2జీ సెగ.. కాల్ ఛార్జీలు పెరిగే అవకాశం?

దేశ చరిత్రలోనే భారీ కుంభకోణంగా వెలుగులోకివచ్చిన 2జి స్పెక్ట్రమ్ వ్యవహారంలో రద్దు అయిన లైసెన్సులకు కనీస ధరను టెలికాం నియంత్రిత వ్యవస్థ ట్రాయ్ నిర్ణయించింది. 2008లో నిబంధనలకు విరుద్ధంగా అప్పటి టెలికాం మంత్రి రాజా హయాంలో మంజూరైన 122 లైసెన్సులను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. 2జీ స్పెక్ట్రమ్కు ప్రారంభ(బేస్) వేలం ధరను రూ.3,622.18 కోట్లుగా ట్రాయ్ ప్రతిపాదించింది. అంటే వేలంలో పాల్గొనే సంస్థలు ఈ రేటుకు దిగువగా ఉన్న ధరతో ధరఖాస్తు చేసే వీలు లేదన్నమాట.
2008లో జరిగిన వేలంతో సరిచూస్తే అప్పటి కనీస ధరకు ఇది పదింతలు అధికం కావడం గమనార్హం. కాగా, సిడిఎమ్ఎ వినియోగదారులకు అవసరమైన 800 మెగాహెడ్జ్ తరంగాలకు, జిఎస్ఎమ్ వినియోగదారులకు అవసరమైన 900 మెగాహెడ్జ్ తరంగాలకు బేస్ ధరలను సూచించిన ట్రాయ్..వీటి ధర కంటే రెండింతలు అధిక ధరను 1800 మెగాహెడ్జ్ తరంగాల వేలానికి నిర్ణయించింది. అంతేగాక వేలంలో పాల్గొనాలనుకున్న టెలికాం ఆపరేటర్లకు కొన్ని నిర్ధిష్టమైన పరిమితులనూ విధించింది. మరోవైపు ట్రాయ్ నిర్ణయంపై టెలికాం ఆపరేటరుల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ట్రాయ్ తాజా సిఫారసుల నేపధ్యంలో మున్ముందు మొబైల్ చార్జీలు పెరగొచ్చనే ఆందోళనలు జోరందుకుంటున్నాయి.


Click it and Unblock the Notifications