BSNL సీఎండీ కీలక ప్రకటన.. దేశంలో 5G నెట్వర్క్ ఫస్ట్ ఎక్కడ ప్రారంభిస్తారో తెలుసా..?
దేశంలో మొత్తం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 776 జిల్లాలకు గానూ 773 జిల్లాల్లో 5G నెట్వర్క్ అందుబాటులో ఉందని ఇటీవల పార్లమెంట్లో ఓ ఎంపీ ప్రశ్నకు సంబంధిత మంత్రి సమాధానం ఇచ్చారు. జియో, ఎయిర్టెల్ మాత్రమే 5G నెట్వర్క్ ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఇప్పటికీ మారుమూల గ్రామాలకు 5G నెట్వర్క్ను విస్తరిస్తున్నాయి. మరో ప్రముఖ టెలికాం సంస్థ వోడాఫోన్ ఐడియా ఇటీవలే ముంబైలో 5Gను లాంచ్ చేసింది. వచ్చే నెలలో మరిన్ని ప్రాంతాల్లో 5G సర్వీసులను ప్రారంభిస్తామని తెలిపింది.
80 వేల టవర్లు :
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL ఇందులో పూర్తిగా వెనుకబడి ఉంది. ఇప్పటికీ పూర్తిస్థాయిలో 4G నెట్వర్క్ కూడా అందుబాటులోకి రాలేదు. దేశవ్యాప్తంగా 4G నెట్వర్క్ కోసం లక్ష టవర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఇప్పటికే 80 వేలకు పైగా ఇన్స్టాల్ చేసినట్లు కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి త్యోదిరాధిత్య సింధియా ఇటీవల వెల్లడించారు.

ఇందులో సుమారు 75 వేలకు పైగా యాక్టివ్గా ఉన్నాయన్నారు. ఈ సంవత్సరం మే- జూన్ నాటికి లక్ష టవర్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. జూన్ నుంచి 5G నెట్వర్క్ను కూడా ప్రారంభిస్తామని తీసుకొస్తామని కేంద్ర మంత్రి జోతిర్యాధిత్య సింధియా ఇప్పటికే వెల్లడించారు.
తాజాగా కీలక ప్రకటన :
తాజాగా BSNL CMD రాబర్ట్ రవి 5G నెట్వర్క్ లాంచ్ పై కీలక ప్రకటన చేశారు. తొలి దశలో దేశ రాజధాని ఢిల్లీలో బీఎస్ఎన్ఎల్ 5G నెట్వర్క్ను ప్రారంభిస్తామని తెలిపారు. ఇందుకు సంబంధించిన పరీక్షలు జరుగుతున్నాయని చెప్పారు. రాబోయే నెలల్లో మరిన్ని నగరాల్లో 5G ని ప్రారంభిస్తామన్నారు.
తొలుత రాజధానిలో :
నెట్వర్క్ యాజ్ ఏ సర్వీస్ (NaaS) మోడల్లో ఢిల్లీలో బీఎస్ఎన్ఎల్ 5G ప్రారంభిస్తామన్నారు. ఢిల్లీ అనంతరం వీలైనంత వేగంగా ఇతర నగరాల్లో 5G సర్వీసులను ప్రారంభించే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు చెప్పారు. ఏయే నగరాల్లో లాంచ్ చేసే అవకాశం ఉందో వెల్లడించలేదు.
BSNL 4G కోసం టీసీఎస్ నేతృత్వంలోని కాన్సార్షియంలో C-DoT (సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్) మరియు తేజస్ నెట్వర్క్ ఉన్నాయి. టెక్నాలజీ పరంగా TCS కృషిచేస్తోంది. ఇందులో భాగంగా లక్ష టవర్లను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే 80 వేలకు పైగా ఇన్స్టాల్ చేశారు.
BSNL 4G నుంచి 5G నెట్వర్క్ కోసం సులభంగా అప్గ్రేడ్ అయ్యేలా చర్యలు తీసుకుంటారు. అయితే 5G నెట్వర్క్ ప్రారంభించినా.. పూర్తిస్థాయిలో 4G అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతాయని తెలుస్తోంది. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో 4G నెట్వర్క్ ప్రారంభం అయినా స్పీడ్ పై ఫిర్యాదులు వస్తున్నట్లు సమాచారం.
గత సంవత్సరం జులై నెలలో ప్రైవేటు టెలికాం సంస్థలు మొబైల్ రీఛార్జ్ ధరలను భారీగా పెంచాయి. దీంతో అనేక మంది BSNL నెట్వర్క్కు పోర్టింగ్ అయ్యారు. అయితే నెట్వర్క్ సమస్యలు, కాల్ డ్రాప్లు సహా ఇతర కారణాలతో నవంబర్, డిసెంబర్ నెలల్లో సుమారు 6 లక్షల కంటే ఎక్కువ సంఖ్యలో యూజర్లు ఇతర నెట్వర్క్లకు వెళ్లిపోయారు. దీనిపైనా బీఎస్ఎన్ఎల్ చర్యలు తీసుకుంటోంది.
ఇటీవల నోకియా విడుదల చేసిన మొబైల్ బ్రాడ్బ్యాండ్ ఇండెక్స్ నివేదిక అధారంగా గత ఐదు సంవత్సరాల్లో డేటా వినియోగం 19.5 శాతం పెరిగింది. ప్రతి నెల ఒక్కో యూజర్ సగటున 27.5GB డేటాను వినియోగిస్తున్నట్లు నివేదిక చెబుతోంది. 5G నెట్వర్క్ విస్తరణ ఇలానే కొనసాగితే 2030 నాటికి యూజర్ నెలవారీ డేటా వినియోగం 50GB కి చేరుతుందని అంచనా వేస్తున్నారు. 5G నెట్వర్క్ విస్తరణే కారణమని నివేదిక వెల్లడిస్తుంది.


Click it and Unblock the Notifications








