5G Spectrum వేలంలో పాల్గొంటున్న Adani గ్రూప్స్.. కారణం ఇదే!
ఆసియా కుబేరుడు గౌతమ్ అదానీకి చెందిన Adani Groups కీలక ప్రకటన చేసింది. తమ కంపెనీ త్వరలో నిర్వహించబోయే 5G Spectrum వేలంలో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు ప్రకటించింది. అదానీ గ్రూప్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఆ కంపెనీ భవిష్యత్తులో అంబానీ గ్రూపుతో ప్రత్యక్ష పోటీని ఎదుర్కోనున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ.. కేవలం తమ వ్యాపారాలకు ప్రైవేట్ నెట్వర్క్ ఏర్పరుచుకోడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అదానీ సంస్థ స్పష్టం చేసింది. జులై 26న కేంద్ర ప్రభుత్వం 5G Spectrum వేలం వేయనున్న విషయం తెలిసిందే.

అదానీ గ్రూప్ జూలై 26న, 5G Spectrum వేలంలో పాల్గొనేందుకు సన్నాహాలు జరుపుతున్నట్లు వచ్చిన వార్తలను శనివారం ధృవీకరించింది. అంతేకాకుండా, టెలికాం రంగంలో తాము ప్రత్యక్షంగా అడుగుపెట్టడం లేదని, కేవలం తమ వ్యాపారాలకు ప్రైవేట్ నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. భారత్లో తదుపరి తరం 5జీ సేవలకు మారుతున్నందున తాము కూడా ఓపెన్ బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు అదానీ గ్రూప్స్ చెప్పింది. విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, లాజిస్టిక్, విద్యుదుత్పత్తి ఇతర తయారీ వ్యాపార కార్యకలాపాల్లో సైబర్ భద్రతను పెంపొందించుకోవడంతో పాటు ప్రైవేట్ నెట్వర్క్ సొల్యూషన్లను అందించేందుకు వేలంలో అడుగుపెడుతున్నట్లు అదానీ గ్రూప్ స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా, టెలికాం యేతర సంస్థలకు ప్రైవేట్ క్యాప్టివ్ నెట్వర్క్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా స్పెక్ట్రమ్ను కేటాయించడాన్ని ఇదువరకే ఉన్న టెలికాం కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎందుకంటే ఇది వారి వ్యాపారాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని ఆయా సంస్థలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ వేలంలో రిలయన్స్ గ్రూపుకు చెందిన Jio తో పాటు, Bharti Airtel మరియు దేశంలోని మరో రెండు ఆధిపత్య టెలికాం కంపెనీలు Vodafone Idea (Vi) లిమిటెడ్ కూడా 5G వేలంలో పాల్గొనడానికి ఇదువరకే దరఖాస్తులు చేసుకున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

అపర కుబేరుడైన అంబానీ, ఇదువరకు చమురు శుద్ధి మరియు పెట్రోకెమికల్స్ వ్యాపారం నుండి టెలికాం మరియు రిటైల్ వ్యాపారాలకు విస్తరించగా.. అదానీ ఆపరేటింగ్ పోర్ట్ల నుండి బొగ్గు, ఇంధన పంపిణీ, విమానాశ్రయాలు, డేటా సెంటర్లు మరియు ఇటీవల సిమెంట్ మరియు రాగి ఉత్పత్తికి తమ వ్యాపార కార్యకలాపాల్ని విస్తరించారు. తాజాగా 5జీ స్పెక్ట్రమ్ వేలానికి దరఖాస్తు చేసుకోవడం ఆసక్తికరంగా మారింది.
5జీ స్పెక్ట్రం వేలానికి సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం:
ఇండియాలో 5G స్పెక్ట్రమ్ వేలంను నిర్వహించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. 5G స్పెక్ట్రమ్ వేలం ప్రకటనతో ప్రభుత్వం భారతదేశంలోని ప్రజలకు మరియు సంస్థలకు 5G సేవలను అధికారికంగా ప్రారంభించనుంది. నోటిఫికేషన్ ఇన్విటేషన్ ల ద్వారా టెలికాం శాఖ (DoT) వేలం తేదీలను కూడా వెల్లడించింది. 5G స్పెక్ట్రమ్ వేలం జూలై 26, 2022న ప్రారంభమవుతుంది. ఈ వేలం ప్రక్రియకు సంబంధించిన టైమ్టేబుల్ను కూడా DoT వెల్లడించింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.
5G స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనడానికి దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ జూలై 8 న ముగిసింది. అయితే దరఖాస్తుదారుల జాబితా జూలై 12న బహిరంగంగా ప్రకటించనున్నారు. అయితే మాక్ వేలం జూలై 22 మరియు జూలై 23న జరుగుతుంది. DoT ప్రీ-బిడ్ కాన్ఫరెన్స్ను కూడా నిర్వహిస్తుంది. కాన్ఫరెన్స్ యొక్క వేదిక, తేదీ / సమయం వివరాలను ప్రత్యేకంగా DoT వెబ్సైట్లో తెలియజేయబడుతుంది.
5G స్పెక్ట్రమ్ వేలంను 20 సంవత్సరాల చెల్లుబాటు వ్యవధితో మొత్తం 72097.85 MHz స్పెక్ట్రమ్ని జూలై 26, 2022 లో వేలం నిర్వహించనున్నారు. ఈ స్పెక్ట్రమ్ వేలంలో లెస్ (600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz), మిడ్ (3300 MHz) మరియు హై (26 GHz) ఫ్రీక్వెన్సీ బ్యాండ్లు ఉన్నాయి. వీటి యొక్క సాయంతో మెషిన్-టు-మెషిన్ కమ్యూనికేషన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి కొత్త-యుగం యాప్ ల ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి మరియు ప్రైవేట్ క్యాప్టివ్ నెట్వర్క్ల అభివృద్ధి మరియు ఏర్పాటును ప్రారంభించాలని కూడా క్యాబినెట్ నిర్ణయించింది.


Click it and Unblock the Notifications








