సవాళ్ల మధ్య దూసుకువెళుతున్న తెలుగుతేజం,బిల్గేట్స్ ప్రశంసలు
కంప్యూటర్ గురించి తెలిసిన వారికి ఈ పేరు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.గ్లోబల్ దిగ్గజ టెక్నాలజీ కంపెనీ, బిల్ గేట్స్ వంటి దిగ్గజం నడిపించిన కంపెనీకి ఆయనే ఇప్పుడు సారధి. ప్రముఖ మైకోసాఫ్ట్ కంపెనీకి 2014 ఫిబ్రవరి 4వ తేదీన సత్య నాదెళ్ల సీఈఓ నియమితులయ్యారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం బక్కాపురం గ్రామంలో సత్యనాదెళ్ల 1967లో పుట్టాడు. హైదరాబాద్లో అందరి పిల్లలతోపాటు చదివిన ఈ అబ్బాయి ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీని ముందుకు నడిపిస్తున్నారు. ఆయన జన్మదినం సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

హైద్రాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువు
తండ్రి యుగంధర్ 1962 బ్యాచ్ ఐఎఎస్ అధికారిగా పనిచేశారు.2004 నుండి 2009 వరకు కేంద్ర ప్రణాళిక సంఘం సభ్యుడిగా, ప్రధానమంత్రి కార్యదర్శిగా పనిచేశారు. సత్య నాదెళ్ల ప్రాథమిక విద్యాభ్యాసం హైద్రాబాద్లో సాగింది. హైద్రాబాద్ పబ్లిక్ స్కూల్ క్రికెట్ జట్టు సభ్యుడిగా ఆయన ఉన్నాడు. లీడర్షిప్ క్వాలిటీస్ ను క్రికెట్ నుండి నేర్చుకొన్నట్టుగా ఆయన చెబుతారు. 2013లో హైద్రాబాద్ పబ్లిక్ స్కూల్ 90వ వార్షికోత్సవంలో సత్య నాదెళ్ల పాల్గొన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా చదివిన స్కూల్ను మాత్రం మరిచిపోలేదు. ‘హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చేరడం, విద్యను అభ్యసించడమనేది నా జీవితంలోనే అత్యంత విలువైన ఘట్టం' అని సత్య నాదెళ్ల ఎప్పుడూ చెబుతుంటారు.

పుస్తక రచయిత
అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్శిటీ నుండి కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ, చికాగో యూనివర్శిటీ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మాస్టర్స్ డిగ్రీ చేశారు. 1992లో మైక్రోసాఫ్ట్ లో ఆయన అడుగుపెట్టారు. ఈయన పుస్తక రచయిత కూడా. హిట్ రిఫ్రెష్ అనే పుస్తకాన్ని రచించారు. అలాగే ఈయనకు కవిత్వం కూడా బాగా ఇష్టం.

మూడో సీఈవో
44 ఏళ్ల మైక్రోసాఫ్ట్ ప్రస్థానంలో కేవలం ముగ్గురు మాత్రమే సీఈవోలుగా పనిచేశారు. బిల్గేట్స్, స్టీవ్ బామర్ ఇద్దరు సీఈవోలు కాగా వారి తర్వాత సత్య నాదెళ్ల మూడో సీఈవో. మైక్రోసాఫ్ట్ కంపెనీకి అత్యధిక లాభాలనిచ్చే సర్వర్ టూల్ బిజినెస్, అత్యధిక నష్టాలనిచ్చే బింగ్ బిజినెస్ రెండింటి బాధ్యతలను ఈయనే నిర్వహించడం విశేషం.

బిల్ గేట్స్ ప్రశంసలు
మైక్రోసాఫ్ట్ సంస్థను ముందుండి నడిపే సత్తా సత్యకు తప్పా మరెవ్వరికీ లేదని బిల్ గేట్స్ కితాబు ఇచ్చారు. మైక్రోసాఫ్ట్ను ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా తీర్చిదిద్దారు. ఇప్పుడు ఈ స్థానం అమెజాన్, మైక్రోసాఫ్ట్ మధ్య దోబూచులాడుతోంది. భవిష్యత్తు ప్రపంచ టెక్నాలజీగా భావిస్తున్న 'క్లౌడ్' (ప్రత్యేకంగా 'అజూర్')పై సత్య నాదెళ్లకు పూర్తి పట్టుంది. మైక్రోసాఫ్ట్లో క్లౌడ్ ఆపరేటింగ్ సిస్టమ్ను రూపొందించిన ఘనత సత్య నాదెళ్లదే.

క్రికెట్ అంటే ఇష్టం
సత్య నాదెళ్ల స్కూల్లో క్రికెట్ బాగా ఆడేవారు. ఈ క్రమంలోనే క్రీడలు తన జీవితంపై ఎంతటి ప్రభావం చూపాయో కూడా వివరించారు. టెస్ట్ క్రికెట్ మ్యాచ్లను ఇష్టంగా చూస్తారు. టెస్ట్ మ్యాచ్లోని మలుపు రష్యన్ నవలను గుర్తుకు తెస్తాయని చెబుతుంటారు. సత్య నాదెళ్ల తన చిన్ననాటి స్నేహితురాలు, క్లాస్మేట్ అయిన అనుపమను పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న అదే ఏడాది మైక్రోసాఫ్ట్ పగ్గాలు చేపట్టారు. 2014 ఫిబ్రవరి 4న కంపెనీ సీఈవోగా నియమితులయ్యారు.


Click it and Unblock the Notifications








