అన్ని గ్రామ పంచాయితీలకు ఇంటర్నెట్ సౌకర్యం
క్యాష్ లెస్ ఎకానమీని మరింతగా ప్రోత్సహించే క్రమంలో ఇంటర్నెట్ కనెక్టువిటీని పూర్తిస్ధాయిలో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు మోదీ సర్కార్ ప్రకటించింది.
వచ్చే ఏడాది చివరి నాటికి దేశంలోని 2.5 లక్షల గ్రామ పంచాయితీలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నట్లు ప్రభుత్వం లోక్ సభలో ప్రకటించింది. క్యాష్ లెస్ ఎకానమీని మరింతగా ప్రోత్సహించే క్రమంలో ఇంటర్నెట్ కనెక్టువిటీని పూర్తిస్ధాయిలో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు మోదీ సర్కార్ ప్రకటించింది.

2017-18 బడ్జెట్లో డిజిటిల్ ఇండియాకు పెద్దపీట వేస్తూ కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా 1.5 లక్షల గ్రామ పంచాయితీలకు ఆప్టిక్ ఫైబర్ ఆధారిత ఇంటర్నెట్ కనెక్టువిటీని ఈ ఆర్థిక సంవత్సరంలో సమకూర్చాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.

ఇప్పటికే 1,50,000 కిలో మీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ను విస్తరించామని, భారత్నెట్ ప్రోగ్రామ్ క్రింద రూ.10,000 కోట్ల నిధులను కేటాయించినట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. భారత్నెట్ ఫేజ్ 1 పనుల్లో మార్చి 2017 నాటికి 100,000 పంచాయితీల్లో ఆప్టిక్ ఫైబర్ సేవలు అందుబాటులోకి వస్తాయి. భారత్నెట్ ఫేజ్ 2 పనులు 2017 మధ్యలో ప్రారంభమై సెప్టంబర్ 2018 నాటికి పూర్తవుతాయని అరుణ్ జైట్లీ తెలిపారు. భారత్నెట్ ఫేజ్ 2 పనులు పూర్తి అయ్యే నాటికి 1,50,000 పంచాయితీల్లో హైస్పీడ్ ఆప్టికల్ ఫైబర్ సేవలు అందుబాటులోకి వచ్చేస్తాయని మంత్రి తెలిపారు.

‘డిజిటల్ ఇండియా' దేశ చరిత్రలో ఓ ముందడుగు..
కమ్యూనికేషన్ ప్రపచంలో అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతికతను దేశనలుమూలలకు విస్తరింపజేసే లక్ష్యంతో ప్రారంభమైన ‘డిజిటల్ ఇండియా' దేశ చరిత్రలో ఓ ముందడుగు. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ డిజిటల్ ఇండియా పథకం ద్వారా సుమారు రూ.లక్ష కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులను సామాన్యుల చెంతకు చేర్చే ప్రయ్నతం చేస్తోంది. దేశ అభివృద్థికి కీలకంగా భావిస్తోన్న ఈ-గవర్నెన్స్, ఈ - క్రాంతి, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ, బ్రాండ్ బ్యాండ్ హైవేలు, మొబైల్ కనెక్టువిటీ, పబ్లిక్ ఇంటర్నెట్ యాక్సెస్ ఇంకా ఐటీ ఆధారిత రంగాలకు ఊతమివ్వడమే ఈ ప్రథకం ప్రధాన లక్ష్యం. డిజిటల్ ఇండియా ప్రత్యేకతలను ఇప్పుడు తెలుసుకుందాం..

డిజిటల్ లాకర్ సిస్టం
బంగారు ఆభరణాలను బ్యాంక్ లాకర్ లలో భద్రపరుచుకుంటున్నట్లుగానే పాన్ కార్డ్, పాస్ పోర్ట్, ఆధార్ కార్డ్ వంటి ముఖ్యమైన పత్రాలను కేంద్ర ప్రభుత్వం అందించే డిజిటల్ లాకర్ లో సౌకర్యవంతంగా భద్రపరుచుకోవచ్చు. క్లౌడ్ కంప్యూటింగ్ ఆధారంగా ఈ వ్యవస్థను
డిజైన్ చేసారు.

MyGov.in
ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ప్రభుత్వ వ్యవహారలన్నీ సమన్వయరీతిలో పౌరులకు అందుబాటులోకి తీసుకువచ్చి సుపరిపాలనకు దోహదపడుతుంది. స్వచ్చ్ భారత్ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత లోతుగా తీసుకువెళ్లేందుకు ఈ యాప్ దోహదపడుతుంది.

ఈ - సంతకం..
ఈ - సంతకం ద్వారా పౌరులు తమ ఆధార్ కార్డ్లను ఉపయోగించుకుని డాక్యుమెంట్ల పై డిజిటల్ సంతకాలను చేయవచ్చు. తద్వారా డబ్బు, సమయం ఆదా అవటంతో పాటు మీ సంతకానికి చట్టబద్ధంగా గుర్తింపు ఇంకా గోప్యత లభిస్తుంది.

ఈ - ఆస్పత్రి పథకం
ఈ - ఆస్పత్రి పథకం ద్వారా పారదర్శకమైన ఆరోగ్య సేవలను దేశ పౌరులు పొందవచ్చు. ఆన్లైన్ అపాయింట్మెంట్, రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు, రక్తం అందుబాటు వంటి ముఖ్యమైన సేవలను ఈ - ఆస్పత్రి పథకం ద్వారా సామాన్య, మధ్యతరగతి ప్రజలు పొందవచ్చు.

జాతీయ ఉపకారవేతన పోర్టల్
జాతీయ ఉపకారవేతన పోర్టల్ చేకూరే ప్రయోజనాలు: ఈ పోర్టల్ ద్వారా ఉపకారవేతనాలకు అర్హులైన విద్యార్థులు కాలపరిమితిలోపు తమ అప్లికేషన్ లను పంపించటంతో పాటు తమ ఉపకార వేతనాల బదిలీ తీరును ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

డిజిటైజ్ ఇండియా
ప్రభుత్వ సర్వీసులకు సంబంధించి అన్ని రికార్డులను డిజిటలైజ్ చేసే కార్యక్రమమే డిజిటైజ్ ఇండియా ప్లాట్ఫామ్. దేశంలోని 2,50,000 గ్రామ పంచాయితీలకు హై స్పీడ్ ఇంటర్నెట్ను అందించే లక్ష్యంతో భారత్ నెట్ ప్రోగ్రామ్ పనిచేస్తుంది. బీఎస్ఎన్ఎల్ తరువాతి జనరేషన్ నెట్వర్క్ను ప్రజలకు చేరువచేయటంతో పాటు బీఎస్ఎన్ఎల్ ఉచిత వై-ఫై హాట్స్పాట్లను దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేయటం కూడా డిజిటల్ ఇండియాలో ఒక భాగమే.


Click it and Unblock the Notifications