AP లో సోషల్ మీడియా బ్యాన్.. అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Social Media Ban : సోషల్ మీడియా బ్యాన్ లేదా నియంత్రణ గురించి ఇటీవల అనేక దేశాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. సోషల్ మీడియా అనేక రంగాలను ప్రభావితం చేస్తోంది. అయితే సామాజిక మాధ్యమాల వినియోగం చిన్నారులపై చెడు ప్రభావం చూపుతోందని అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చిన్నారులు వీటిని వినియోగించకుండా చర్యలు తీసుకుంటున్నారు.
చిన్నారులు సోషల్ మీడియా వినియోగించకుండా ఆస్ట్రేలియా ఇప్పటికే కీలక చర్యలు తీసుకుంది. బ్రిటన్, గ్రీస్, స్లోవేనియా, స్పెయిన్ వంటి దేశాలు కూడా ఈ తరహా నిర్ణయాలు దిశగా ఆలోచన చేస్తున్నాయి. అయితే భారత్లోనూ ఈ తరహా డిమాండ్ వినిపిస్తోంది.

ఏపీ, సీఎం కీలక ప్రకటన :
ముఖ్యంగా 16 ఏళ్లలోపు చిన్నారులను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలని భావిస్తున్నారు. ఇవాళ ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ముఖ్యమంత్రులు కీలక ప్రకటనలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఇవాళ అసెంబ్లీలో ప్రకటన చేశారు.
90 రోజుల్లో కీలక చర్యలు :
13 ఏళ్లలోపు చిన్నారులు సోషల్ మీడియా వినియోగించకుండా నిషేధం విధిస్తామని ప్రకటించారు. రానున్న 90 రోజుల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పారు. సామాజిక మాధ్యమాల కారణంగా చిన్నారులు నష్టపోకూడదని భావిస్తున్నట్లు చెప్పారు.
13 నుంచి 16 ఏళ్ల వయస్సులో ఉన్న వారికి ఎలాంటి నిబంధనలు తీసుకురావాలో అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు. టెక్నాలజీకి బానిసలైతే జీవితాలు నాశనమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
తొలి రాష్ట్రంగా కర్ణాటక :
కర్ణాటక ప్రభుత్వం కూడా చిన్నారులు సోషల్ మీడియా వినియోగంపై సంచలన నిర్ణయం తీసుకుంది. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 16 ఏళ్లలోపు పిల్లలు సామాజిక మాధ్యమాలు వినియోగించడాన్ని బ్యాన్ చేస్తామని ప్రకటన చేశారు. దేశంలో ఈ తరహా నిర్ణయం తీసుకున్న తొలి రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది.
ఇండోనేషియా కూడా :
స్మార్ట్ఫోన్ వినియోగం చిన్నారులపై ప్రతికూల ప్రభావం చూపుతోందని, దాన్ని కట్టడి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక సీఎం తెలిపారు. గోవా కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇండోనేషియా కూడా తాజాగా ప్రకటన చేసింది. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తామని వెల్లడించింది.
చిన్నారుల ఆరోగ్యం, భవిష్యత్ పట్ల తల్లిదండ్రులతోపాటు నిపుణుల నుంచి వ్యక్తం అవుతున్న ఆందోళనల పట్ల మెటాకు చెందిన ఇన్స్టాగ్రామ్ ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంది. టీన్స్ అకౌంట్స్ తోపాటు పేరెంటల్ కంట్రోల్ ఫీచర్లను తీసుకొచ్చింది. రాత్రి సమయాల్లో ఇన్స్టా వినియోగాన్ని నియంత్రించేలా ఫీచర్లను కూడా తీసుకొచ్చింది.
గత వారమే మరో కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారుల ఇన్స్టా కంటెంట్ పట్ల మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. చిన్నారులు వారి ఖాతాల ద్వారా ఆత్మహత్యలు లేదా ఇతర విధాలుగా హాని చేసే కంటెంట్ ను సెర్చ్ చేస్తే ఆ వివరాలు తల్లిదండ్రులకు అలెర్ట్ రూపంలో చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.


Click it and Unblock the Notifications








