BSNL సంచలనం, 40 లక్షల మంది కొత్త కస్టమర్లు చేరిక !
దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న ప్రభుత్వ రంగ దిగ్గజం BSNL రిలయన్స్ జియోతో పాటు ఇతర టెలికాం ఆపరేటర్లకు గట్టిపోటీనిస్తూ పోతోంది.
దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న ప్రభుత్వ రంగ దిగ్గజం BSNL రిలయన్స్ జియోతో పాటు ఇతర టెలికాం ఆపరేటర్లకు గట్టిపోటీనిస్తూ పోతోంది. గత వైభవాన్ని సొంతం చేసుకునేందుకు ప్రైవేట్ కంపెనీల నుంచి వచ్చే పోటీని తట్టుకుంటూ వడివడిగా అడుగులు ముందుకు వేస్తూ దూసుకుపోతోంది. ఇందులో భాగంగా కస్టమర్లను భారీ స్థాయిలో ఆకట్టుకుంటోంది. ఇతర నెట్ వర్క్ పరిధి నుంచి భారీ సంఖ్యలో కస్టమర్లు బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ కు మారిపోతున్నారు. మార్చి నెలలో ఇలా 40 లక్షల మంది కొత్తగా చేరారు. ఇందులో 12 లక్షల మంది ఇతర నెట్ వర్క్ ల నుంచి పోర్ట్ ద్వారా అదే నంబర్ పై వచ్చిన వారు కావడం గమనించాల్సిన అంశం.

ఆకర్షణీయమైన పథకాలు, ప్లాన్ లు, ఆఫర్లు, విలువ ఆధారిత సేవలు, నెట్ వర్క్ ను బలోపేతం చేసుకోవడం వల్లే ఎక్కువ మంది కస్టమర్లు తిరిగి బీఎస్ఎన్ఎల్ ను ఎంచుకుంటున్నట్టు కంపెనీ తెలిపింది. మెరుగైన నెట్ వర్క్ కవరేజీ, కస్టమర్ల సంతృప్తి కోసం కంపెనీ వద్ద పెద్ద ప్రణాళికలే ఉన్నాయని బీఎస్ఎన్ఎల్ డైరెక్టర్ ఆర్కే మిట్టల్ తెలిపారు.
కాగా జియో రాకతో టెలికాం రంగంలో పలు విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. జియో రాకముందు చుక్కలనంటిన డేటా ధరలు ఒక్కసారిగా నేలవైపు చూశాయి. జియో ఉచిత ఆఫర్లతో మిగతా టెల్కోలు అలాగే ప్రభుత్వ రంగ దిగ్గజం బిఎస్ఎన్ఎల్ భారీ నష్టాలను చవిచూశాయి. తరువాత జియో కూడా ఉచిత ఆఫర్ల నుంచి టారిఫ్ కు మారడంతో టెల్కోలు కొంచెం ఊపిరిపీల్చుకున్నాయి. ఇప్పుడు జియోతో పోటీకి సై అంటున్నాయి.


Click it and Unblock the Notifications