BSNL D2D టెక్నాలజీ.. సిమ్ కార్డు లేకుండానే కాల్స్, మెసేజ్లు చేసుకోవచ్చు.. ఎలా పనిచేస్తుంది..?
ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL ప్రస్తుతం ఫుల్ ట్రెండ్లో ఉంది. ప్రైవేటు టెలికాం సంస్థలకు పోటీగా యూజర్లను పెంచుకుంటోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో 4G నెట్వర్క్ టెక్నాలజీని సమకూర్చుకుంటున్న BSNL.. దేశవ్యాప్తంగా 4G నెట్వర్క్ టవర్ల ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే 50000 వేల మార్క్ను దాటినట్లు తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. వీటితోపాటు 2025 జూన్ నాటికి 5G నెట్వర్క్ను ప్రారంభించాలని భావిస్తున్నట్లు ఆ శాఖ మంత్రి ఇప్పటికే వెల్లడించారు.
దీంతోపాటు ఇటీవలే BSNL కొత్త లోగో సహా 7 కొత్త సర్వీసులను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఇందులో స్పామ్ బ్లాకర్లు సహా సిమ్ కియోస్కోలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. దీంతోపాటు D2D కనెక్టివిటీని (BSNL D2D Technology) అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. D2D అంటే డైరెక్ట్ టూ డివైజ్ టెక్నాలజీ.

అమెరికా సంస్థ వయాశాట్తో (Viasat) BSNL ఈ D2D టెక్నాలజీ అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఈ టెక్నాలజీ పరీక్షల దశలో ఉంది. ఇది ఉపగ్రహ ఆధారంగా సేవలు అందించనుంది. దీని ద్వారా సిమ్ కార్డు లేకుండా కాల్స్, మెసేజ్లు చేయవచ్చు. మరియు మారుమాల గ్రామీణ ప్రాంతాలకు కూడా ఈ టెక్నాలజీ ద్వారా మెరుగైన సేవలు అందించవచ్చు. విపత్తుల సమయంలో ప్రస్తుతం ఉన్న నెట్వర్క్ విఫలమైన సందర్భాల్లో ఈ తరహా టెక్నాలజీ ఎంతో ఉపయోగపడుతుంది.
ప్రస్తుతం D2D టెక్నాలజీని NTS కనెక్టివిటీతో టెస్టింగ్ చేస్తోంది. అయితే ఇందులో ఉపగ్రహాలతో ప్రస్తుత మొబైల్ నెట్వర్క్ను అనుసంధానం చేస్తారు. అప్పుడు ఉపగ్రహాలు మొబైల్ టవర్ల మాదిరిగా ఉపయోగపడతాయని తెలుస్తోంది. ఫలితంగా నెట్వర్క్ పూర్తిగా లేని ప్రాంతాల నుంచి కాలింగ్, మెసేజ్లు చేయవచ్చు.
ఈ సర్వీసులతోపాటు BSNL యూజర్లు FTTH వైఫై తో కనెక్ట్ కావచ్చు. మరియు ఫైబర్ ఆధారిత ఇంటర్నెట్ లైవ్ టీవీ సేవలను తీసుకొచ్చింది. దీని ద్వారా 500 వరకు ప్రీమియం ఛానళ్లను అందించనుంది. వీటితోపాటు ప్రైవేటు గనుల్లో 5G సేవలను అందించనుంది. పబ్లిక్ సేఫ్టీ ఫీచర్లు, రియల్టైం డిజాస్టర్ రెస్పాన్స్, కమ్యూనికేషన్స్తో సురక్షితమైన నెట్వర్క్ను అందించనుంది.
గతం కంటే భిన్నంగా ఈ సంవత్సరం జులై నుంచి BSNL యూజర్ల సంఖ్యలో దూసుకెళ్తోంది. ప్రైవేటు టెలికాం సంస్థలు జియో. ఎయిర్టెల్, వోడాఫోన్- ఐడియా సంస్థలు జులై నెలలో భారీగా మొబైల్ రీఛార్జ్ ధరలు పెంచాయి. దీంతో యూజర్లు పెద్ద ఎత్తున బీఎస్ఎన్ఎల్కు పోర్టింగ్ అవుతున్నారు. తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉండడం సహా 4G, 5G నెట్వర్క్ త్వరలో అందుబాటులోకి వస్తుందనే ప్రకటనలో అధిక సంఖ్యలో మొగ్గుచూపుతున్నారు.
ఇందుకు సంబంధించిన వివరాలు TRAI (టెలికాం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) వెల్లడించింది. ఆగస్టు నెలలో BSNL నెట్వర్క్లోకి 25 లక్షల మంది జాయిన్ అయినట్లు తెలిపింది. జియో సుమారు 40 లక్షలు, ఎయిర్టెల్ సుమారుగా 24 లక్షలు, వోడాఫోన్ ఐడియా సుమారుగా 19 లక్షల యూజర్లను కోల్పోయాయి. జులై నెలలో BSNL సుమారుగా 29 లక్షలకు పైగా యూజర్లను సంపాదించింది.


Click it and Unblock the Notifications








