ఉచిత విద్య కోసం Airtel రూ. 7 వేల కోట్లు విరాళం
దేశంలో అతి పెద్ద టెలికం సంస్థ అయిన భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ దేశంలో ఉచిత విద్య కోసం భారీ విరాళాన్ని ప్రకటించారు.
దేశంలో అతి పెద్ద టెలికం సంస్థ అయిన భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ దేశంలో ఉచిత విద్య కోసం భారీ విరాళాన్ని ప్రకటించారు. తమ వ్యక్తిగత సంపదలో పదిశాతాన్ని అంటే రూ. 7 వేల కోట్లను గ్రూప్ దాతృత్వ సంస్థ అయిన భారతి ఫౌండేషన్కు ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ఈ మొత్తంలోనే ఎయిర్టెల్లో భారతి కుటుంబానికి చెందిన మూడు శాతం వాటా కూడా ఉంది.

రూ. 7 వేల కోట్లతో..
రూ. 7 వేల కోట్లతో పాటు విరాళంగా వచ్చిన సొమ్ముతో సత్యభారతి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి పేదలు, అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన యువ ప్రతిభావంతులకు ఉచిత విద్య అందించనున్నట్టు ఆయన తెలిపారు.

సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కోర్సులను..
ఈ విశ్వ విద్యాలయంలో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కోర్సులను ఉచితంగా నేర్పించే ఏర్పాటు చేస్తామని తెలిపారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి వాటిపై ప్రధానంగా దృష్టిసారిస్తారు.

2021 నాటికి రెడీ..
కాగా ఉత్తర భారతదేశంలో అందుబాటులోకి రానున్న ఈ యూనివర్సిటీ 2021 నాటికి రెడీ అవుతుంది. పదివేల మందితో అదే ఏడాది తొలి అకడమిక్ ఇయర్ ప్రారంభం అవుతుందని సునీల్ మిట్టల్ వివరించారు.

సత్యభారతి యూనివర్సిటీ ఏర్పాటుకు..
అయితే సత్యభారతి యూనివర్సిటీ ఏర్పాటుకు తొలి దశలో రూ.1000 కోట్ల వరకు ఖర్చవుతుందని చెప్పిన మిట్టల్ పేద విద్యార్థులకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తామన్నారు. సీట్లు మిగిలితే నామమాత్రపు రుసుముతో ఇంకొందరిని తీసుకుంటామన్నారు.

వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు
యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు అవసరమైన భూమి కోసం పంజాబ్, హరియాణా సహా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నట్టు మిట్టల్ తెలిపారు. ఇప్పటికే నందన్ నీలేకని కుటుంబం తమ సంపదలో 50 శాతం వాటాను విరాళానికి ప్రకటించిన సంగతి తెలిసిందే


Click it and Unblock the Notifications








