భారత్లో భారీ స్థాయిలో ఆపిల్ ఐఫోన్ల తయారీ.. ఏకంగా డబుల్ ప్రొడక్షన్..?
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ భాధ్యతలు చేపట్టాక.. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ముందుకెళ్తున్నారు. భారత్, చైనా సహా అనేక దేశాలపై ప్రతీకార సుంకాలు విధించేలా నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 5 నుంచి 10 శాతం సుంకాలు అమల్లోకి తీసుకొచ్చారు. ఏప్రిల్ 9 నుంచి పూర్తిస్థాయిలో అమెరికా టారిఫ్లు అమల్లోకి రావాల్సి ఉండగా.. అంతలోనే సుంకాల అమలును 90 రోజుల పాటు వాయిదా వేశారు. అయితే చైనాకు మాత్రం మినహాయింపు ఇవ్వలేదు. అయితే దీనిపై చైనా సైతం దీటుగానే స్పందించింది. ఫలితంగా రెండు దేశాల మధ్య వాణిజ్య పరంగా ఉద్రిక్తతలు ప్రారంభం అయ్యాయి.
ఆపిల్ ఐఫోన్ల తరలింపు :
అయితే ఈ పరిస్థితులను నిశీతంగా గమనించిన టెక్ దిగ్గజం ఆపిల్ (Apple) ముందస్తు చర్యలు తీసుకుంది. దీంతోపాటు భవిష్యత్ గురించి కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. మార్చి చివరి వారంలోనే 5 సరకు రవాణా విమానాల్లో భారత్ నుంచి అమెరికాకు ఆపిల్ ఉత్పత్తులను తరలించింది.
ఆపిల్ సంస్థ కీలక నిర్ణయం :
ప్రస్తుతం చైనాలో అధిక శాతం ఐఫోన్ల ఉత్పత్తి జరుగుతోంది. చైనాపై భారీ స్థాయిలో అమెరికా సుంకాల కారణంగా అమెరికాలో వాటి ధరలు భారీగా పెరగనున్నాయి. దీంతో ఆపిల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్లో ఐఫోన్ల ఉత్పత్తిని గణనీయంగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
భారత్లో డబుల్ ప్రొడక్షన్ :
ప్రస్తుతం భారత్లో ప్రతి సంవత్సరం ఆపిల్ సుమారు 40 - 43 మిలియన్ల ఐఫోన్లను తయారీ చేస్తోంది. అయితే ఈ ఉత్పత్తిని 2026 చివరి నాటికి 70 - 80 మిలియన్ యూనిట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అమెరికాకు ప్రధాన ఐఫోన్ ఎగుమతిదారుగా భారత్ నిలిచే అవకాశం ఉంది.
ప్రపంచ ఐఫోన్ విక్రయాల్లో :
ప్రస్తుతం భారత్లో ఆపిల్ సంస్థ ఫాక్స్కాన్, టాటా ఎలక్ట్రానిక్స్ ద్వారా ఐఫోన్లను ఉత్పత్తి చేస్తోంది. టాటా ఎలక్ట్రానిక్స్ గత సంవత్సరం విస్ట్రాన్, పెగాట్రాన్ ప్లాంట్స్ను కొనుగోలు చేసింది. దీంతో 18 నెలల్లో ప్రపంచ ఐఫోన్ విక్రయాల్లో భారత్ 40 శాతం ఉత్పత్తి చేసే సామర్థ్యం సొంతమవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఉత్పత్తితో పోలిస్తే ఈ అంచనా 18 - 20 శాతం అధికం.
గ్లోబల్ ఐఫోన్ తయారీ హబ్లో ఆపిల్ రెండో స్థానానికి చేరుకొనే అవకాశం ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.85 వేల కోట్లుగా ఆపిల్ ఎగుమతులు నమోదు కాగా.. 2025 ఆర్థిక సంవత్సరానికి ఈ ఎగుమతులు రూ.1.5 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
భారత్లో ఐఫోన్ల తయారీ పెరుగుదల అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అమెరికా వాణిజ్య ఒప్పందాలపై ఆధారపడి ఉంటుంది. చైనా పట్ల ట్రంప్ సున్నితమైన వైఖరి అవలంభిస్తే, భారత్లో ఐఫోన్ల ఉత్పత్తి కాస్త నెమ్మదించే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
అయితే మరికొన్ని రోజుల్లో భారత్లో ఐఫోన్ల ఉత్పత్తి పెరుగుదల సహా చైనా- అమెరికా మధ్య వాణిజ్య ఘర్షణ వాతావరణంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications