ఇండియాలో అమెజాన్ రూ.1,700 కోట్ల పెట్టుబడులు
భారత్లో జోరుగా కార్యకలాపాలు విస్తరిస్తున్న అమెరికన్ ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియాలో భారీగా పెట్టుబడులు పెట్టింది. చెల్లింపులు, హోల్సేల్ వ్యాపార విభాగాల్లో రూ. 1,700 కోట్ల పైగా ఇన్వెస్ట్ చేసింది. అమెజాన్ పే ఇండియా విభాగానికి అమెజాన్ కార్పొరేట్ హోల్డింగ్స్, అమెజాన్డాట్కామ్డాట్ఐఎన్సీఎస్ నుంచి రూ. 1,355 కోట్లు వచ్చాయి. ఇందుకు ప్రతిగా ఆయా సంస్థలకు అమెజాన్ పే ఇండియా షేర్లు కేటాయించింది. ఆ రెండు సంస్థల నుంచి రూ. 360 కోట్లు అందుకున్న అమెజాన్ హోల్సేల్ (ఇండియా) కూడా షేర్లు కేటాయించింది. కార్పొరేట్ వ్యవహారాల శాఖకు సమర్పించిన పత్రాల ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. గతేడాది అక్టోబర్లోనే వివిధ విభాగాలపై అమెజాన్ రూ. 4,400 కోట్లు ఇన్వెస్ట్ చేసింది.

భారత్లో 2025 నాటికి అదనంగా పది లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి తీసుకొస్తామని అమెజాన్ వ్యవస్ధాపకులు జెఫ్ బెజోస్ హామీ ఇచ్చారు.

భారత్లో మూడు రోజుల పర్యటనలో భాగంగా దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో చిన్న మధ్యతరహా వ్యాపారాల డిజిటలీకరణ కోసం తాము వంద కోట్ల డాలర్లు వెచ్చిస్తామని ఆయన ఇప్పటికే ప్రకటించారు. భారత ప్రభుత్వంతో రిటైల్ నిబంధనలపై వివాదం కొనసాగుతున్నా బెజోస్ భారీ ప్రణాళికలను ప్రకటించారు. భారతీయుల శక్తిసామర్థ్యాలు, వినూత్న పద్ధతులు తనను ఆకట్టుకుంటాయని ఆయన చెప్పుకొచ్చారు.

చిన్న వ్యాపారులు మరింత మంది కస్టమర్లకు చేరువయ్యేలా తమ పెట్టుబడులు ఉపకరిస్తాయని అన్నారు. అమెజాన్ అంతర్జాతీయ ఫ్లాట్ఫాం ద్వారా భారత్ నుంచి 2025 నాటికి వేయి కోట్ల డాలర్ల ఎగుమతులు ప్రపంచ దేశాలకు చేరువవుతాయని చెప్పారు. భారత్లో తాము వెచ్చించే పెట్టుబడులతో మరో ఐదేళ్లలో దేశవ్యాప్తంగా పది లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయన్నారు.


Click it and Unblock the Notifications








