Ayodhya Ram Mandir అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రతిష్టను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు..ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
అయోధ్యలో ఈనెల 22న రామమందిరంలో (Ayodhya Ram Mandir) విగ్రహ ప్రతిష్ఠ జరగనుంది. ప్రతిష్టాపన కార్యక్రమాలు జనవరి 16 నుంచి ప్రారంభం కానున్నాయి. 22న మధ్యాహ్న సమయంలో రాముడి విగ్రహాన్ని శాశ్వత ప్రతిష్ట చేయనున్నారు. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీ సహా ఇతర ప్రముఖులను రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఇప్పటికే ఆహ్వానాలను పంపింది.
ఈ వేడుకను కన్నుల పండువగా నిర్వహించేందుకు ట్రస్టు కీలక ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమం కోసం అయోధ్య పురవీధులు సుందరంగా తీర్చుదిద్దుకుంటున్నాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు, ముఖ్యులు రానుండడంతో ప్రభుత్వ పరంగా భద్రత సహా ప్రజారవాణా ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

వేలాది మంది పోలీసులతో భద్రతను కల్పిస్తున్నారు. మరోవైపు ప్రధాని రాక నేపధ్యంలో ఆయన భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఇప్పటికే రంగంలోకి దిగింది. దీంతోపాటు నేషనల్ సెక్యూరిటీ గార్డు దళాలు కూడా అయోధ్యలోకి ప్రవేశించాయి. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది.
అయితే ఈ కీలక ఘట్టంపై సైబర్ నేరగాళ్లు కన్నేశారు. రామమందిరం విరాళాల సేకరణ పేరుతో మోసం చేస్తున్నారు. ట్రస్టుకు సంబంధించిన వ్యక్తులుగా తమను పరిచయం చేసుకుంటూ ఆన్లైన్ ద్వారా విరాళాలు సేకరిస్తున్నారు. ఇందుకు సంబందించి నకిలీ క్యూఆర్ కోడ్లను (Fake QR code scam) షేర్ చేస్తున్నారు. ఈ క్యూఆర్ కోడ్లు అయోధ్య రామమందిర విరాళాలకు చెందినవని భావిస్తున్న కొందరు మోసపోతున్నారు.

ఈ క్యూఆర్ కోడ్ స్కామ్ గురించి విశ్వ హిందూ పరిషత్ సహా ఇతర సంబందిత వర్గాలకు సమాచారం అందడంతో అప్రమత్తం అయ్యాయి. ఈ స్కామ్పై విశ్వహిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ స్పందించారు. X (ట్విట్టర్) ద్వారా కేంద్ర హోం శాఖ సహా ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విరాళాల సేకరణకు ఇతరులకు అనుమతి లేదు : ఇందుకు సంబంధించిన కొన్ని స్క్రీన్షాట్లను తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఈ స్కామ్పై భక్తులు అప్రమత్తంగా ఉండాలని, అయోధ్య రామమందిరానికి సంబంధించిన విరాళాలు సేకరించేందుకు ఇతరులకు ఎవరికీ అధికారం లేదని స్పష్టం చేశారు.
ఇలాంటి ప్రత్యేక సందర్భాలను ఆసరాగా చేసుకొని సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారు. అందువల్ల ఎక్కడబడితే అక్కడ క్యూఆర్ కోడ్ను స్కానింగ్ చేసే అలవాటును తగ్గించుకోండి. స్పష్టమైన ధ్రువీకరణ తర్వాతే నగదు లావాదేవీలు నిర్వహించుకోండి. ఏదైనా దేవాలయాలకు విరాళాలు ఇవ్వాలనుకొంటే సంబంధిత వర్గాలు లేదా అధికారిక వెబ్సైట్లో వివరాల ఆధారంగా నడుచుకోండి. మోసాలకు గురైతే వెంటనే సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయండి.
గిజ్బాట్ తెలుగు వెబ్సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








