చందమామను ముద్దాడనున్న చంద్రయాన్ -2,మరో వారంలో..
భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యయనాన్ని లిఖిస్తూ నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్2 ఈ నెల 20వ తేదీన చంద్రుడిని సమీపించనున్నది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్2 సెప్టెంబర్ 7వ తేదీన చంద్రుడిపై దిగనున్నదని ఇస్రో ఛైర్మన్ కె శివన్ చెప్పారు. చంద్రయాన్ ఈ నెల 20వ తేదీన చంద్రుడి కక్ష్యలోకి చేరుతుందని, తద్వారా చంద్రుడికి సమీపంలోకి వెళుతుందని ఆయన అన్నారు. సెప్టెంబర్ 7వ తేదీన చంద్రుడిపై దిగుతుందని, ఇది తమ పూర్తి ప్రణాళిక అని ఆయన చెప్పారు.

ఈ నెల 14వ తేదీ తెల్లవారుజామున మూడున్నర గంటలకు చంద్రయాన్2 ట్రాన్స్ లూనార్ ఇంజెక్షన్ అనే ప్రక్రియకు లోనవుతుందని, తద్వారా భూమిని పూర్తిగా వదిలి చంద్రుడివైపు దూసుకుపోతుందని ఆయన చెప్పారు. భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ శతజయంతి సందర్భంగా అహ్మదాబాద్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో శివన్ పాల్గొన్నారు.

ఐదు సార్లు కక్ష్య పెంపు ప్రక్రియలు
3850 కిలోల బరువున్న చంద్రయాన్-2లో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ ఉంటాయి. ఈ వ్యోమనౌకను గత నెల 22న శ్రీహరికోట నుంచి ప్రయోగించిన సంగతి తెలిసిందే. గత నెల జులై 22న చంద్రయాన్-2ను ప్రయోగించిన తర్వాత.. ఐదు సార్లు కక్ష్య పెంపు ప్రక్రియలు చేపట్టామని శివన్ తెలిపారు. ఇప్పటి వరకు ప్రతి ప్రక్రియ విజయవంతమైందని.. ఇక అత్యంత కీలకమైన కక్ష్య పెంపు ప్రక్రియను బుధవారం ఉదయం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.

ట్రాన్స్-లూనార్ ఇంజెక్షన్ ప్రక్రియ
ఆగస్టు 14న తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ట్రాన్స్-లూనార్ ఇంజెక్షన్ ప్రక్రియ జరుపుతామన్నారు. దీంతో చంద్రయాన్ -2 భూకక్ష్యను వదిలి చంద్రుడి కక్ష్య దిశగా పయనిస్తుందని, ఆ తర్వాత లూనార్ ఆర్బిట్ ఇన్సర్షన్ ప్రక్రియ చేపడతామని.. ఆగస్టు 20 నాటికి జాబిల్లి స్థిర కక్ష్యలోకి ప్రవేశిస్తుందన్నారు. అప్పుడు కూడా కొన్ని కక్ష్య పెంపులు చేపట్టిన తర్వాత చివరగా సెప్టెంబరు 7న చంద్రుడి ఉపరితలంపై దక్షిణ ధ్రువానికి సమీపంలో దిగుతుందన్నారు.

విద్యార్థులు ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఇస్రో అవకాశం
ఇదిలా ఉంటే భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రాజక్టు చంద్రయాన్-2. ఇటీవలే రోదసిలో ప్రవేశించిన చంద్రయాన్-2 సెప్టెంబరు 7న చంద్రుడి దక్షిణ ధృవంలో కాలుమోపనుంది. ఈ అద్భుత ఘడియలను విద్యార్థులు ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఇస్రో అవకాశం కల్పిస్తోంది. 8వ తరగతి నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు ఓ ఆన్ లైన్ టాలెంట్ పరీక్ష నిర్వహించి ప్రతిభావంతులను ఎంపిక చేస్తారు. వారికి చంద్రుడిపై చంద్రయాన్-2 దిగడాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పిస్తారు.

ఇస్రో టాలెంట్ పోటీలో పాల్గొనాలంటే..
మొదట విద్యార్థులు ISRO MyGov పోర్టల్ లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యాక ఆన్ లైన్ క్విజ్ నిర్వహిస్తారు. ఈ క్విజ్ లో పెద్దవాళ్లు తమ పిల్లలకు సహకరించవచ్చు కానీ, సమాధానాలు పూర్తిగా పెద్దవాళ్లే చెప్పకూడదు. ఈ విషయంలో పెద్దవాళ్లు నైతికత పాటించాలని నిర్వాహకులు సూచిస్తున్నారు.

10 నిమిషాల వ్యవధిలో 20 ప్రశ్నలకు జవాబు
ఆగస్టు 10 నుంచి 20వ తేదీ వరకు ఈ ఆన్ లైన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉంటుంది. ఆగస్టు 10న 12.01 గంటలకు ప్రారంభమై ఆగస్టు 20న 11.59 గంటలకు ముగుస్తుంది. పోటీలో పాల్గొనే విద్యార్థి 10 నిమిషాల వ్యవధిలో 20 ప్రశ్నలకు జవాబు ఇవ్వాలి. పోటీ మొదలైన తర్వాత మధ్యలో నిలిపివేయడం వీలుకాదు. కాల పరిమితితో కూడిన క్విజ్ కాబట్టి వేగంగా స్పందించే విద్యార్థులను గుర్తించడమే ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశంగా తెలుస్తోంది.

ఒక్కో రాష్ట్రం ఇద్దరు విద్యార్థులు
ఒక్కో రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతం నుంచి ఇద్దరు విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. విజేతలకు ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి చంద్రయాన్-2 చంద్రుడిపై దిగే మధుర క్షణాలను ప్రత్యేకంగా వీక్షించే అవకాశం కల్పిస్తారు. ఈ మేరకు బెంగళూరులోని ఇస్రో కార్యాలయం ఏర్పాట్లు చేసింది.


Click it and Unblock the Notifications








