బాకీల వసూళ్లకు దిగిన BSNL,రూ.3,000 కోట్ల పైమాటే
నిధుల సంక్షోభంలో ఉన్న ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ ప్రస్తుతం కార్పొరేట్ క్లయింట్ల నుంచి బాకీల వసూళ్ల పనిలో పడింది. దాదాపు రూ. 3,000 కోట్ల మేర పేరుకుపోయిన బకాయిల్లో సింహభాగం మొత్తాన్ని వచ్చే రెండు, మూడు నెలల్లో వసూలు చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలని భావిస్తోంది.

రాబోయే రెండు, మూడు నెలల్లో రూ.3 వేల కోట్లకుపైగా వసూలు చేస్తామన్న ధీమాను సంస్థ చైర్మన్, ఎండీ పీకే పుర్వార్ వ్యక్తం చేస్తున్నారు.ఉద్యోగుల జీతాలనూ సకాలంలో చెల్లించలేని దుస్థితిలో బీఎస్ఎన్ఎల్ నడుస్తున్న నేపథ్యంలో బకాయిలు వసూలైతే పరిస్థితి కాస్త మెరుగుపడగలదన్న విశ్వాసాన్ని పుర్వార్ కనబరుస్తున్నారు.

రావాల్సిన బకాయిలు రూ.3 వేల కోట్లపైనే
మా కస్టమర్ల నుంచి మాకు రావాల్సిన బకాయిలు రూ.3 వేల కోట్లపైనే ఉన్నాయి. వీటి వసూలుకు చర్యలు చేపడుతామని పుర్వార్ పీటీఐకి తెలిపారు. అయితే ఎప్పట్లోగా ఈ బకాయిలను వసూలు చేస్తారు? అన్న దానిపై సమాధానం కష్టమేనన్న ఆయన 2-3 నెలల్లో వసూలవుతాయన్న ఆశాభావాన్ని వెలిబుచ్చారు.

ఆస్తులు లీజుకివ్వడం ద్వారా..
దీంతో పాటుగా భవంతులు ఇతర ఆస్తులు లీజుకివ్వడం ద్వారా ఈ ఏడాది కనీసం రూ. 1,000 కోట్లు అద్దెల రూపంలో ఆదాయాలను పెంచుకోవాలనేది బీఎస్ఎన్ఎల్ యోచన. గతంలో ఈ మొత్తం రూ. 200 కోట్లు. వీటితో పాటు అవుట్సోర్సింగ్ కార్యకలాపాల క్రమబద్దీకరణ ద్వారా ఏటా రూ. 200 కోట్లు ఆదా చేసుకోవాలని, విద్యుత్ బిల్లుల భారాన్ని 15 శాతం మేర తగ్గించుకోవాలని సంస్థ ప్రయత్నిస్తోంది.

వృథాగా పడి ఉన్న ఆస్తులను
వేడుకలు, సమావేశాలు వంటి వాటికి వీటిని రెంటుకు ఇస్తున్నారు. అలాగే వృథాగా పడి ఉన్న ఆస్తులను కూడా అమ్మేయాలని కూడా చూస్తున్నారు. నిర్వహణ వ్యయం, వేతనాల మధ్య వ్యత్యాసం నెలనెలా సుమారు రూ.800 కోట్లుగా ఉంటున్నదని అధికారులు చెబుతున్నారు. ఇకపోతే బీఎస్ఎన్ఎల్తోపాటు ఎంటీఎన్ఎల్ కూడా ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగులకు స్వచ్చంధ పదవీ విరమణను ఆఫర్ చేస్తున్నాయి. ఈ రెండు ప్రభుత్వరంగ టెలికం సంస్థలు ఆదాయం పెంచుకునేందుకు 4జీ స్పెక్ట్రం కేటాయింపులనూ కోరుతున్నాయి.

బీఎస్ఎన్ఎల్-ఎంటీఎన్ఎల్ విలీనం?
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్), మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్ఎల్)లను విలీనం చేయాలని టెలికం శాఖ ప్రయత్నిస్తున్నది. ఈ రెండింటి పునరుద్ధరణలో భాగంగానే ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం (2018-19)లో బీఎస్ఎన్ఎల్ నష్టం దాదాపు రూ.14 వేల కోట్లుగా ఉందని అంచనా. ఆదాయం రూ.19,308 కోట్లుగా ఉన్నది.


Click it and Unblock the Notifications








