ప్రముఖ డిజిటల్ ఇమేజింగ్ ఉత్పత్తుల కంపెనీ ఎప్సన్, 'ఇంక్ ట్యాంక్ సిస్టమ్' ఉన్న రెండు రకాల అధునాతన ప్రింటర్లను భారతీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఇందులో 'ఎల్100 ప్రింటర్' బ్లాక్ అండ్ వైట్ది కాగా, 'ఎల్200 ఆల్ ఇన్ వన్' అనేది కలర్ ప్రింటర్. ఈ ప్రింటర్ల ప్రత్యేకతలను బుధవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంస్థ సీనియర్ జీఎం (మార్కెటింగ్) సాంబమూర్తి వివరించారు. సాధారణ ఇంక్ క్యాట్రిడ్జ్ ప్రింటర్లతో పోల్చినప్పుడు తమ 'ఇంక్ ట్యాంక్ సిస్టమ్' ప్రింటర్లలో వ్యయాలు బాగా ఆదా అవుతాయని ఆయన పేర్కొన్నారు.
'ఎల్100' బ్లాక్ అండ్ వైట్ ప్రింటర్లోని ఇంక్ ట్యాంక్లో 70 ఎంఎల్ ఇంక్తో 4000 పేజీలు ప్రింట్ చేయవచ్చని, ఒక్కో పేజీకి అయ్యే ఖర్చు కేవలం 10 పైసలు మాత్రమేనని వివరించారు. అదేవిధంగా ఎల్200 ఆల్ ఇన్ వన్ కలర్ ప్రింటర్లోని మూడు ఇంక్ ట్యాంకుల్లో ఒక్కో దాన్లో 70 ఎంఎల్ ఇంక్ ద్వారా 6500 కలర్ పేజీలు ప్రింట్ చేయవచ్చని ఇక్కడ ఒక్కో పేజీకి 20 పైసలు ఖర్చు అవుతుందని తెలిపారు. సాధారణ క్యాట్రిడ్జ్ ప్రింటర్లలో ఉండే సమస్యలు- నకిలీ ఇంక్ క్యాట్రిడ్జ్ వల్ల ప్రింటర్ చెడిపోవడం... వంటివి ఇందులో ఉండవని పేర్కొన్నారు. ఎల్100 ప్రింటర్ ధర రూ. 8,999, ఎల్200 ఆల్ ఇన్ వన్ ప్రింటర్ ధర రూ. 10,999 ఉన్నట్లు సాంబమూర్తి వెల్లడించారు.