అక్టోబర్లో 5 లక్షల కొత్త యూజర్లను సంపాదించుకున్న BSNL. మిగిలిన నెట్వర్క్ల పరిస్థితి ఎలా ఉందంటే?
జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా సంస్థలు ఈ సంవత్సరం జులైలో మొబైల్ రీఛార్జ్ ధరలను భారీగా పెంచాయి. దీంతోపాటు లక్షలాది మంది యూజర్లు గత నాలుగు నెలలుగా ఇతర నెట్వర్క్లకు పోర్టింగ్ అవుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ BSNL మాత్రం గతానికి భిన్నంగా గత నాలుగు నెలలుగా లక్షల మంది యూజర్లను సంపాదించుకుంటోంది. తాజాగా అక్టోబర్ నెల నివేదికను TRAI (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) విడుదల చేసింది.
దీని ఆధారంగా (TRAI October 2024 Report) ప్రముఖ సంస్థలు భారీగా యూజర్లను కోల్పోయాయి. అయితే ఎయిర్టెల్ మాత్రం గత మూడు నెలలకు భిన్నంగా యూజర్లను సంపాదించుకుంది. జులై నుంచి వరుసగా ప్రతి నెల యూజర్లను సంఖ్యను పెంచుకుంటున్న BSNL అక్టోబర్ నెలలోనూ యూజర్లను సంపాదించుకుంది.

TRAI నివేదిక ఆధారంగా అక్టోబర్ 2024 నెలలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL వరుసగా నాలుగో నెలలో కూడా యూజర్లను సంపాందించుకుంది. అక్టోబర్ నెలలో 5 లక్షల మంది కొత్త యూజర్లు BSNL లో చేరారు. జులై నెలలో 29 లక్షలు, ఆగస్టులో 25 లక్షలు, సెప్టెంబర్ నెలలో 5 లక్షల మంది యూజర్లను సంపాదించుకుంది.
వోడాఫోన్ ఐడియా (VI) సంస్థ వరుసగా జులై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో యూజర్లను కోల్పోయింది. అక్టోబర్ నెలలో 19.77 లక్షల మంది యూజర్లను VI కోల్పోయింది. అదే సెప్టెంబర్ నెలలో 15.5 లక్షలు, ఆగస్టులో 19 లక్షలు, జులైలో 14 లక్షల మంది యూజర్లను కోల్పోయింది.

మరో ప్రముఖ సంస్థ జియో (Jio) జులై నుంచి భారీ సంఖ్యలో యూజర్లను కోల్పోతోంది. తాజాగా అక్టోబర్లో 37.60 లక్షల మంది యూజర్లను కోల్పోయిందని ట్రాయ్ తెలిపింది. సెప్టెంబర్లో 79.70 లక్షలు, ఆగస్టులో సుమారు 40 లక్షలు, జులైలో 8 లక్షల మంది యూజర్లను కోల్పోయినట్లు ట్రాయ్ నివేదిక వెల్లడించింది.
ఎయిర్టెల్ (Airtel) మాత్రం జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో యూజర్లను కోల్పోయింది. అయితే అక్టోబర్ నెలలో మాత్రం 19.28 లక్షల మంది యూజర్లు ఎయిర్టెల్లో చేరారు. అదే సెప్టెంబర్ నెలలో 14.35 లక్షలు, ఆగస్టులో 24 లక్షలు, జులై నెలలో సుమారు 17 లక్షల మంది యూజర్లను ఎయిర్టెల్ కోల్పోయింది.
ట్రాయ్ తాజా వివరాల ఆధారంగా జియో ప్రస్తుతం 39.9 శాతం యూజర్లతో అగ్రస్థానంలో ఉంది. అదే ఎయిర్టెల్ 33.5 శాతం వాటాను కలిగి ఉంది. మూడో స్థానంలో ఉన్న వోడాఫోన్ ఐడియా ప్రస్తుతం 18.30 శాతం మార్కెట్ షేర్ను కలిగి ఉంది. ప్రభుత్వరంగ సంస్థ BSNL, MTNL మొత్తంగా 8.22 శాతం గా ఉంది.
ప్రైవేటు సంస్థ మొబైల్ రీఛార్జ్ ధరల పెంపు నిర్ణయం BSNL కు బాగా కలిగి వచ్చింది. ఇతర సంస్థలతో పోలిస్తే తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లు కలిగి ఉండడంతోపాటు త్వరలో 4G సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండడం మరో కారణం. వచ్చే సంవత్సరం జూన్ నాటికి దేశవ్యాప్తంగా 4G పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు BSNL ప్రయత్నం చేస్తోంది.


Click it and Unblock the Notifications








