విద్యార్థులకు అమ్మ ఒడి ల్యాప్టాప్లకు బదులుగా టాబ్లెట్లను ఇవ్వనున్న జగన్ సర్కార్
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ముఖ్యంగా 9 నుండి 12 తరగతుల మధ్య చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులకు ల్యాప్టాప్ కంప్యూటర్లను అందిస్తున్నట్లు గతంలో ప్రకటించింది. అయితే విద్యార్థులకు ఇచ్చిన వాగ్దానాన్ని రాష్ట్రప్రభుత్వం నిలబెట్టుకోలేకపోవడంతో విద్యార్థులు నిరాశకు గురయ్యారు. ప్రభుత్వ వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం రాష్ట్రం యొక్క ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా చూసుకుంటే కనుక విద్యార్థులకు ల్యాప్టాప్లను పంపిణీ చేయడం అనే ప్రతిపాదన చాలా ఖరీదైనది.

కరోనా రాకతో ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ రంగంవైపు మళ్లుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని గతంలో ప్రభుత్వం విద్యార్థులకు ల్యాప్టాప్లను అందిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇందులో కొన్ని డిజిటల్ లెర్నింగ్ యాప్లు పని చేయవు అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తమ నిర్ణయాన్ని విరమించుకున్నట్లు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు (టాబ్లెట్ కంప్యూటర్లను) మాత్రమే పంపిణీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబందించిన మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

డిజిటల్ లెర్నింగ్ కంటెంట్తో లోడ్ చేయబడిన ప్రతి ట్యాబ్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం రూ.12,000 ధర వద్ద కొనుగోలు చేయనున్నది. ఈ ట్యాబ్లను విద్యార్థులకు ఈ ఏడాది సెప్టెంబరు నాటికి పంపిణీ చేయాలని యోచిస్తున్నట్లు సీనియర్ విద్యాశాఖ అధికారి తెలిపారు. 8వ తరగతి విద్యార్థులు తదుపరి తరగతులకు కూడా ఇదే ట్యాబ్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ల్యాప్టాప్ అవసరం లేదని అధికారి తెలిపారు. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న 8వ తరగతి విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఈ ట్యాబ్ ను అందిస్తారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు గతేడాది దీనికి సంబంధించి ఒక ప్రకటనను విడుదల చేసారు. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులు ల్యాప్టాప్ కంప్యూటర్లను కొనుగోలు చేయడం కోసం అమ్మఒడి పథకం కింద రూ.15,000 విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అమ్మఒడి పథకం కింద లభించే ఈ మొత్తంతో ప్రతి ఒక్క తల్లి కూడా తమ పిల్లలను పాఠశాలలకు పంపడానికి ప్రోత్సహంగా ఉపయోగపడుతుంది అని ప్రకటించారు. 2022 విద్యా సంవత్సరంలో ల్యాప్టాప్లను అందజేస్తామని గతంలో చెప్పారు.

ఆంధ్రప్రదేశ్లో ప్రకటించిన ఈ పథకంతో రాష్ట్రంలోని 9 నుండి 12 తరగతులకు చెందిన 8,21,655 మంది విద్యార్థులు క్యాష్ డోల్కు బదులుగా ల్యాప్టాప్లను ఎంచుకున్నారు. వీరిలో 1.10 లక్షల మంది విద్యార్థులు మరో ఉచిత పథకమైన వసతి దీవెన కింద కవర్ చేయబడ్డారు. కానీ ధరల విషయంలో సరఫరాదారులతో ఒప్పందం కుదుర్చుకోకపోవడంతో ప్రభుత్వం వాగ్దానం చేసిన విధంగా ల్యాప్టాప్లను విద్యార్థులకు పంపిణీ చేయలేకపోయింది.

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గత వారం సరఫరాదారులతో చర్చలు జరుపుతున్నామని మరియు ధరలను ఖరారు చేసి అమ్మఒడిలో భాగమైన ప్రతి విద్యార్థులకు ల్యాప్టాప్లను అందజేస్తామని చెప్పారు. అయితే చివరికి అనేక ఇతర పథకాల వలె ఈ మాటను కూడా ప్రభుత్వం తప్పింది.

అమ్మఒడి కార్యక్రమంలో సీఎం ప్రసంగిస్తూ 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ గురించి మాత్రమే మాట్లాడారు. ల్యాప్టాప్ల గురించి ప్రస్తావించనే లేదు. అమ్మఒడి మూడో విడత నగదు పంపిణీని మాత్రమే సీఎం అధికారికంగా మాట్లాడారు.

ల్యాప్టాప్ల కొనుగోలు బాధ్యతను ఏపీ టెక్నాలజీ సర్వీసెస్కు అప్పగించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాన్ఫిగరేషన్ను బట్టి ఒక్కో ల్యాప్టాప్ను రూ.18,000కి కొనుగోలు చేయాలని APTS కోరింది. అయితే సరఫరాదారులు ఒక్కో ల్యాప్టాప్ ధరను రూ.26,000గా పేర్కొనడం వల్ల ప్రభుత్వానికి గిట్టుబాటు కావడం లేదు. సరఫరాదారులు చెప్పిన ధరకు ల్యాప్టాప్లను కొనుగోలు చేస్తే రాష్ట్రంపై అదనపు ఆర్థిక భారం రూ.657 కోట్లు ఉంటుందని ఆయన సూచించారు.


Click it and Unblock the Notifications








