BSNL కు కలిసొచ్చిన 2024 సంవత్సరం.. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏం జరిగిందో తెలుసా?
BSNL కు 2024 సంవత్సరం బాగా కలిసి వచ్చింది. ముఖ్యంగా రెండో భాగంలో బీఎస్ఎన్ఎల్ భారీగా (BSNL 2024 News) యూజర్లను సంపాదించుకుంది. గతంలో ప్రైవేటు టెలికాం సంస్థలకు పోటీ ఇవ్వలేకపోయిన ప్రభుత్వరంగ టెలికాం సంస్థ ఈ సంవత్సరం జులై నుంచి ప్రతినెల లక్షలాది మంది కొత్త యూజర్లను నెట్వర్క్లో చేర్చుకుంది. దీంతోపాటు 4G నెట్వర్క్ను శరవేగంగా విస్తరిస్తోంది. ఈ సంవత్సరంలో BSNL ప్రస్తానంపై పూర్తి కథనం.
BSNL నెట్వర్క్లోకి లక్షలాది మంది యూజర్లు.. :
ఈ సంవత్సరం తొలి ఆరు నెలలతో పోలిస్తే జులై తర్వాత BSNL పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. జులై తొలివారంలో ప్రైవేటు టెలికాం సంస్థలు అయిన జియో. ఎయిర్టెల్, వోడాఫోన్- ఐడియా భారీగా మొబైల్ టారిఫ్ ధరలపై పెంచాయి. దీంతో జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో లక్షలాది మంది యూజర్లు BSNL నెట్వర్క్లో చేరారు.

అదే సమయంలో ఆయా ప్రైవేటు టెలికాం సంస్థలు భారీగా యూజర్లను కోల్పోయాయి. జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా సంస్థలతో పోలిస్తే BSNL తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లను కలిగి ఉండడం ప్రధాన కారణం. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రైవేటు టెలికాం సంస్థలను వెనక్కి నెట్టి గత మూడు నాలుగు నెలల్లో కొత్త యూజర్లను BSNL సంపాదించుకుంది.
దీంతోపాటు 4G నెట్వర్క్ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అనుగుణంగా టవర్ల నిర్మాణం చేపట్టడం కూడా BSNL పై విశ్వాసాన్ని పెంచింది. అయితే ఇప్పటికే ప్రైవేటు టెలికాం సంస్థలు దేశవ్యాప్తంగా 4G నెట్వర్క్ను అందుబాటులోకి తీసుకువచ్చాయి. దీంతోపాటు జియో, ఎయిర్టెల్ 5G నెట్వర్క్ను కూడా అత్యధిక ప్రాంతాల్లో అందుబాటులో ఉంది.

దేశీయంగానే 4G టెక్నాలజీ :
అయితే BSNL మాత్రమే అత్యధిక ప్రాంతాల్లో ఇప్పటికీ 3G నెట్వర్క్ను మాత్రమే కలిగి ఉంది. ఇందుకు ప్రత్యేక కారణం ఉంది. 4G, 5G టెక్నాలజీని స్వదేశీయంగా మాత్రమే సమకూర్చుకోవాలనే ప్రభుత్వ నిర్ణయమే ఇందుకు కారణం. ఫలితంగా BSNL 4G నెట్వర్క్ విడుదల ఆలస్యం అయింది. అయితే TCS సాయంతో ఈ టెక్నాలజీని సమకూర్చుకుంది. ఇందులో భాగంగా 4G నెట్వర్క్ కోసం దేశవ్యాప్తంగా లక్ష టవర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.
50,708 సైట్లలో 4G టవర్లు :
ఇందులో భాగంగా శరవేగంగా టవర్లను ఏర్పాటు చేస్తోంది. అక్టోబర్ చివరి నాటికి దేశవ్యాప్తంగా 50,708 4G టవర్లను ఏర్పాటు చేసింది. అందులో 41,957 సైట్లలో కార్యకలాపాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. 2025 మధ్య నాటికి లక్ష BSNL 4G టవర్లను ఏర్పాటు చేయనున్నారు. మారుమూల, పర్వత ప్రాంతాల్లోనూ టవర్లను ఏర్పాటు చేస్తున్నారు.

BSNL 5G :
దీంతోపాటు జూన్ 2025 నాటికి 5G నెట్వర్క్ను కూడా ప్రారంభిస్తామని సంబంధిత శాఖ మంత్రి గతంలో ప్రకటన చేశారు. అయితే పలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేటు టెలికాం సంస్థలు తమ టవర్లను ఏర్పాటు చేయలేదు. ఇలాంటి ప్రాంతాల్లో BSNL 4G నెట్వర్క్ను అందించనుంది. దీంతో భవిష్యత్లో గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది.
కొత్త లోగో :
దీంతోపాటు ఇటీవలే BSNL కొత్త లోగోను విడుదల చేసింది. దీంతోపాటు 7 సేవలపై ప్రకటన చేసింది. దీంతోపాటు D2D సేవలను ప్రారంభించినట్లు తెలిపింది. నేషనల్ వైఫై రోమింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా FTTH యూజర్ల దేశవ్యాప్తంగా BSNL వైఫైను వినియోగించుకోవచ్చు.


Click it and Unblock the Notifications