మహా కుంభమేళాలో బ్లింకిట్ స్టోర్.. ఆర్డర్ పెట్టిన క్షణాల్లోనే భక్తులకు నిత్యవసరాలు డెలివరీ!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో బ్లింకిట్ సరికొత్త సంచలనానికి తెరతీసింది. కోట్లాది మంది భక్తులు, పర్యాటకులు తరలివస్తున్న ఈ మహా ఆధ్యాత్మిక సమ్మేళనంలో, బ్లింకిట్ ప్రత్యేకంగా ఓ టెంపరరీ స్టోర్ను ఏర్పాటు చేసింది. దీంతో భక్తులకు కావాల్సిన వస్తువులు క్షణాల్లో వారి గుడారాల వద్దకే చేరుతున్నాయి. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బ్లింకిట్ CEO అల్బిందర్ ధిండ్సా స్వయంగా ఈ విషయాన్ని ఎక్స్ ప్లాట్ఫామ్ ద్వారా వెల్లడించారు. "ప్రయాగ్రాజ్లోని మహా కుంభమేళాలో భక్తులు, పర్యాటకులకు సేవ చేయడానికి మేం తాత్కాలిక బ్లింకిట్ స్టోర్ను ప్రారంభించాం." అని ఆయన ట్వీట్ చేశారు. ఈ ప్రకటనతో బ్లింకిట్ మరోసారి తన కస్టమర్-ఫస్ట్ విధానాన్ని చాటుకుంది.

* ఈ ప్రాంతాలకు క్విక్ డెలివరీలు
కేవలం 100 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ స్టోర్ కొలువుదీరింది. ఆ ఒకే స్టోర్ నుంచి అరైల్ టెంట్ సిటీ, డోమ్ సిటీ, ITDC లగ్జరీ క్యాంప్, దేవరాఖ్, ఇతర ముఖ్య ప్రాంతాలకు డెలివరీలు జరుగుతున్నాయి. ఇక్కడ భక్తులకు నిత్యం అవసరమయ్యే పూజా సామాగ్రి, పాలు, పెరుగు, పండ్లు, కూరగాయలు, అంతేకాదు త్రివేణి సంగమ జలం బాటిళ్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
అంతేకాదు, ఛార్జర్లు, పవర్ బ్యాంకులు, టవల్స్, దుప్పట్లు, బెడ్షీట్ల వంటి అత్యవసర వస్తువులు కూడా లభిస్తున్నాయి. కుంభమేళాకు వచ్చే వారి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేకమైన ఉత్పత్తులను ఎంపిక చేశారు.
Today we've opened a temporary Blinkit store in Maha Kumbh Mela, Prayagraj to serve pilgrims and tourists.
— Albinder Dhindsa (@albinder) January 17, 2025
This one is a 100 sq ft store which will be delivering in Arail Tent City, Dome City, ITDC Luxury Camp, Devrakh, and other key areas of the Maha Kumbh Mela.
Our teams are… pic.twitter.com/p8pDakE1SV
* నెటిజన్లు ఫిదా
బ్లింకిట్ తీసుకున్న ఈ చొరవకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఇంత పెద్ద జనసందోహంలో కూడా ప్రజలకు సౌకర్యం కల్పించాలనే బ్లింకిట్ ఆలోచనను అందరూ ప్రశంసిస్తున్నారు.
"ఎంత గొప్ప ఆలోచన, ఇప్పుడు యాత్రికులు మరో విషయం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు" అని ఒక యూజర్ కామెంట్ చేయగా, మరొకరు "అద్భుతమైన చొరవ, బ్లింకిట్ అత్యంత అవసరమైన వస్తువులను ఎక్కడ కావాలో అక్కడికి చేరవేస్తోంది" అని కొనియాడారు.
కుంభమేళాకు వెళ్లిన ఒక వ్యక్తి తన అనుభవాన్ని పంచుకుంటూ, "నేను 12వ తేదీన అక్కడికి వెళ్లాను, బ్లింకిట్ అందుబాటులో ఉందో లేదో చూశాను. ఇక్కడ ఈ సేవ ఉండటం నిజంగా అద్భుతం" అని పేర్కొన్నారు. కొందరు ఈ స్థాయిలో ఇన్వెంటరీని ఎలా నిర్వహిస్తారనే ప్రశ్నలు లేవనెత్తినా, చాలా మంది "చాలా మంచి చొరవ. బ్లింకిట్ టీమ్కు అభినందనలు" అంటూ ప్రశంసలు కురిపించారు.
* భక్తులకు మరిన్ని ఫెసిలిటీస్
శ్రీ మందిర్, వామా.యాప్, దేవ్ధామ్ లాంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు తమ సేవలు చేరువ చేసేందుకు అనేక దూర ప్రాంతపు సదుపాయాలను అందిస్తున్నాయి. వీరు సాంకేతికతను ఉపయోగించి భక్తులు ఎక్కడ ఉన్నా పూజలు, దర్శనాలు పొందేలా చేస్తున్నారు.
ఫిన్టెక్ దిగ్గజం పేటీఎం కూడా ప్రయాగ్రాజ్లో తన కార్యకలాపాలు ప్రారంభించింది. యాత్రికులు, పర్యాటకులు దుకాణాలు, పార్కింగ్ స్థలాలు, ఇతర సేవలకు సులభంగా చెల్లించేందుకు వీలుగా పేటీఎం ఏర్పాట్లు చేసింది. అంతేకాకుండా, ఈ కార్యక్రమంలోని వ్యాపారుల కోసం ప్రత్యేకమైన QR కోడ్ను కూడా పేటీఎం విడుదల చేసింది.
మహా కుంభమేళాలో భద్రత, కార్యకలాపాలు సజావుగా సాగేందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ అనేక చర్యలు తీసుకుంది. భక్తుల రద్దీని నియంత్రించడానికి, వారి భద్రతను నిర్ధారించడానికి మొత్తం ప్రాంతాన్ని "నో వెహికల్ జోన్"గా ప్రకటించింది.


Click it and Unblock the Notifications








