ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ సీఈఓ పదవికి శశి అరోరా రాజీనామా
ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఇంకా సీఈఓ శశి అరోరా తన పదవికి రాజీనామ చేసారు. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్తో పాటు దాని పేరెంట్ కంపెనీ అయిన భారతీ ఎయిర్టెల్కు సంబంధించిన ఆధార్ ఆధారిత ఇకేవైసీ లైసెన్స్ను UIDAI సస్పెండ్ చేసిన నేపథ్యంలో శశి అరోరా రాజీనామాకు ప్రాధాన్యత సంతరించుకుంది.

అరోరా 2006 నుంచి ఎయిర్టెల్ సీనియర్ లీడర్షిప్ రోల్స్లో కొనసాగుతున్నారు. జూన్ 1, 2016న ఈయనను ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్కు ఎండీ ఇంకా సీఈఓగా అపాయింట్ చేస్తూ ఎయిర్టెల్ ఉత్తర్వులు జారీ చేసింది.
శశి అరోరా రాజీనామా పై ఎయిర్టెల్ ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఎయిర్టెల్ను వీడాలని అరోరా నిర్ణయించుకున్నారని ఆయన భవిష్యత్ అవకాశాలు మరింత బాగుండాలని తాము ఆకాంక్షిస్తున్నట్లు తెలిపింది. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అభివృద్ధి కీలక పాత్ర పోషించిన అరోరా తమ సంస్థకు పెద్ద ఆస్తి అని టెలికంతో పాటు డీటీహెచ్ సేవల విభాగంలో ఆయన పాత్ర ఎంతో కీలకమని ఎయిర్టెల్ తన ప్రకటనలో పేర్కొంది.
సిమ్ వెరిఫికేషన్ నిమిత్తం ఇచ్చిన ఆధార్ ఈకేవైసీ వివరాలను ఖాతాదారుల అనుమతి లేకుండా వారి పేర్ల మీద పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్లను ఓపెన్ చేసినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఎయిర్టెల్ పై యునిక్ ఐడెంటిటీ అథారిటీ ఆఫ్ ఇండియా సీరియస్ అయ్యింది.
దీంతో ఎయిర్టెల్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకుకు సంబంధించిన ఆధార్ ఇ-కెవైసీ ధ్రువీకరణ అధికారాన్ని నిలిపివేసింది. విచారణ పూర్తి అయి తుది నివేదిక అందేంత వరకు ఈ సస్పెన్షన్ కొనసాగే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








