ఫీచర్ ఫోన్ యూజర్లకు కళ్లు చెదిరే ప్లాన్,జియోని ఢీ కొట్టిన ఎయిర్టెల్
ఫీచర్ ఫోన్లు వాడేవారికి అసలైన శుభవార్తను అందించిన ఎయిర్టెల్, జియోని తలదన్నే ప్లాన్తో మార్కెట్లోకి..
దేశీయ రంగంలో జియోకి ప్రత్యర్థి ఇప్పుడు ఏదైనా ఉందంటే అది ఎయిర్టెల్ అనే చెప్పాలి. జియోతో పోటాపోటీగా ఆఫర్లను అందిస్తూ పోతోంది. ఈ నేపథ్యంలో జియోని ఢీకొట్టేందుకు అసలైన ప్లాన్ తో ముందుకొచ్చింది. ఇందులో భాగంగా భారతీ ఎయిర్టెల్ రూ.299కే ఓ నూతన ప్రీపెయిడ్ ప్లాన్ను తాజాగా ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్లో కస్టమర్లకు అన్లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్ వస్తాయి. రోజుకు 100 ఎస్ఎంఎస్లను పంపుకోవచ్చు. ఈ ప్లాన్ వాలిడిటీ 45 రోజులుగా ఉంది.

అయితే ఈ ప్లాన్లో కస్టమర్లకు ఎలాంటి డేటా లభించదు. కేవలం ఫీచర్ ఫోన్ యూజర్లకు మాత్రమే పనికొచ్చేలా ఈ ప్లాన్ను అందుబాటులోకి తెచ్చారు. మరో వైపు జియోలో రూ.299 ప్లాన్కు రోజుకు 3జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ కాల్స్ను అందిస్తున్నారు. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులుగా ఉంది.

అత్యధిక మొబైల్ కస్టమర్లు ఎయిర్టెల్కే..
కాగా కొత్త కొత్త ఆఫర్లతో నూతనంగా కస్టమర్లను తన ఖాతాలో వేసుకుంటున్న జియో ఎక్కువమంది కస్టమర్లను ఆకర్షించడంలో వెనకనే ఉంది.ఇప్పుడు అత్యధిక మొబైల్ కస్టమర్లు ఎయిర్టెల్కే ఉన్నారు. మరోవైపు మార్కెట్ షేర్లోనూ ఎయిర్టెల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నది.

ఎయిర్టెల్కు మొత్తం 308.6 మిలియన్ల మంది కస్టమర్లు
సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏఐ) విడుదల చేసిన వివరాల ప్రకారం దేశంలో ఎయిర్టెల్కు మొత్తం 308.6 మిలియన్ల మంది కస్టమర్లు ఉన్నారు. ఏప్రిల్ నెలలో కొత్తగా 45 లక్షల మంది వచ్చి చేరారు.

రెండో స్థానంలో వొడాఫోన్
రెండో స్థానంలో 222.03 మిలియన్ల మంది సబ్స్ర్కైబర్లతో వొడాఫోన్ నిలవగా నిలిచింది. వొడాఫోన్ చందాదారుల సంఖ్య 22.2 కోట్లుగా నమోదైంది. కాగా వొడాఫోన్ నుంచి 6.6 లక్షల మంది చందాదారులు బయటకు వెళ్లిపోయారు.

ఐడియా తరువాతి స్థానంలో..
216.76 మిలియన్ల మందితో ఐడియా తరువాతి స్థానంలో నిలిచింది.ఐడియా సెల్యులర్ కు 55.5 లక్షల మంది కొత్త కస్టమర్లు ఏప్రిల్ మాసంలో వచ్చి చేరారు. ఐడియా మొత్తం చందాదారుల సంఖ్య 21.6 కోట్లుగా ఉంది.

జియోకు మొత్తం 186.56 మిలియన్ల మంది కస్టమర్లు
కొత్త కొత్త ఆఫర్లతో దూసుకుపోతున్న జియోకు మొత్తం 186.56 మిలియన్ల మంది కస్టమర్లు ఉండగా సీవోఏఐ జాబితాలో జియో 4వ స్థానంలో నిలిచింది.

ఎయిర్సెల్..
తరువాతి స్థానాల్లో వరుసగా ఎయిర్సెల్ (74.15 మిలియన్లు), టెలినార్ (37.98 మిలియన్లు), ఎంటీఎన్ఎల్ (3.56 మిలియన్లు)లు నిలిచాయి.

మార్కెట్ షేర్ విషయానికి వస్తే..
అదేవిధంగా మార్కెట్ షేర్ విషయానికి వస్తే ఎయిర్టెల్ 29.41 శాతంతో అగ్రస్థానంలో ఉండగా తరువాతి స్థానాల్లో వరుసగా వొడాఫోన్ (21.15 శాతం), ఐడియా (20.65 శాతం), జియో (17.77 శాతం)లు నిలిచాయి.

మార్చి నాటికి టెలికం రంగంలో 104.9 కోట్ల మంది యూజర్లు..
ఏప్రిల్ నెలకు సంబంధించి టెలికం యూజర్ల గణాంకాలను పరిశీలిస్తే ఐడియా, ఎయిర్టెల్ ఈ రెండు సంస్థలకు మొత్తంగా కోటి మంది చందాదారులు తోడయ్యారు. ఈ ఏడాది మార్చి నాటికి టెలికం రంగంలో 104.9 కోట్ల మంది యూజర్లు ఉన్నారు.


Click it and Unblock the Notifications