సెప్టెంబర్ 7 కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది, ఎందుకో తెలుసా ?
యావత్తు ప్రపంచమంతా ఎంతో ఆతృతగా ఎదురుచూసిన చంద్రయాన్-2 నింగిలోకి దూసుకెళ్లింది. జూలై 22న మధ్యాహ్నం 2.43 గంటలకు శ్రీహరికోటలోని షార్ నుంచి జీఎస్ఎల్వీ మార్క్3ఎం1 రాకెట్ ద్వారా రివ్వున జాబిల్లి వైపు దూసుకెళ్లింది. బాహుబలిగా పేర్కొనే జీఎస్ఎల్వీ మార్క్3ఎం1 రాకెట్ బరువు 640 టన్నులు.

3,877 కిలోల బరువు కలిగిన చంద్రయాన్-2 కంపోజిట్ మాడ్యూల్తో ఈ రాకెట్ పయనిస్తుంది. వాస్తవానికి ఈ నెల 15వ తేదీన 56 నిమిషాల ముందు సాంకేతిక లోపం తలెత్తి చంద్రయాన్-2 ప్రయోగం ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఆ లోపాన్ని సరిచేసిన తర్వాత వారం రోజులకే దానిని తిరిగి ప్రయోగానికి సన్నద్ధం చేశారు.

16.31 నిమిషాలే
ఈ ప్రయోగంలో బాహుబలి రాకెట్ ప్రయాణం 16.31 నిమిషాలే ఉంటుంది. భూమికి 181 కిలోమీటర్ల ఎత్తుకు చేరిన తర్వాత చంద్రయాన్-2 మాడ్యూల్ను రోదసిలో వదిలి పెడుతుంది. ఇలా భూమికి 170.06 కి.మీ. దగ్గరగా, 39.120 కి.మీ. దూరంగా ఉండే దీర్ఘ వృత్తాకారపు భూ కక్ష్యలోకి చంద్రయాన్ మాడ్యూల్ చేరుకున్న వెంటనే కర్ణాటక బైలాలులోని ఉపగ్రహ నియంత్రణ కేంద్రం దానిని తన ఆధీనంలోకి తీసుకోనుంది.

ప్రయాణ సమయం
చందమామ చెంతకు చేరేందుకు చంద్రయాన్-2 మాడ్యూల్కు 48 రోజులు పట్టనుంది. భూ కేంద్రం నుంచి చంద్రయాన్-2 మాడ్యూల్లోని ద్రవ ఇంధనాన్ని అనేక పర్యాయాలు మండిస్తూ కక్ష్యలను మార్పుచేస్తూ చంద్రుడి వైపు పయనింప చేస్తారు. 23వ రోజున చంద్ర బదిలీ కక్ష్యలోకి చొప్పించనున్నారు. తర్వాత ఆర్బిటర్ సంచరించే కక్ష్యను చంద్రునికి 100 కిలోమీటర్ల ఎత్తులో వృత్తాకారంగా ఉండేలా చేస్తారు.

సెప్టెంబరు 7వ తేదీ కోసం ఎదురుచూపులు
48వ రోజున అంటే సెప్టెంబరు 7వ తేదీన చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి దిగేందుకు ఆర్బిటర్ నుంచి విక్రమ్ ల్యాండర్ విడిపోతుంది. జాబిల్లిపై దిగిన వెంటనే విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రగ్యాన్ రోవర్ బయటకు వస్తుంది. దిగిన ప్రదేశానికి 500 మీటర్ల పరిధిలో 14 రోజులపాటు సంచరిస్తూ ప్రగ్యాన్ రోవర్ చంద్రునిపై పరిశోధనలు చేయనుంది.

ఇస్రో ఛైర్మన్ శివన్
ఈ రోజు చాలా చరిత్రాత్మకమైన రోజు. చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతమైందని ప్రకటించడానికి చాలా సంతోషిస్తున్నా. చంద్రుడిపైకి భారత ప్రయాణానికి ఇది తొలి దశ. చంద్రుడిపై ఇంతవరకూ ఎవరూ పరిశోధించని ప్రాంతాలపై పరిశోధన జరిపే ఉద్దేశంతో చంద్రయాన్-2 ను ప్రయోగించాం.చివరి నిమిషంలో చాలా జాగరూకతతో సాంకేతిక లోపాన్ని గుర్తించి ప్రయోగాన్ని గతంలో ఆపేశాం. 24గంటల్లో దాన్ని సరిచేసి, మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో ప్రయోగానికి సిద్ధమయ్యాం. అహర్నిశలూ కష్టపడి పనిచేసే ఇస్రో సిబ్బంది, ఇంజనీర్లు, ఇతర విభాగాల సిబ్బంది కారణంగానే ఇది సాధ్యమైంది" అని ఇస్రో ఛైర్మన్ శివన్ ప్రకటించారు.

130 కోట్ల మంది సంకల్పం
చంద్రయాన్-2 ప్రయోగంపై ప్రధాని మోదీ ట్విటర్ వేదికగా ప్రశంసలు కురిపించారు.చరిత్రలో నిలిచిపోయే ప్రత్యేక క్షణాలివి.శాస్త్ర సాంకేతిక రంగంలో ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి చంద్రయాన్ 2 ప్రయోగం ద్వారా మన శాస్త్రవేత్తల సామర్థ్యం, 130 కోట్ల మంది సంకల్పాన్ని చాటిచెప్పాం. ప్రతి భారతీయుడూ ఈరోజు ఎంతో గర్విస్తున్నాడని ప్రధాని ప్రశంసించారు.

రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ట్వీట్
చంద్రయాన్ 2 ప్రయోగం భారతీయులందరికీ గర్వకారణం. మన శాస్త్రవేత్తలు, ఇంజినీర్లకు శుభాకాంక్షలు'' అని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు.చంద్రయాన్ -2ను నింగిలోకి ప్రయోగించినట్లు ఇస్రో తన ట్విటర్ ద్వారా ప్రకటించింది.

చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం మొదటి ప్రయత్నం
భారత్ చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం చేస్తున్న మొట్టమొదటి ప్రయత్నమిది. ఉపరితలం మీద దిగటానికి ప్యారాచూట్ ఉపయోగించటానికి వీలులేదు. గతంలో సాఫ్ట్ ల్యాండింగ్ కోసం చేసిన ప్రయోగాల్లో సగం విఫలమయ్యాయి. తాజా ప్రయోగం విజయవంతమైతే అంగారక గ్రహం మీద, ఆస్టరాయిడ్ల మీద సాఫ్ట్ ల్యాండింగ్ ప్రయోగానికి, చంద్రుడి మీదకు మనిషిని పంపించటానికి అవకాశాలు పెరుగుతాయి.


Click it and Unblock the Notifications








