డ్రోన్ నిఘాలో లాక్డౌన్.... బయటకు వస్తే అంతే సంగతులు...
కరోనా వైరస్ కారణంగా దేశం మొత్తాన్ని లాక్డౌన్లో ఉంచారు. దేశం మొత్తం మీద ఈ లాక్ డౌన్ ను ఒక సారి పొడిగించారు. మొదటి సారి పొడిగించే సమయానికి తెలుగు రెండు రాష్ట్రాలలో కరోనా పాజిటివ్ ల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఈ పాజిటివ్ సంఖ్యను తగ్గించడానికి ప్రభుత్వం లాక్ డౌన్ ను మరింత కఠినం చేసింది. అందుకోసం పోలీసులకు డ్రోన్ లను కూడా అందించింది. ఈ డ్రోన్ టెక్నాలజీ సహాయంతో ప్రస్తుతం ప్రజలు ఇంటి వద్ద ఎక్కువగా గుమికూడి ఉండడాన్ని సులభంగా గుర్తిస్తున్నారు.

డ్రోన్ కెమెరా నిఘా
లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తోన్న వారిని కంట్రోల్ చేయడం పోలీసులకు తలనొప్పిగా మారింది. రోడ్ల మీదకు వచ్చే వాళ్లను కంట్రోల్ చేయడానికే టైం సరిపోక తిప్పలు పడుతుంటే.. చిన్న చిన్న సందుల్లో గుమికూడుతున్న వారు, చెట్ల కింద కూర్చోని ఆటలాడుతున్న వారితో కొత్త తలనొప్పులు మొదలవుతున్నాయి. ఇటువంటి వీరికి డ్రోన్ల సాయంతో పోలీసులు చెక్ పెడుతున్నారు. పెద్ద పెద్ద నగరాల్లో పోలీసులు డ్రోన్ల సాయంతో చిన్న చిన్న గల్లీలపై సైతం నిఘా పెడుతున్నారు.

పోలీసుల పంజా
కరోనా వైరస్ పంజా విసరడంతో లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు పోలీసులు. జనాలంతా ఇళ్లకే పరిమితం కావాలని పదే, పదే చెబుతున్నారు. ఇవన్నీ పట్టించుకోని కొంతమంది ఆకతాయిలు రోడ్లపైకి వస్తున్నారు. కరోనా భయం కూడా లేకుండా దర్జాగా తిరిగేస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో కొందరు ఆకతాయిలు, పిల్లలు లాక్డౌన్ పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నారు. దీంతో ఏపీలో పోలీసులు నిఘా పెంచారు.. రోడ్లపైకి వచ్చేవారిపై ఫోకస్ మార్చారు.

Ap పోలీసుల నిఘా
జులాయిగా తిరిగేవారిని డ్రోన్ కెమెరాలతో వెంటాడుతున్నారు పోలీసులు. లాక్డౌన్ సమయంలో బయటకు వచ్చేవారిని కెమెరా ద్వారా రికార్డ్ చేయిస్తున్నారు. వారిపై కేసులు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా ఏపీ పోలీసులు ఓ వీడియోను ట్వీట్ చేశారు.. అందులో లాక్డౌన్ను పట్టించుకోకుండా పిల్లలు క్రికెట్ ఆడుతున్నారు. ఇంతలో డ్రోన్ కెమెరా ఎగురుకుంటూ అటువైపుగా వచ్చింది. డ్రోన్ను గమనించిన పిల్లలు అక్కడి నుంచి పరుగులు తీశారు.

పోలీసుల ట్విట్టర్ వీడియో
డ్రోన్ కూడా పిల్లల్ని గ్రౌండ్ నుంచి వెంటాడింది. వారు ఎటు వైపు వెళితే అటు వెళ్లింది. ప్రజల్ని అప్రమత్తం చేయడానికి ఇలాంటి వీడియోలను పోలీసులు ట్వీట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ లాక్డౌన్ నిబంధనల్ని పాటించాల్సిందేనని.. ఎవరైనా ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామంటున్నారు.
డ్రోన్ కెమెరాతో నిఘా పెంచామని.. ఎవరైనా అనవసరంగా రోడ్లపైకి వచ్చినా.. తిరిగినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.


Click it and Unblock the Notifications