తమ్ముడికి అన్న షాకివ్వబోతున్నారా, అగమ్యగోచరంగా ఆర్కామ్
రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) ఒకప్పుడు టెలికాం రంగంలో సంచలనం సృష్టించి మకుటం లేని మహారాజుగా వెలుగొందింది.
రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) ఒకప్పుడు టెలికాం రంగంలో సంచలనం సృష్టించి మకుటం లేని మహారాజుగా వెలుగొందింది. పదిహేనేళ్ల క్రితం మొబైల్ టెలిఫోన్ సేవలను అందించటంలో ఎవరికి అందనంత ఎత్తులో ఉన్న కంపెనీ నేడు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉంది. భవిష్యత్ అగమ్యగోచరమై ప్రస్తుతం రోజువారీ కార్యకలాపాల కోసం మరొకరిపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. అనిల్ అంబానీ ఆర్కామ్, ఆర్పవర్, ఆర్ఇన్ఫ్రా ఇలా ఏ ఒక్కటి కూడా గడచిన కొన్నేళ్లుగా లాభాలు ఆర్జించిన పరిస్థితే లేదు. వ్యాపార నిర్వహణ కోసం తీసుకున్న రుణాలను చెల్లించలేక ఆర్ కామ్ దివాలా దశకు చేరింది. దీంతో కంపెనీకి రుణాలిచ్చిన బ్యాంకులు, ఆర్థిక సంస్థల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఆస్తుల విక్రయం ద్వారా బకాయిలు పూర్తిగా వసూలవుతాయో లేదోనని రుణదాతలు భయపడుతున్నారు. దీంతో పాటు ఆర్ కామ్ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా రుణదాతలకు అర్థం కాని పరిస్థితిలోనే ఉన్నాయి. పూర్తి సమాచారంలోకెళితే..

దివాలా పరిష్కార ప్రక్రియ
రోజు రోజుకు పెరుగుతున్న ఒత్తిడితో దివాలా పరిష్కార ప్రక్రియకు వెళ్లాలని అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) నిర్ణయించింది. రుణాలు చెల్లించడానికి అవసరమైన ఆస్తులను విక్రయించడంలో విఫలం కావడమే ఇందుకు నేపథ్యంగా తెలుస్తోంది.

జియోకు స్పెక్ట్రమ్ విక్రయించడంలో సైతం విఫలం
ఇదిలా ఉంటే ముకేశ్ అంబానీ నేతృత్వంలోని జియోకు స్పెక్ట్రమ్ విక్రయించడంలో సైతం ఆర్కామ్ విఫలమైన విషయం తెలిసిందే. ముకేశ్ అంబానీ కంపెనీ ఆర్జియో.. అనిల్ అంబానీని గట్టెక్కించేందుకు రూ.25,000 కోట్లతో స్పెక్ట్రమ్ను కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది. అయితే రెగ్యులేటరీ అనుమతులు రాకపోవటంతో సంక్షోభంలోకి జారుకుంది.

స్వీడన్ సంస్థ ఎరిక్సన్
ఆర్కామ్పై దివాలా చర్యలు చేపట్టాల్సిందిగా తొలుత స్వీడన్ సంస్థ ఎరిక్సన్ ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. బకాయిలు చెల్లించడానికి ఎన్సీఎల్టీ సమయం ఇచ్చినప్పటికీ.. ఆర్కామ్ చెల్లించలేకపోయింది. ప్రస్తుతం ఆర్కామ్కు రూ.46,000 కోట్ల రుణభారం ఉంది.ప్రస్తుతం ఆర్కామ్ ఆస్తుల విక్రయానికి 100% రుణదాతల అనుమతి లభించడం సవాలుగా మారింది.

న్యాయపరమైన సమస్యలు
కంపెనీ ఆస్తుల విక్రయానికి టెలికమ్యూనికేషన్ల విభాగం (డాట్), టీడీశాట్, పలు కోర్టుల వద్ద న్యాయపరమైన సమస్యలు తలెత్తాయి. కాగా ఎన్సీఎల్టీ 66 శాతం మెజారిటీ నిబంధనతో తమకు 100 శాతం అనుమతులు లభిస్తాయని కంపెనీ భావిస్తోంది.

సుప్రీం నోటీసులు
ఆర్కామ్ చైర్మన్ అనిల్ అంబానీకి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. అనిల్ అంబానీపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలంటూ ఎరిక్సన్ ఇండియా.. సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) ద్వారా రుణ పరిష్కార ప్రణాళిక అమలు చేయాలని ఆర్కామ్ డైరెక్టర్ల బోర్డు నిర్ణయించిందని ఆ కంపెనీ తెలిపింది.

న్యాయస్థానం బకాయిలు చెల్లించాలని ఆదేశించినా...
రూ.550 కోట్ల బకాయిలు చెల్లించకుండా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్తో డీల్ కుదుర్చుకుందని, ఈ కేసులో న్యాయస్థానం బకాయిలు చెల్లించాలని ఆదేశించినా ఆర్కామ్ పట్టించుకోలేదని పేర్కొంది. కోర్టు ధిక్కార నేరం కింద అనిల్ అంబానీని జైలుకు పంపించాలని కోరింది. దీంతో సుప్రీం కోర్టు.. అనిల్ అంబానీకి నోటీసులు జారీ చేసింది.

రూ.118 కోట్లు డిపాజిట్
కాగా కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు రిజిస్ట్రీ దగ్గర బకాయిల చెల్లింపు నిమిత్తం రూ.118 కోట్లు డిపాజిట్ చేసేందుకు ఆర్కామ్కు జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్ నేతృత్వంలోని బెంచ్ అనుమతినిచ్చింది. రెండు డిమాండ్ డ్రాఫ్ట్స్ రూపంలో ఈ మొత్తాలను చెల్లించేందుకు సుముఖంగా ఉన్నట్లు ఆర్కామ్ తెలిపింది.

జియో ఇది వరకే భాగస్వామ్యం
ఆర్కామ్కు 43,000 టవర్లు, 1.78 లక్షల కిలోమీటర్ల ఆఫ్టిక్ ఫైబర్ కేబుల్ నెట్వర్క్, 248 మీడియా కన్వర్జెన్సీ నోడ్స్ను ఉపయోగించుకోవడానికి రిలయన్స్ జియో ఇది వరకే భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఆస్తులను ఆర్జియో వైర్లెస్, ఫైబర్ టు హోమ్ సేవల కోసం వినియోగించుకుంటుంది.

800 మెగాహెడ్జ్
ఏ ఇతర టెలికం ఆపరేటర్లకు లేనటువంటి అత్యంత విలువైన 800 మెగాహెడ్జ్ ఆర్కామ్ వద్ద ఉంది. దీన్ని రేడియో ఫ్రీక్వెన్సీకి వాడుతున్నారు. ఆర్కామ్ ఆస్తులపై భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు ఎలాంటి ఆసక్తిని కనబర్చడం లేదు.


Click it and Unblock the Notifications








