ఇటీవలే లాభాల్లోకి వచ్చిన BSNL కు మళ్లీ ఏమైంది.. ఏకంగా 3 లక్షల మంది యూజర్లు గుడ్బై..!
BSNL కు గత సంవత్సరం బాగా కలిసి వచ్చింది. ప్రైవేటు టెలికాం సంస్థలు జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా సంస్థ మొబైల్ రీఛార్జ్ ధరలను భారీగా పెంచాయి. దీంతో అనేక మంది యూజర్లు తక్కువ ధరలకే సేవలు అందిస్తున్న ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) వైపు మొగ్గుచూపారు. ఫలితంగా గత 17 సంవత్సరాల్లో లాభాలే చూడని సంస్థ.. 2024-25 మూడో త్రైమాసికంలో రూ.262 లాభాలు నమోదు చేసింది.
లక్ష 4G టవర్ల ఏర్పాటు టార్గెట్ :
అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనేందుకు 4G నెట్వర్క్ విస్తరణను వేగవంతం చేసింది. దేశవ్యాప్తంగా 2025 మే నాటికి లక్షల 4G టవర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించి, పని ప్రారంభించింది. దీంతోపాటు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రీఛార్జ్ ప్లాన్లను తీసుకొస్తోంది. మరియు 5G నెట్వర్క్ ను టెస్టింగ్ కూడా చేసింది.

భారీ సంఖ్యలో :
దేశవ్యాప్తంగా ప్రస్తుతం 75000 టవర్ల పరిధిలో 4G సర్వీసులు అందుబాటులోకి వచ్చాయిని ఇటీవల తెలిపింది. గత సంవత్సరం జులై నుంచి కొన్ని నెలలపాటు బీఎస్ఎన్ఎన్ నెట్వర్క్ లోకి యూజర్లు వచ్చి చేరారు. అయితే నవంబర్, డిసెంబర్ నెలల్లో భారీ సంఖ్యలో BSNL నుంచి బయటకు వెళ్లిపోయారు.
3 లక్షలకు పైగా యూజర్లు :
ట్రాయ్ తాజా వివరాల ఆధారంగా డిసెంబర్ నెలలో బీఎస్ఎన్ఎల్ ఏకంగా 3,22,000 మంది యూజర్లను కోల్పోయింది. నవంబర్లోనూ 3,42,000 మంది యూజర్లు బీఎస్ఎన్ఎల్ నుంచి ఇతర నెట్వర్క్లకు వెళ్లిపోయారు. కాల్ డ్రాప్ల సమస్య ఎక్కువగా ఉండడం, ఇతర నెట్వర్క్ సమస్యల కారణంగా యూజర్లు అసంతృప్తికి గురవుతున్నట్లు సమాచారం.
బీఎస్ఎన్ఎల్లో డిసెంబర్ 2024 చివరి నాటికి 91.7 మిలియన్ సబ్స్క్రైబర్లు మాత్రమే ఉన్నారు. ఈ సమస్యలను గుర్తించిన బీఎస్ఎన్ఎల్ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటోంది. టవర్ల వద్ద బ్యాటరీల ఏర్పాటు సహా ఇతర మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తోంది.
బీఎస్ఎన్ఎల్ తాజాగా రూ.750 రీఛార్జ్ ప్లాన్ను (BSNL Rs750 Recharge Plan) లాంచ్ చేసింది. ఈ ప్లాన్లో భాగంగా సుమారు 6 నెలల వ్యాలిడిటీని పొందవచ్చు. ప్లాన్ వ్యాలిడిటీ ముగిసినా.. వారం కంటే ఎక్కువ రోజులపాటు ఎటువంటి రీఛార్జ్ చేయని వారికి మాత్రమే ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. తమ యూజర్లు ఇతర నెట్వర్క్లకు వెళ్లకుండా నిలువరించేందుకు ఈ ప్లాన్ను తీసుకొచ్చినట్లు తెలిస్తోంది.
బీఎస్ఎన్ఎల్ ఇటీవల అనేక రీఛార్జ్ ప్లాన్లను లాంచ్ చేసింది. రూ.439 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లో (BSNL Rs439 Recharge Plan) భాగంగా అన్లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. మరియు మొత్తంగా 300 SMS లను అందిస్తోంది. అయితే ప్లాన్లో ఎటువంటి డేటా ను అందించడం లేదు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులుగా ఉంది.
రూ.347 రీఛార్జ్ ప్లాన్లో (BSNL Rs347 Recharge Plan) భాగంగా ప్రతిరోజు 2GB డేటాను వినియోగించుకోవచ్చు. మరియు అన్లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 54 రోజులుగా ఉంది. అంటే మొత్తంగా 104GB డేటాను యూజర్లు వినియోగించుకోవచ్చు.
దీంతోపాటు కేవలం డేటా అవసరం ఉన్న వారికి కోసం ఇటీవల రూ.రూ.411 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ను (BSNL Rs411 Recharge Plan) తీసుకొచ్చింది. ఈ ప్లాన్లో భాగంగా రోజువారీ 2GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులుగా ఉంది. మొత్తంగా 180GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్లో ఎటువంటి కాలింగ్, SMSలను వినియోగించుకోలేరు.


Click it and Unblock the Notifications








