ధనవంతుల జాబితా నుంచి అనిల్ అంబానీ అవుట్
దేశంలో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో అనిల్ అంబానీ ఒకరనే విషయం అందరికీ తెలిసిందే. అడాగ్ గ్రూప్ అధినేతగా, ఆర్కామ్ ఛైర్మన్గా ఉన్న ఈయన ఆస్తి ఇపుడు హారతి కర్పూరంలా తరిగిపోయింది. ఫలితంగా ఈయన ధనవంతుల జాబితా నుంచి స్థానం కోల్పోయారు. బిలియనీర్ క్లబ్నుంచి కిందికి పడిపోయారు. అప్పుల సంక్షోభం, టెలికాం సంస్థ ఆర్కాంతోపాటు ఇతర గ్రూపుసంస్థల వరుస నష్టాల నేపథ్యంలో అంబానీ సామ్రాజ్యం కుప్పకూలింది.

2008 లో 42 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలో 6 వ స్థానంలో నిలిచిన అనిల్ అంబానీ ఇప్పుడు ప్రస్తుతం ఆ స్థానాన్ని కోల్పోయారు. 11 సంవత్సరాలలో, అంబానీ మొత్తం వ్యాపార సామ్రాజ్యం ఈక్విటీ విలువ 3,651 కోట్ల రూపాయలకు (523 మిలియన్ డాలర్లు) కుప్పకూలింది. దీంతో ఈ పరిణామం చోటు చేసుకుంది.

2008లో ఫోర్బ్స్ జాబితాలో ఆరో స్థానం
గత 2008లో ఫోర్బ్స్ జాబితా ప్రకటించిన జాబితాలో అనిల్ అంబానీ ఓ బిలియనీర్. ఆ సమయంలో ఈయన ఆస్తి విలువ 42 బిలియన్ డాలర్లుగా ఉండేది. అంటే.. ప్రపంచ బిలియనీర్ల జాబితాలో అనిల్ అంబానీది ఆరో స్థానమన్నమాట.

ప్రస్తుతం ఆస్తి విలువ రూ.3651 కోట్లు
దశాబ్దకాలం గడిచిపోయేసరికి ఆయన ఆస్తి కర్పూరంలా కరిగిపోయింది. ప్రస్తుతం అనిల్ అంబానీ మొత్తం ఆస్తి విలువ కేవలం రూ.3651 కోట్లు (523 మిలియన్ డాలర్లు) మాత్రమే. దీనికి ఆయన సారథ్యంలోని అనేక కంపెనీలు అప్పుల్లో కూరుకునిపోవడం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. దీని ఫలితంగా ఆయా కంపెనీల షేర్ల ధరలు గణనీయంగా పడిపోయాయి. అప్పులు భారీగా పెరిగిపోయాయి. దీంతో ఆయన వ్యాపార సామ్రాజ్యం విలువ పాతాళానికి చేరిపోయింది.

43 శాతం వాటాలను విక్రయించాలని..
మ్యూచుఫల్ ఫండ్ జాయింట్ వెంచర్ అయిన, రిలయన్స్ - నిప్సాన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్లోని తమ 43 శాతం వాటాలను విక్రయించాలని బ్యాంకులు నిర్ణయించుకోవడం, గడచిన 14 నెలల కాలంలో రూ.35 వేల కోట్లకు పైగా రుణాలను తీర్చడంతోనే అనిల్ అంబానీ ఆస్తి హారతికర్పూరమైందని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

నాలుగు నెలల క్రితం రూ .8వేల కోట్లకు..
రిలయన్స్ గ్రూప్ విలువ నాలుగు నెలల క్రితం రూ .8వేల కోట్లకు పైగా ఉండటం గమనార్హం. ఆయన మొత్తం సంపద 42 బిలియన్ డాలర్లనుంచి 0.5 బిలియన్ డార్లకు పడిపోయింది. 2018 ,మార్చి నాటికి రిలయన్స్ గ్రూప్ కంపెనీల మొత్తం రుణం 1.7 లక్షల కోట్లకు పైగా ఉంది.

అప్పులు చెల్లించడానికి
ఇదిలా ఉంటే అప్పులు చెల్లించడానికి తాము పూర్తిగా కట్టుబడి వున్నామని అనిల్ అంబానీ ప్రకటించారు. 2018 ఏప్రిల్ మరియు మే 2019 మధ్య కాలంలో ఇప్పటికే వడ్డీ సహా రూ. 35వేల కోట్ల రూపాయల రుణాలను తిరిగి చెల్లించామని పేర్కొన్నారు. ఆస్తులు విక్రయం, తనఖా ద్వారా ఈ అప్పులను తీర్చినట్టు తెలిపారు.

వాటాదారులు, ఉద్యోగుల పూర్తి మద్దతు
బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల నుంచి తమకు ఎటువంటి సహాయం అందలేదని స్పష్టం చేశారు. ఆర్థికపరమైన సవాళ్లు, ఇబ్బందులు ఎన్ని ఉన్నా రుణాలను పూర్తిగా తీర్చడానికి కట్టుబడి వున్నామన్నారు. ఈ పక్రియ వివిధ దశల్లో ఇప్పటికే అమల్లో ఉందని చెప్పారు. ఈ క్రమంలో రిలయన్స్ గ్రూపునకు చెందిన వాటాదారులు, ఉద్యోగుల పూర్తి మద్దతు తమకు లభిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications