భారత్ ట్యాక్సీ సేవలు ప్రారంభం.. ఈ క్యాబ్ బుకింగ్ ప్లాట్ఫాం ఎలా పనిచేస్తుంది?
Bharat Taxi Services : భారత్ ట్యాక్సీ సర్వీసులను కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్షా ప్రారంభించారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఈ సర్వీసులను అధికారికంగా ప్రారంభించారు. దేశ ప్రజలు ట్యాక్సీ సర్వీసుల కోసం ఇప్పటి వరకు ఓలా, ఉబర్, ర్యాపిడోలపై మాత్రమే ఆధారపడేవారు. ఈ విభాగంలోకి తాజాగా భారత్ ట్యాక్సీ ప్లాట్ఫాం వచ్చి చేరింది. తొలిదశలో భాగంగా డిల్లీ NCR (నేషనల్ క్యాపిటల్ రీజియన్), గుజరాత్లో ఈ సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.
దేశవ్యాప్తంగా ఎప్పటికి అందుబాటులోకి వస్తాయి :
దేశవ్యాప్తంగా భారత్ ట్యాక్సీ సేవలను రానున్న మూడు సంవత్సరాల్లో అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ప్రైవేట్ ట్యాక్సీ సర్వీసులతో పోలిస్తే.. ఈ కొత్త ప్లాట్ఫాంతో డ్రైవర్లకు అధిక ఆదాయం వస్తుందని కేంద్ర మంత్రి చెబుతున్నారు. ఈ ప్లాట్ఫాం డ్రైవర్లకు యాజమాన్య హక్కును ఇస్తుందని చెప్పారు.

ఏయే సంస్థలు ఇందులో భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి :
ఈ ప్లాట్ఫాం భారత సహకార మంత్రిత్వ శాఖ సపోర్టుతో ప్రారంభించారు. అయితే భారత్ ట్యాక్సీ ప్రభుత్వ సంస్థ కాదు. దేశంలోని ప్రముఖ సహకార సంస్థలు ఈ ప్లాట్ఫాంను ఏర్పాటు చేశాయి. ఇందులో అమూల్, NCDC, నాబార్డ్, నాఫెడ్, క్రిభ్కో, NDDB, NCEL, ఇఫ్కో వంటి సంస్థలు ఉన్నాయి.
కేవలం కార్లు మాత్రమే కాకుండా:
భారత్ ట్యాక్సీ ప్లాట్ఫాం ద్వారా కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలను బుకింగ్ చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది. ఈ ప్లాట్ఫాం జీరో కమీషన్ పాలసీపైన పనిచేస్తుంది. దీంతోపాటు డ్రైవర్లు సొంత వాహనాలను కొనుగోలు చేసేందుకు కావాల్సిన రుణాన్ని పొందడాన్ని సులభతరం చేస్తుందని తెలుస్తోంది.
సర్జ్ ఛార్జీలు ఉండవ్ :
ప్రయాణికులకు అర్థం అయ్యే విధంగా ముందస్తు ధరలను వెల్లడిస్తుంది. సర్జ్ ఛార్జీలు లేకుండా హామీ ఇస్తుందని తెలుస్తోంది. భద్రతపరంగాను మెరుగైన చర్యలు తీసుకుంటున్నారు. గుర్తింపు పొందిన డ్రైవర్లు, రియల్టైం రైట్ ట్రాకింగ్, అనేక భాషల సపోర్టుతో 24/7 గంటలపాటు సాయాన్ని పొందవచ్చు. భద్రత పరంగా ఢిల్లీ, గుజరాత్ పోలీసుల సమన్వయం చేసుకుంటుంది.
భారత్ ట్యాక్సీలో డ్రైవర్ల ఆదాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. అయితే ప్రస్తుతం ఢిల్లీ సహా గుజరాత్లోనే ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. యాప్ ఆధారిత క్యాబ్ సేవల్లో పారదర్శకత, డ్రైవర్లకు స్థిరమైన ఆదాయం వచ్చే విధంగా ఈ ఫ్లాట్ఫాం పనిచేస్తుందని తెలుస్తోంది.
ఇతర క్యాబ్ బుకింగ్ ప్లాట్ఫాంలలో 25-30 శాతం కమీషన్ ఉంటుంది. అయితే భారత్ ట్యాక్సీలో జీరో శాతం కమీషన్ పాలసీ ఉంటుంది. వర్షాలు సహా రద్దీ సమయాల్లోనూ అధిక ఛార్జీలు వసూలు చేయరు. ఇతర సంస్థలతో పోలిస్తే 20 శాతం నుంచి 30 శాతం వరకు తక్కువ ధరలకే ప్రయాణాలు చేయవచ్చు.
ప్రయాణికులు చెల్లించే ప్రతి రూ.100 లో రూ.80 డ్రైవర్కు వెళ్తుంది. మిగిలిన రూ.20.. ప్లాట్ఫాం నిర్వహణ, డ్రైవర్ల సంక్షేమం కోసం ఉపయోగిస్తారు. డ్రైవర్లకు ప్రమాద బీమాతోపాటు కుటుంబ బీమా కూడా ఉంటుంది.


Click it and Unblock the Notifications








