోన్లే రిలీజ్ చేస్తోంది. కానీ జనాల ప్రాధాన్యత మాత్రం మారింది. ఈఎంఐ ఆప్షన్లు, రకరకాల డిస్కౌంట్లు, ఆఫర్లు ఉండటంతో కాస్త ఎక్కువ డబ్బు పెట్టడానికి రెడీ అవుతున్నారు. మంచి ఫీచర్లున్న ఫోన్ కావాలని భావిస్తూ రూ.20 వేలు దాటిన ఫోన్లనే కొంటున్నారు.
* బ్రాండ్ విషయంలో గందరగోళం
షియోమీ బ్రాండ్ విషయంలో క్లారిటీ మిస్ అయిందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఒకప్పుడు తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లు ఇచ్చే బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకున్న షియోమీ, ఇప్పుడు ప్రీమియం బ్రాండ్గా మారాలని చూస్తోంది. కానీ, ఇది వినియోగదారులను తీవ్రమైన గందరగోళంలోకి నెట్టేస్తోంది.
శామ్సంగ్, వివో, ఒప్పో లాగా అన్ని ధరల్లో ఫోన్లు రిలీజ్ చేయలేకపోవడం కూడా షియోమీకి మైనస్ అవుతోంది. బడ్జెట్ కస్టమర్లను వదిలేసి ప్రీమియం కస్టమర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది కానీ ఆ బడ్జెట్ కస్టమర్లు ఈ ఫోన్లను కొనడానికి పెద్దగా ఆసక్తి కనబడటం లేదు.
* తిరిగి పుంజుకునే ప్రయత్నాలు..
అయితే, షియోమీ మళ్లీ పుంజుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. కొత్త లీడర్షిప్ను తెచ్చుకుంది, 2025 నాటికి కొత్త వ్యూహాలతో వస్తామని చెబుతోంది. స్మార్ట్ఫోన్లతో పాటు, స్మార్ట్ హోమ్ డివైజ్లు, ఇతర ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ప్రొడక్టులపై ఫోకస్ పెట్టాలని చూస్తోంది. ప్రీమియం సెగ్మెంట్పై కూడా దృష్టి పెంచుతోంది.
గతంలో శామ్సంగ్ ఇండియాలో పనిచేసిన టాప్ ఎగ్జిక్యూటివ్స్ను కూడా షియోమీ నియమించుకుంది. తద్వారా మంచి వ్యూహాలతో మళ్లీ ఇండియాలో నంబర్ వన్ పొజిషన్లోకి రావాలని చాలా ప్రయత్నిస్తోంది. ఇప్పుడు రాణిస్తున్న బ్రాండ్లను వెనక్కి నెట్టి ఫస్ట్ పొజిషన్కి రావడం చాలా కష్టమే అని చెప్పుకోవాలి.
* సవాళ్లను దాటుతుందా..
మార్కెట్ సవాళ్లతో పాటు, షియోమీ లీగల్ సమస్యలు కూడా ఎదుర్కొంటోంది. విదేశీ మారకపు ఉల్లంఘనల ఆరోపణలపై కేసులు నడుస్తున్నాయి. అంతేకాదు, షియోమీ సబ్-బ్రాండ్ పోకోపై కూడా రిటైలర్లు యాంటీ-కాంపిటేటివ్ ఆరోపణలు చేస్తున్నారు.
మొత్తానికి షియోమీకి రాబోయే రోజులు చాలా కీలకం. ఈ సవాళ్లన్నిటినీ దాటుకుని, మళ్లీ మార్కెట్లో తన పట్టు నిలుపుకుంటుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications








