ఇండియా ఉద్యోగులకు శాంసంగ్ ఝలక్, 1000 మంది అవుట్ !
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్ ఇండియాలోని తమ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. భారత మార్కెట్లో తమ కంపెనీకి చెందిన సుమారు 1000 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. దీనికి ప్రధాన కారణం భారత మార్కెట్లో చైనా కంపెనీల ఫోన్ల విక్రయాలు అధికమవ్వడమేనని తెలుస్తోంది. చైనా ఫోన్లు తక్కువ ధర లభిస్తుండడంతో శాంసంగ్ ఫోన్ల అమ్మకాలు ఇండియాలో నెమ్మదించాయి.

చైనా కంపెనీలు ఎదుర్కోవాలంటే తప్పని పరిస్థితుల్లో శాంసంగ్ ఫోన్ ధరలను తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కంపెనీ ఆదాయం తగ్గడంతో ఉద్యోగులను తగ్గించుకునే పనిలో పడింది. టెలికాం నెట్ వర్క్ డివిజన్ నుంచి ఇప్పటికే 150 మంది ఉద్యోగులను తీసివేసినట్లు కంపెనీ పేర్కొంది.

మరిన్ని ఉద్యోగాలు
ఇదిలా ఉంటే ఈ వార్తలపై శాంసంగ్ సంస్థ స్పందించింది. ఇవి తప్పుడు వార్తలని కొట్టి పారేసింది. పైగా మరింత మంది ప్రతిభావంతులను ప్రోత్సహించనున్నామని పేర్కొంది. భారతదేశంలో తమ పెట్టుబడులు కొనసాగుతాయనీ, దేశీయ టెలికాం కంపెనీలు 5జీ నెట్వర్క్కు సిద్ధమైన అనంతరం 5జీ వ్యాపారాన్ని కూడా విస్తరిస్తామని తెలిపింది. ఇది మరిన్ని ఉద్యోగాల కల్పనకు దారి తీస్తుందని శాంసంగ్ ప్రకటించింది.

2వేలకు పైగా కొత్త కొలువులు
భారత్లో తమ వ్యాపారాన్ని విస్తృతం చేస్తామని, ఇందుకోసం పెట్టుబడులు పెడుతూనే ఉంటామని శాంసంగ్ ప్రతినిధి ఒకరు చెప్పారు. ప్రపంచంలోని అతిపెద్ద మొబైల్ ఫోన్ ఫ్యాక్టరీ ఏర్పాటు, ఆర్ అండ్ డీలో పెట్టుబడులు, 5జీ నెట్వర్క్ వంటి కొత్త వ్యాపారాల అన్వేషణకు ఉపయోగిస్తామన్నారు. ఈ క్రమంలోనే గతేడాది 2వేలకు పైగా కొత్త కొలువులను ఆఫర్ చేశామంటూ వివరణ ఇచ్చింది.

5జీ టెక్నాలజీ రానున్న నేపథ్యంతో
ఇండియాలో తమ వ్యాపారం విస్తరిస్తున్న క్రమంలో ఉద్యోగాల కల్పనలో తమ పాత్ర ఉంటుందన్నారు. దీర్ఘకాలిక వ్యాపార విజయాన్ని దృష్టిలో ఉంచుకుని మరిన్ని ఉద్యోగాలను కల్పించనున్నామని ప్రతినిధి తెలిపారు. భారత మార్కెట్ తన 5జీ టెక్నాలజీ రానున్న నేపథ్యంతో తాము నైపుణ్యమున్న ఉద్యోగులకు ఏడాది పొడవునా ప్రాధాన్యత ఇవ్వనున్నామన్నారు.

గెలాక్సీ నోట్ 10
శాంసంగ్ తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు మరో కొత్త స్మార్ట్ఫోన్ను అందుబాటులోకి తీసుకురానుంది. ఆగస్టు 7వ తేదీన న్యూయార్క్లో జరగనున్న కార్యక్రమంలో శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 స్మార్ట్ఫోన్ను విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. రెండు వేరియంట్లలో గెలాక్సీ నోట్ 10 ఫోన్ రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. గెలాక్సీ నోట్ 10 ఫోన్కు సంబంధించిన వీడియో టీజర్ను విడుదల చేశారు. కొత్త ఎస్ పెన్ మోడల్తోపాటు సింగిల్ కెమెరా లెన్స్ ఉంటాయి. గెలాక్సీ నోట్ 10 ప్రో, గెలాక్సీ నోట్ 10 ప్లస్తోపాటు గెలాక్సీ నోట్ 10 5జీ మోడల్ను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

తగ్గిన శాంసంగ్ గెలాక్సీ M10 ధర
ఇదిలా ఉంటే శాంసంగ్ గెలాక్సీ M10 మోడల్ ధర తగ్గించింది. గెలాక్సీ M సిరీస్ కింద తొలి రెండు స్మార్ట్ ఫోన్లను శాంసంగ్ రిలీజ్ చేసింది. గెలాక్సీ ఎం10 స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్ల ధరను రూ. వెయ్యి వరకు తగ్గించినట్టు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. తగ్గించిన ధరతో శాంసంగ్ గెలాక్సీ M10 వేరియంట్ (2GB+6GB) ధర రూ.6వేల 990కి చేరగా, రెండో వేరియంట్ (3GB+32GB) ధర రూ.7వేల990కి చేరింది. శాంసంగ్ మార్కెట్లో రిలీజ్ చేసిన ఎం10 రెండు వేరియంట్లలో ధర వరుసగా రూ.7వేల 990, రూ.8వేల 990గా ఉంది. తాజాగా తగ్గించిన కొత్త ధరతో శాంసంగ్ గెలాక్సీ M10 మోడల్ స్మార్ట్ ఫోన్.. శాంసంగ్ ఆన్ లైన్ స్టోర్, అమెజాన్ ఇండియా వెబ్ సైట్లలో అందుబాటులో ఉంటుందని అధికారిక ట్విట్టర్లో ప్రకటించింది. తగ్గింపు ధర లిమిటెడ్ ఆఫర్ గా తెలిపింది. ఆసక్తిగల స్మార్ట్ ఫోన్ యూజర్లు వెంటనే కొనుగోలు చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ఎంత కాలం ఉంటుంది అనేదానిపై కంపెనీ క్లారిటీ ఇవ్వలేదు.


Click it and Unblock the Notifications








