BSNL కు మంచి రోజులు.. కేంద్ర బడ్జెట్లో ఏకంగా రూ.82,916 కోట్లు కేటాయింపు..!!
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL త్వరలో పూర్వవైభవం వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల తొలివారంలో ప్రైవేటు టెలికాం సంస్థలు జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా రీఛార్జీ ధరలను భారీగా పెంచాయి. దీంతో అనేక మంది మొబైల్ ఫోన్ ల వినియోగదారులు BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) కు పోర్టింగ్ అవుతున్నారు. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో బీఎస్ఎన్ఎల్ కు ఏకంగా రూ.82,916 కోట్లు కేటాయించింది. దీంతో పూర్తిస్థాయిలో మెరుగైన సేవలు అందించేందుకు వీలుంటుందని తెలుస్తోంది.
టెక్నాలజీ అప్గ్రేడ్ మరియు పునర్నిర్మాణం కోసం :
2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో టెలికాం శాఖకు సంబంధించిన ప్రాజెక్టులు సహా ఇతర సంస్థల కోసం రూ.1.28 లక్షల కోట్లు కేటాయించారు. ఇందులో బీఎఎస్ఎన్ఎల్ టెక్నాలజీ అప్గ్రేడ్ మరియు పునర్నిర్మాణం కోసం రూ.82.916 కోట్లు కేటాయించారు.

దీంతోపాటు దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు నిర్దిష్ట టెలికాం పరికరాల పై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 10 శాతం నుంచి 15 శాతానికి పెంచాలని ప్రతిపాదిస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీంతోపాటు మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు, PCBA లపై సుంకాన్ని 20 శాతం నుంచి 15 శాతానికి తగ్గించారు. ఫలితంగా దిగుమతి అవుతున్న స్మార్ట్ఫోన్ల ధరలు తగ్గనున్నాయి.
1.12 లక్షల టవర్లు :
బీఎస్ఎన్ఎల్ ఆగస్టు నుంచి 4G సర్వీసులను ప్రారంభించనుంది. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్, తేజస్ నెట్వర్క్స్, TCS సంస్థలు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించాయి. దీంతోపాటు దేశవ్యా్ప్తంగా 1.12 లక్షల టవర్లను ఏర్పాటు చేయనుంది. గత వారంలోనే దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 1000 టవర్లను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 12000 టవర్లను ఏర్పాటు చేసినట్లు BSNL తెలిపింది.
కేంద్ర మంత్రి కీలక ప్రకటన :
దీంతోపాటు కేంద్రం ప్రకటించిన రిలీఫ్ ప్యాకేజీ ద్వారా BSNL కోసం స్పెక్ట్రమ్ రిజర్వ్ చేయబడింది. గ్రామీణ ప్రాంతాలు సహా ఇప్పటికీ ఇంటర్నెట్ సౌకర్యం లేని ప్రాంతాలకు కూడా 4G సర్వీసులు అందించాలని BSNL భావిస్తోంది. BSNL 4G సర్వీసులపై కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జోతిరాదిత్య సింధియా కీలక వ్యాఖ్యలు చేశారు.
4G సర్వీసులను రోజువారీ పర్యవేక్షణకు ప్రత్యేక యూనిట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు సింధియా వెల్లడించారు. 4G నెట్వర్క్ ప్రారంభం అనంతరం రోజువారీ లక్ష్యాలను నిత్యం పర్యవేక్షిస్తామని స్పష్టం చేశారు. తాను, టెలికాం శాఖ కార్యదర్శి నిర్దేశిత లక్ష్యాలపై పర్యవేక్షిస్తామని చెప్పారు.
గిజ్ బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








